ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం.. భారత ఆహార రంగానికి భారీ ప్రోత్సాహం
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 2:28PM by PIB Hyderabad
దేశీయ ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని’ (పీఎల్ఐఎస్ పీఐ) భారత ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించడం, అంతర్జాతీయ స్థాయిలో ఆహార తయారీదారులను సృష్టించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 వరకు ఆరు సంవత్సరాల కాలానికి మొత్తం రూ.10,900 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆహార శుద్ధి రంగంలో విలువను జోడించడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.
నాలుగు ప్రధాన ఆహార ఉత్పత్తి విభాగాల తయారీని ప్రోత్సహించడమే ఈ పథకంలోని ప్రధాన అంశాలు. ఇందులో మొదటిది.. వండడానికి సిద్ధంగా ఉన్న, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు, శుద్ధి చేసిన పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తులు, మొజారెల్లా చీజ్ ఉన్నాయి. రెండోది.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తయారు చేసే వినూత్న లేదా సేంద్రీయ ఉత్పత్తుల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం. మూడోది.. మన దేశీయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లలో ఒక బలమైన గుర్తింపు పొందేలా మద్దతివ్వడం. ఇందులో భాగంగా విదేశీ దుకాణాల్లో బ్రాండింగ్, నిల్వ చేసే స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, మార్కెటింగ్ కోసం ప్రోత్సాహకాలు అందిస్తారు. 2023 సంవత్సరాన్ని ‘‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి, విక్రయాలను ప్రోత్సహించడానికి, వండడానికి లేదా తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులలో చిరుధాన్యాల వాడకాన్ని పెంచేందుకు పీఎల్ఐ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తోంది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 274 యూనిట్లకు గాను మొత్తం 128 సంస్థలకు ఆమోదం లభించింది. ఈ పథకం ఎంఎస్ఎంఈ రంగం నుంచి కూడా బలమైన భాగస్వామ్యం లభించింది. ఇందులో భాగంగా 68 ఎంఎస్ఎంఈ దరఖాస్తుదారులకు, 40 కాంట్రాక్ట్ తయారీ యూనిట్లకు మద్దతు లభించింది. ఇది పెద్ద ఆహార శుద్ధి సంస్థలతోపాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు కూడా చేయూతనిచ్చే ఈ పథకం సమగ్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. దీని ద్వారా మొత్తం ఆహార శుద్ధి విలువ జోడింపు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ పథకం దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆహార శుద్ధి యూనిట్లలో గణనీయమైన సామర్థ్య పెంపుదల, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆధునీకరణకు దారితీసింది.
పెట్టుబడుల పరంగా ఈ పథకం పనితీరు ఎంతో ప్రోత్సాహకరంగా మారింది. పథకం కింద రూ. 7,722 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా, 22 రాష్ట్రాల్లో మొత్తం రూ. 9,207 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కంపెనీలు తమ ప్రాథమిక వాగ్దానాల కంటే ఎక్కువగానే పెట్టుబడులు పెట్టాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఏటా సుమారు 34 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార శుద్ధి, నిల్వ సామర్థ్యం అదనంగా చేకూరింది. ప్రత్యక్ష పరోక్ష మార్గాల ద్వారా సుమారు 3.29 లక్షల మందికి ఈ పథకం ఉపాధిని అందించింది. కఠినమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ పీఎల్ఐ ఉత్పత్తుల విక్రయాలు 10.58శాతం వార్షిక వృద్ధి రేటును, అలాగే పీఎల్ఐ ఉత్పత్తుల ఎగుమతుల అమ్మకాలు 7.41శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం.
పీఎల్ఐఎస్ఎఫ్పీఐ పథకం ద్వారా చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల విక్రయాలు రూ. 345.73 కోట్ల (2022-23 ఆర్ధిక సంవత్సరం) నుంచి రూ. 1,845.25 కోట్లకు (2024-25 ఆర్థిక సంవత్సరం) పెరిగాయి. అలాగే చిరుధాన్యాల సేకరణ కూడా 1,103.18 మెట్రిక్ టన్నుల నుంచి 17,089.16 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది మునుపటి కంటే 15 రెట్లు అధికం కావడం విశేషం.
పీఎల్ఐ మద్దతు ఉన్న ఉత్పత్తుల అమ్మకాలు, ఎగుమతుల వృద్ధిలో కూడా ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా వండడానికి, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలు, శుద్ధి చేసిన పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తులు, మొజారెల్లా చీజ్, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ పథకం కింద గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. ప్రధానంగా ఉత్పత్తుల తయారీలో పూర్తి స్థాయి విలువ జోడింపు దేశంలోనే జరిగేలా ఈ పథకం నిర్ధారించింది. తద్వారా దేశీయ ఉత్పాదకతను బలోపేతం చేయడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచుతూ, క్షేత్రం నుంచి వినియోగదారుడి వరకు ఉన్న సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది.
భారతీయ ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్ విభాగానికి ఈ పీఎల్ఐ పథకం అండగా నిలిచింది. దీనివల్ల భారతీయ బ్రాండ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించుకోగలుగుతున్నాయి. ఇది ఆహార శుద్ధి రంగంలో భారత్ ఒక బలమైన ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగడానికి భారతీయ ఆహార బ్రాండ్ల అంతర్జాతీయ గుర్తింపును పెంచడానికి ఎంతో దోహదపడుతోంది.
మొత్తంగా పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులకు ఊతమివ్వడం, భారతీయ బ్రాండ్లకు మద్దతునివ్వడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దేశంలోని ఆహార శుద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవసాయ రంగంలో విలువ జోడింపును పెంచడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, దేశాన్ని ఆహార శుద్ధి రంగానికి ప్రపంచ కేంద్రంగా మార్చాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ పథకం కొనసాగుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2249904)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8