మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు: వృద్ధి నుంచి ప్రపంచ స్థాయి పోటీ దిశగా
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 9:40AM by PIB Hyderabad
ఆహార భద్రత, ఉపాధి, ఎగుమతి ఆదాయం, స్థిరమైన జీవనోపాధిని అందించటంలో భారత మత్స్య రంగం కీలక పాత్ర పోషిస్తోంది. 2015 నుంచి భారత ప్రభుత్వం ఈ రంగంలో రికార్డు స్థాయిలో రూ.39,272 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ రంగం ప్రాథమిక స్థాయిలో దాదాపు 3 కోట్ల మంది మత్స్యకారులకు, చేపలు సాగు చేసే రైతులకు ఉపాధిని కల్పిస్తోంది. ఇక అనుబంధ రంగాలతో కలిపితే ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో సుమారు 8 శాతం వాటాతో చేపల పెంపకంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. దశాబ్ద కాలంగా మత్స్య రంగం సంప్రదాయక పోకడలను దాటి వాణిజ్యపరంగా కీలక రంగంగా మారింది. చిన్న తరహా మత్స్యకారులందరితో కలిసి సమగ్ర వృద్ధిని సాధించటం ఉత్పత్తిలో స్పష్టంగా కనిపిస్తోంది. 2019‑20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. 2024‑25 నాటికి 197.75 లక్షల టన్నులకు చేరుకుంది. ఈ రంగం ఏటా సగటున 7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.
గత 11 ఏళ్లలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు సగటున 7 శాతం వార్షిక వృద్ధితో గణనీయమైన, స్థిరమైన పురోగతిని సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,213 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతులు.. 2024-25 నాటికి రెట్టింపునకుపైగా పెరిగి రూ.62,408 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ. 43,334 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు ప్రధాన పాత్ర పోషించాయి.
సుమారు 350కి పైగా రకాల సముద్ర ఉత్పత్తులతో భారత్ వైవిధ్యమైన ఎగుమతులు చేస్తుంది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024-25 గణాంకాల ప్రకారం.. అమెరికాకు భారత ఎగుమతుల్లో అత్యధికంగా 36.42 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో ప్రధాన మార్కెట్గా చైనా ఉంది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, ఆగ్నేయాసియా, జపాన్, మధ్యప్రాచ్య దేశాలు, ఇతర ప్రపంచ మార్కెట్లన్నింటికీ సుమారు 9 శాతం వాటా ఉంది. భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానంగా శీతలీకరించిన రొయ్యలు, ఆ తర్వాతి స్థానాల్లో శీతలీకరించిన చేపలు, స్క్విడ్, ఎండబెట్టిన ఉత్పత్తులు, కట్ల్ఫిష్, సురిమి ఆధారిత ఉత్పత్తులు, సజీవ, శీతలీకరించిన సముద్ర ఉత్పత్తులున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్తో పాటు ఉత్పత్తుల వైవిధ్యతను ప్రతిబింబిస్తోంది. మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా 2.5 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. దీని ద్వారా లభించే ఎగుమతి విలువ 742 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
కొన్ని వస్తువులపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించటానికి, ప్రపంచ సముద్ర ఉత్పత్తుల మార్కెట్లో భారత్ ఉనికిని మరింత బలోపేతం చేయటానికి ఎగుమతి ఉత్పత్తుల వైవిధ్యతను ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా విలువ ఆధారిత వ్యవస్థ అంతటా విస్తృతమైన మద్దతును మత్స్య శాఖ అందిస్తోంది. ఇందులో భాగంగా నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి, ఉప్పు నీటి సాగు, ఎగుమతి ఆధారిత జాతులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాధులను గుర్తించటం, ఉత్పత్తుల మూలాలను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయటం, సామర్థ్య పెంపు వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. సముద్ర ఉత్పత్తుల రంగాన్ని బలోపేతం చేయటానికి పంట అనంతర మౌలిక సదుపాయాలు, నిరంతరం అందుబాటులో ఉండే శీతలీకరణ వ్యవస్థలు, ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, చేపల ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధిలో పెట్టుబడులను పెంచుతోంది. అంతేకాక.. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో పట్టు సాధించటానికి, ఉత్పత్తుల వైవిధ్యతను పెంచటానికి చేపల పెంపకంలో అధిక విలువ గల జాతుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాటిలో ట్యూనా, సీబాస్, కోబియా, పొంపానో, గిఫ్ట్ తిలాపియా, గ్రూపర్ వంటి చేపల రకాలు.. పీతలు, టైగర్ రొయ్యలు, స్కాంపీ, సముద్రపు పాచి వంటివి ఉన్నాయి. భారతదేశ ఎగుమతి పరిధిని విస్తరించటం, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్తమ ధరలను పొందటమే దీని ఉద్దేశం.
కీలక అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ స్థానాన్ని నిలుపుకునేందుకు మత్స్య రంగాన్ని అంతర్జాతీయ నిబంధనలకు, స్థిరత్వ ప్రమాణాలకనుగుణంగా క్రమబద్ధీకరిస్తోంది. ప్రధానంగా అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఉండటంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. మెరైన్ మామల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంఎంపీఏ) ప్రకారం.. సముద్ర క్షీరదాలు వలల్లో చిక్కుకోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రీయ అంచనాలు, సంబంధిత వర్గాలతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా 2025లో అమెరికా అధికారుల నుంచి అనుకూలత గుర్తింపును భారత్ పొందింది. దీనివల్ల డిసెంబర్ 2025లో గడువు తర్వాత కూడా అంతరాయం లేకుండా అమెరికా మార్కెట్కు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయి. వన్యప్రాంత రొయ్యల ఎగుమతులపై ఆంక్షలను తొలగించటానికి రొయ్యల ట్రాలీలకు తాబేలు బహిష్కరణ పరికరాలను (టీఈడీలు) అమర్చే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. తీరప్రాంత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతి చేసే ఉత్పత్తుల నాణ్యతను గుర్తించే విధానాలను, ధ్రువీకరణ వ్యవస్థలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ఆహార భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ నిశితంగా పర్యవేక్షించేందుకు జాతీయ డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలిలో సుస్థిరమైన చేపల వేటను నియంత్రించే నూతన నిబంధనలతో పాటు భారతదేశాన్ని బాధ్యతాయుతమైన, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టేందుకు జరుగుతున్న సమష్టి కృషిని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.
మత్స్య రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు భారత మత్స్య శాఖ పలు నియంత్రణ, దిగుమతి ప్రక్రియలను చేపట్టింది. ఇందులో భాగంగా శానిటరీ ఇంపోర్ట్ పర్మిట్ (సిప్) వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసి, జాతీయ సింగిల్ విండో వ్యవస్థతో అనుసంధానించారు. దీనివల్ల గతంలో అనుమతుల కోసం 30 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు 72 గంటల్లోనే పని పూర్తవుతుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ఎస్ఎఫ్పీ రొయ్యల బ్రూడ్స్టాక్, చేప నూనె, పరిమిత ఆర్ అండ్ డీ నమూనాలు, కేవలం విలువను జోడించటం, తిరిగి ఎగుమతి చేసే అడవి చేపల దిగుమతులపై ఎస్ఐపీ నిబంధనలను ప్రభుత్వం మినహాయించింది. ఇటీవలి చట్టపరమైన సంస్కరణలు చేపల పెంపకం యూనిట్లపై నిబంధనల భారాన్ని మరింత తగ్గించాయి. ఈ రంగాన్ని వాణిజ్యానికి అనుకూలంగా, పెట్టుబడులకు సిద్ధంగా మార్చేందుకు ప్రభుత్వ ప్రయత్నాలను ఇది స్పష్టం చేస్తుంది.
వచ్చే ఐదేళ్లలో భారత ప్రభుత్వం సముద్ర ఉత్పత్తుల ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అధిక విలువ గల ఎగుమతులు, మార్కెట్ విస్తరణ, నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. విస్తృతమైన ప్రాసెసింగ్ సౌకర్యాలు, నైపుణ్యం గల సిబ్బంది, మెరుగైన ధ్రువీకరణ వ్యవస్థల ద్వారా మొత్తం ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటాను పెంచటమే లక్ష్యంగా పెట్టుకుంది. యూకే, ఈయూ, ఏసియాన్, పశ్చిమాసియా దేశాలకు మార్కెట్ల ఎగుమతులను పెంచే ప్రయత్నాలతో పాటు దేశీయంగా ఎగుమతి కేంద్రాలను, మంచినీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయానికి కృషి చేస్తోంది. మెరుగైన శీతలీకరణ వ్యవస్థలు, ఉత్పత్తి మూలాలను గుర్తించే సాంకేతికత, నాణ్యతా ప్రమాణాల నిబంధనలు రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, ప్రధానంగా నాణ్యత గల సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్ను నిలబెట్టేందుకు కీలకంగా మారతాయి.
***
(రిలీజ్ ఐడి: 2248769)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30