ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
దిశా కార్యక్రమంలో న్యాయ సేతు ఏఐ చాట్బాట్, దిషిక చిహ్నం ఆవిష్కరణ... ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని అప్పటికప్పుడు వివిధ భాషల్లోకి అనువదించిన ‘భాషిణి’
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 5:11PM by PIB Hyderabad
విజ్ఞాన్ భవన్లో న్యాయ శాఖ నిర్వహించిన దిశా కార్యక్రమంలో న్యాయ సేతు ఏఐ చాట్బాట్ను, దాని అధికారిక చిహ్నం ‘దిషిక’ను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ ఆవిష్కరించారు.
'న్యాయ సేతు'.. ఒక ధ్వని ఆధారిత, మల్టీమోడల్, బహుభాషా కృత్రిమ మేధతో పనిచేసే చట్టపరమైన సహాయకారి. ఇది పౌరులకు చట్టపరమైన విధానాలు, హక్కులు, వివిధ చర్యలను పలు భారతీయ భాషల్లో సులభమైన మాటలు, టెక్స్ట్ సంభాషణల ద్వారా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. న్యాయ సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దీనిని రూపొందించారు.
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం ద్వారా ఒక సమగ్ర కృత్రిమ మేధ వ్యవస్థగా నిర్మించిన ఈ వేదిక.. పూర్తి స్థాయి వాయిస్ సాంకేతిక వ్యవస్థతో పనిచేస్తుంది. భాషిణి ఏఎస్ఆర్ (ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్), బహుభాషా ఎన్ఎల్పీ (నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్), సంభాషణాత్మక ఏఐ వ్యవస్థల వంటి సమీకృత సాంకేతికతల ద్వారా వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేని వాయిస్ ఆధారిత సేవలను అందిస్తుంది. ఈ పరిష్కారం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. భారతీయ న్యాయ సంహిత వంటి విధానాలకు అనుగుణంగా శిక్షణ పొందడం ద్వారా బాధ్యతాయుతమైన, సురక్షితమైన, సందర్భానికి అనుగుణంగా సమాధానాలను అందిస్తుంది.
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. న్యాయం అందించే ప్రక్రియలో భాష ఇకపై అడ్డంకిగా మారకూడదని, అందరికీ సమానంగా న్యాయం చేకూరేలా చేయడంలో న్యాయ సేతు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పూర్తిగా మాటల ద్వారానే పనిచేసే సాంకేతికతో నిర్మించిన ఈ వేదిక.. ఏఐ సాయంతో వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాయిస్ సేవలను ఎలా అందించవచ్చో నిరూపిస్తుందని తెలిపారు. పౌర సేవలను ప్రజలకు వారి సొంత భాషల్లో చేరువ చేస్తూ, న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.
‘దిషిక’... ఒక స్నేహపూర్వక డిజిటల్ సహాయకురాలిగా పనిచేస్తుంది. ఇది న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేయడంలో వినియోగదారులకు మార్గదర్శకత్వం అందిస్తూ.. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ గురించి పెద్దగా తెలియని వారిలో నమ్మకాన్ని, భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
ఈ కార్యక్రమంలో భాషిణికి చెందిన శ్రుతిలేఖ సాంకేతిక వ్యవస్థ ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ఆయన మాట్లాడుతుండగానే ఇతర భాషల్లోకి అనువదించింది. దీనివల్ల ఎటువంటి అంతరాయం లేకుండా అందరికీ సమాచారం స్పష్టంగా అర్థమైంది.
పౌరులకు, ముఖ్యంగా భాషాపరమైన, విధానపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన అంశాలను న్యాయ సేతు సులభతరం చేస్తుంది. వాయిస్-ఆధారిత, కృత్రిమ మేధ సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రతి పౌరుడికి న్యాయాన్ని చేరువ చేసే క్రమంలో విస్తరించదగిన, అందరికీ అందుబాటులో ఉంటే వాయిస్ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడంలో భాషిని పాత్రను ఈ పరిష్కారం మరింత బలోపేతం చేస్తుంది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కృత్రిమ మేధ ఆధారిత భాషా సాంకేతిక కార్యక్రమమే భాషిణి. దీనిని డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ అమలు చేస్తోంది. ఇది డిజిటల్ ఇండియా కార్పొరేషన్కింద ఉన్న స్వతంత్ర వ్యాపార విభాగం. ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ విశ్లేషణ వేదికలో ఒకటైన నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ (ఎన్హెచ్ఎల్టీ)ని భాషిణి అభివృద్ధి చేసింది. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో అత్యాధునిక వాయిస్, టెక్స్ట్ సాంకేతికతలను అందిస్తుంది. భాషిణి ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ప్రభుత్వ వెబ్సైట్లకు సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ 1.5 కోట్లకు పైగా ఏఐ ప్రాసెసింగ్ పనులను నిర్వహిస్తోంది. ఇది 36 రాతపూర్వక భాషలు, 23 వాయిస్ భాషల్లో 20కి పైగా ప్రత్యేక ఎన్ఎల్పీ సేవలను అందిస్తోంది. ఇందులో సంక్లిష్టమైన గిరిజన మాండలికాలు, అంతర్జాతీయ భాషలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత న్యాయసేతు అమలును డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ఒక పూర్తి స్థాయి పరిష్కారంగా అభివృద్ధి చేసింది. వినియోగదారులు ఎటువంటి ఆటంకం లేకుండా కేవలం తమ మాటల ద్వారానే చట్టపరమైన సేవలను పొందేలా భాషా ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఇది చాటిచెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2247413)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21