పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఏవియేషన్ ఇంజినీరింగ్, ఏవియేషన్ మేనేజ్మెంట్ సహా విమానయాన రంగంలోని పలు కీలక విభాగాల్లో యువతకు శిక్షణ అందించేందుకు డీజీసీఏ, గతిశక్తి విశ్వవిద్యాలయాల మధ్య అవగాహనా ఒప్పందం
విమానయాన రంగంలో కీలక విషయం.. దేశంలో విమానయాన తయారీ రంగానికి సంబంధించిన వ్యవస్థను సమర్థవంతంగా సృష్టించగలగటం: పౌర విమానయాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 9:02PM by PIB Hyderabad
విమానయాన రంగం, ఏవియేషన్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్కు సంబంధించిన శాస్త్ర, సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవటానికి వీలుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో డీజీసీఏ ప్రతినిధి శ్రీ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, జీఎస్వీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ చౌదరి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, రైల్వే బోర్డు ఛైర్మన్ శ్రీ సతీష్ కుమార్తో పాటు డీజీసీఏ, రైల్వే, జీఎస్వీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. “గతి శక్తి, డీజీసీఏ మధ్య ఎంఓయూ కుదిరిన సందర్భంగా రెండు విభాగాలనూ అభినందిస్తున్నాను. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విమానయాన రంగంలో నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయటంలో ఈ ఒప్పందం కీలకంగా నిలవడమే కాక, ఈ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది” అని అన్నారు. “గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో గత 12 ఏళ్లుగా మనం అద్భుతమైన పురోగతిని సాధించాం. ముఖ్యంగా ‘హవాయి చప్పల్ ధరించే సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయాలి’ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ద్వారా విమానయాన రంగం కొందరికే పరిమితం కాకుండా, అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగాం” అని అన్నారు.
పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, ఏవియేషన్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల ద్వారా విమానయాన, ఎంఆర్ఓ రంగానికి నాణ్యమైన మానవ వనరులను అందించటమే ఈ ఎంఓయూ ప్రధాన లక్ష్యం. రాబోయే విద్యా సంవత్సరం 2026-27 (ఆగస్టు 2026) నుంచి ఈ పాఠ్యప్రణాళిక అమల్లోకి వస్తుంది. ఈ అవగాహన ఒప్పందం చరిత్రాత్మక ఘట్టమని గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు. భారతదేశ తదుపరితరం ఎంఆర్ఓ రంగాన్ని బలోపేతం చేయటానికి జీఎస్వీ, డీజీసీఏ కలిసి పనిచేయనున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇరు సంస్థలు సమన్వయంతో, విద్యాపరమైన అవగాహన, నియంత్రణ నిబంధనలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో కూడిన అత్యాధునిక మూడేళ్ల బీఎస్సీ (ఏఎంఈ) కోర్సును రూపొందిస్తాయి. ఈ ఎంఓయూ ప్రకారం.. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ (ఎస్ఏఎఫ్), ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, విడిభాగాల తయారీ, వాటి అనుసంధానం వంటి రంగాల్లో డీజీసీఏకు పరిశోధన, నాలెడ్జ్ పార్ట్నర్గా జీఎస్వీ వ్యవహరిస్తుంది. డీజీసీఏ అధికారుల నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాల్లోనూ జీఎస్వీ సహకరిస్తుంది.
దేశ విమానయాన రంగ భవిష్యత్తు గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ.. “మన దేశంలో బలమైన విమానయాన తయారీ వ్యవస్థను సమర్థవంతంగా సృష్టించగలగటమే.. విమానయాన రంగంలో అత్యంత కీలకమైన అంశం. దీనిపైనే మేం ప్రధానంగా దృష్టి సారించాం. గత 5 ఏళ్లలో ఈ విషయంలో మేం అద్భుతమైన విజయాలని చూశాం. ముఖ్యంగా ఎంఆర్ఓల కేంద్రాల సంఖ్య సుమారు 160 నుంచి 240కు పైగా పెరగటం ఇందుకు నిదర్శనం”.
శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దీని గురించి మరింతగా వివరిస్తూ.. “భారత విమానయాన రంగంలో ఏర్పడుతున్న డిమాండ్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుతం సుమారు 1,700 విమానాల ఆర్డర్లు ఉండటం చాలా పెద్ద గణాంకం. ప్రస్తుత విమానాల సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు. ఈ విమానాలు మన గగనతలంలోకి రావటానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఒకసారి పూర్తిస్థాయి వ్యవస్థ సిద్ధమయ్యాక, బహుశా 2036 నాటికి దాదాపు 3,000 విమానాలుంటాయి’’ అన్నారు. ఆ సమయానికి ఈ విమానాలన్నింటికీ తగిన నైపుణ్యం గల మానవ వనరులు అవసరమన్నారు. రాబోయే 10 ఏళ్లలో సుమారు 10,000 నుంచి 12,000 మంది పైలట్ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం, చాలామంది పైలట్లు విదేశాల్లో శిక్షణ పొంది, ఆ తర్వాత భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యం గురించి మంత్రి మాట్లాడుతూ.. “2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అప్పటిలోగా మనం స్వావలంబన సాధించాలి. మేక్ ఇన్ ఇండియా, ట్రైన్ ఇన్ ఇండియా మంత్రంతో ఆత్మనిర్భర్ భారత్ను చూడాలని మేం కోరుకుంటున్నాం. ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేయటమే ఈ ఎంఓయూ ప్రధాన ఉద్దేశం”.
ముగింపు సందర్భంగా శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. జీఎస్వీ ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య నిపుణులను తయారు చేసేందుకు 62 పరిశ్రమల భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుందని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పానికి మద్దతుగా జీఎస్వీలో ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కోసం అద్భుతమైన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నియంత్రణ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య క్రమబద్ధమైన వారధిని ఈ ఎంఓయూ నిర్మిస్తుంది. కార్-66, కార్-147 నిబంధనల ప్రకారం లైసెన్సింగ్ ప్రమాణాలను నిర్దేశించటాన్ని డీజీసీఏ కొనసాగిస్తుండగా.. పాఠ్యప్రణాళిక ఆవిష్కరణలు, శిక్షకుల అభివృద్ధి, పరిశోధనల అనుసంధానం, పరిశ్రమలతో ముడిపడిన అప్రెంటిస్షిప్ నమూనాలకు జాతీయ విద్యా కేంద్రంగా జీఎస్వీ వ్యవహరిస్తుంది. ఏఎంఈ విద్యలో ప్రత్యక్ష ఎంఆర్ఓ శిక్షణ, సిమ్యులేషన్ ల్యాబులు, ఓఈఎం భాగస్వామ్యాలు, నైపుణ్యాధారిత అభ్యసన పద్ధతులను చేర్చటం ద్వారా జీఎస్వీ-డీజీసీఏల భాగస్వామ్యం అత్యాధునిక శ్రామిక శక్తిని తయారుచేస్తుంది. ఇది భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థల అవసరాలను తీర్చడమే కాక, విమానాల నిర్వహణ, తయారీ రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచస్థాయి పోటీతత్వం గల గమ్యస్థానంగా నిలబెడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2247367)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16