రక్షణ మంత్రిత్వ శాఖ
అగ్రయ్ డెలివరీ – కోల్కతాలోని జీఆర్ఎస్ఈ నిర్మించిన నాల్గవ యాంటీ-సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 8:34PM by PIB Hyderabad
కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ స్వదేశీ రూపకల్పనతో నిర్మించిన ఎనిమిది ఎఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసీ (యాంటీ-సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్) నౌకల్లో నాల్గవదైన ‘అగ్రయ్’ ను 2026 మార్చి 30న కోల్కతాలో భారత నౌకాదళానికి అందజేశారు.
ఈ ఎఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసీ నౌకలను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) వర్గీకరణ నిబంధనలకు అనుగుణంగా జీఆర్ఎస్ఈ రూపొందించి నిర్మించింది. ఇది స్వదేశీ రక్షణ నౌకా నిర్మాణంలో సాధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది.
సుమారు 77 మీటర్ల పొడవు గల ఈ నౌకలు వాటర్జెట్ల ద్వారా నడిచే అతిపెద్ద భారత నౌకాదళ యుద్ధ నౌకలు. వీటిలో అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, తక్కువ లోతు కలిగిన జలాల్లో పనిచేసే సోనార్ వ్యవస్థలు అమర్చారు. ఇవి సముద్రంలో నీటిమీద, నీటిలో ఉన్న ముప్పులను సమర్థంగా గుర్తించి ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నౌకను భారత నౌకాదళంలో చేర్చడం ద్వారా యాంటీ-సబ్మరైన్, మైన్ వార్ఫేర్ సామర్థ్యాలు, తీర ప్రాంత పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతాయి.
ఈ నౌక, 2017లో విరమించిన 1241 పీఈ తరగతికి చెందిన గస్తీ నౌకల్లో నాల్గవదైన పూర్వ ఐఎన్ఎస్ అగ్రయ్కు మరో రూపంగా భావించవచ్చు. తద్వారా, విశిష్టమైన పేర్ల వారసత్వాన్ని కొనసాగించే నావికాదళ సంప్రదాయాన్ని ఇది ముందుకు తీసుకువెళుతోంది.
అగ్రయ్ ను భారత నౌకాదళ అమ్ములపొదిలో చేర్చడం, స్వదేశీ నౌకా నిర్మాణంలో మరో కీలక మైలురాయి. దీన్ని ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికి అనుగుణంగా, 80 శాతానికి పైగా స్వదేశీ భాగస్వామ్యంతో రూపొందించారు. దేశీయ రక్షణ తయారీ వ్యవస్థ పెరుగుతున్న బలానికి, అలాగే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న నిరంతర కృషికి ఈ నౌక ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2247239)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11