దేశవ్యాప్తంగా 17 సమావేశాలు, 4 ప్రాంతీయ కార్యశాలలు నిర్వహించిన 48 మంది సభ్యుల జాతీయ కమిటీ అందించిన సూచనల మేరకు, సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయమంత్రి వెల్లడించారు. ఈ విధానంలోని కీలక అంశాల గురించి వివరిస్తూ.. సహకార సంస్థల మూలాలను బలోపేతం చేయటం, సహకార సంఘాలను విస్తరించటం, క్రీయాశీలక వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేయటం, పారదర్శకమైన, వృత్తిపరమైన నిర్వహణను నిర్ధారించటం, సభ్యుల ప్రయోజానాలే కీలకంగా వ్యవహరించటం, నూతన రంగాలకు విస్తరించటంతో పాటు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయటానికి సొంత సహకార విధానాలను రాష్ట్రాలు రూపొందించుకోవాలని సూచించారు.
జాతీయ సహకార విధానం-2025కి అనుగుణంగా సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు విప్లవాత్మక మార్పులను శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పీఏసీఎస్లను బహుముఖ ఆర్థిక యూనిట్లుగా మార్చటం, అవి 25కు పైగా కార్యకలాపాలను నిర్వహించేలా వీలు కల్పించడం, "త్రిభువన్" సహకార విశ్వవిద్యాలయ స్థాపన, శ్వేత విప్లవం 2.0 ప్రారంభం, జాతీయ సహకార డాటాబేస్ ఏర్పాటు, సహకార ర్యాంకింగ్ వ్యవస్థ, భారత్ టాక్సీ వంటి వినూత్న కార్యక్రమాలున్నాయని తెలిపారు. నూతన విధానాన్ని నిర్ణీత కాలవ్యవధిలో సమర్థవంతంగా అమలు చేయటానికి ఈ సదస్సు కీలకంగా మారుతుందని, సహకార రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుటానీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 80,000లకు పైగా పీఏసీఎస్ల డిజిటలీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. వీటిని బహుళ ప్రయోజనకర, వ్యాపార ఆధారిత, సమర్థవంతమైన సంస్థలుగా మార్చటమే దీని లక్ష్యమని చెప్పారు. పీఏసీఎస్ స్థాయిలో నిల్వ సౌకర్యాల వికేంద్రీకరణ, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించటం, రవాణా ఖర్చులను తగ్గించటం వంటివి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ ప్రత్యేక ఉపన్యాసమిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం అందించే మద్దతును మూడు రెట్లు పెంచే వ్యూహాలను తెలిపారు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి శక్తిమంతమైన సాధనాలుగా సహకార సంస్థలు ఎదుగుతాయని చెప్పారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు డైరెక్టర్ శ్రీ సతీష్ మరాఠే మాట్లాడుతూ.. సమాజంలోని చివరి లబ్దిదారుడికి తక్కువ వడ్డీకే రుణాలను అందించటంలో సహకార రంగం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సదస్సులో భాగంగా డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి ఇంజిన్లుగా పీఏసీఎస్లను బలోపేతం చేయటం, సభ్యుల విద్య, యువత, మహిళల భాగస్వామ్యం, సేంద్రీయ ఉత్పత్తుల విపణిలో నాయకత్వం, సహకార క్రెడిట్, బ్యాంకింగ్ వంటి వివిధ అంశాలపై ఇతివృత్తాల వారీగా చర్చలు జరిగాయి. బ్రేక్ అవుట్ సెషన్లు, బహిరంగ చర్చల ద్వారా విధానాల అమలుకు సంబంధించి ఆచరణాత్మక సిఫార్సులను అందించగా.. భవిష్యత్ కార్యాచరణపై ముగింపు సమావేశంలో చర్చలు జరిగాయి.
జాతీయ సహకార విధానం-2025ని సమర్థవంతంగా అమలు చేయటంలో ఈ జాతీయ సదస్సు ముఖ్య వేదికగా నిలిచింది. ఇది సహకార రంగాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతికతతో, ప్రజాహిత వ్యవస్థగా బలోపేతం చేస్తుందని, తద్వారా “సహకార్ సే సమృద్ధి” దార్శనికత సాకార ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నారు.