మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మానవ అక్రమ రవాణా, వ్యాపారపరమైన లైంగిక దోపిడీ సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి
అక్రమ రవాణా (నివారణ) చట్టం - 1956ను రూపొందించిన భారత ప్రభుత్వం
మహిళల రక్షణ, భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను
అమలు చేయడానికి నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 12:09PM by PIB Hyderabad
దేశ రాజధానితో సహా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యభిచారంలోకి మళ్లుతున్న, భిక్షాటన చేస్తున్న మహిళల సంఖ్యపై మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎలాంటి కేంద్రీకృత సమాచారాన్ని నిర్వహించడం లేదు.
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం ‘పోలీసు’, ‘శాంతి భద్రతలు’ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. శాంతి భద్రతల నిర్వహణ, పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం, మహిళలపై జరిగే నేరాలను దర్యాప్తు చేయడం, విచారించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనా వ్యవస్థల పరిధిలో ఉంటాయి. అమలవుతున్న చట్టాల పరిధిలోని నిబంధనల ప్రకారం ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి వాటికి అధికారం ఉంది. అక్రమ రవాణా, వ్యాపారపరమైన లైంగిక దోపిడీ, సంబంధిత నేరాలను అరికట్టడానికి అక్రమ రవాణా (నివారణ) చట్టం - 1956 (ఐటీపీఏ)ను భారత ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం వ్యభిచారాన్ని వ్యాపారపరమైన లైంగిక దోపిడీగా నిర్వచిస్తుంది. ఇలాంటి దోపిడీకి సహకరించే, ప్రోత్సహించే లేదా లాభం పొందే వారికి విధించే శిక్షలను సూచిస్తుంది. ఈ చట్టాన్ని ప్రాథమికంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా వ్యవస్థలపై ఉంది.
దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, భద్రత, సాధికారత కోసం చేసే ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో ‘మిషన్ శక్తి’ పథకాన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ) అమలు చేస్తోంది. మిషన్ శక్తిలో రెండు భాగాలు ఉన్నాయి. మహిళల భద్రత, రక్షణ కోసం ‘సంబల్’. మహిళా సాధికారత కోసం ‘సామర్థ్య’. ఇంటా బయటా హింసకు గురై ఒత్తిడిలో ఉన్న మహిళలకు అవసరమైన మద్దతును, సాయాన్ని సంబల్ పరిధిలో ఉండే వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ) అందిస్తాయి. వైద్యపరమైన, నాయ్యపరమైన సహాయాన్ని, సలహాలను, తాత్కాలిక ఆశ్రయాన్ని, పోలీసు సాయాన్ని, మానసిక-సామాజిక కౌన్సెలింగ్తో సహా అనేక సేవలను అందిస్తాయి. అదేవిధంగా, సంబల్ పరిధిలో ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ లైన్ (డబ్ల్యూహెచ్ఎల్).. 181 నెంబరు ద్వారా మహిళలకు ఏడాది పొడవునా రోజుకి 24 గంటలూ అత్యవసర, అత్యవసరం కాని సేవలను అందిస్తుంది. ఇది మహిళలను పోలీస్, వన్ స్టాప్ సెంటర్లు, ఆసుపత్రులు, న్యాయ సేవా అధికార సంస్థలు లాంటి తగిన విభాగాలతో అనుసంధానిస్తుంది. అదనంగా, మహిళా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా హెల్ప్ లైన్ పనిచేస్తోంది. దీనిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్-112)తో కూడా ఏకీకృతం చేశారు. అక్రమ రవాణాకు గురయిన వారితో సహా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు ఉపశమనం, పునరావాస సేవలను సామర్థ్య పరిధిలో నిర్వహించే శక్తి సదన్ అందిస్తుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని అందించి, తమకెదురైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా చేయడమే దీని లక్ష్యం. సేవా పంపిణీలో పారదర్శకతను, సౌలభ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎండబ్ల్యూసీడీ 22.01.2025న మిషన్ శక్తి డ్యాష్ బోర్డును (https://missionshakti.wcd.gov.in/) ప్రారంభించింది. ఈ డ్యాష్ బోర్డులో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు (ఏహెచ్టీయూలు), ఓఎస్సీలు, డబ్ల్యూహెచ్ఎల్, శక్తి సదన్ తదితర పథకాల నోడల్ అధికారులు తాజా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ప్రజల సౌలభ్యం కోసం అన్ని ప్రధాన హెల్ప్లైన్లను ఈ పోర్టల్ ఒకే చోట అందిస్తుంది. మిషన్ శక్తి డాష్బోర్డ్ సమాచారాన్ని మిషన్ శక్తి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా పొందవచ్చు. ఇప్పుడు పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న మహిళ తనకు దగ్గరలో ఉన్న ఓఎస్సీలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
మహిళల భద్రత, రక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు కోసం ‘నిర్భయ నిధి’ పేరుతో ప్రత్యేక నిధిని భారత ప్రభతు్వం ఏర్పాటు చేసింది. అవసరానికి అనుగుణంగా నిర్భయ నిధి పరిధిలో అన్ని ప్రాజెక్టులు/పథకాలు అమలవుతాయి. ఈ నిధి వివిధ పథకాల అమలుకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. వాటిలో ఈఆర్ఎస్ఎస్-112, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీ) ఉన్నాయి. వీటితో పాటు ఎనిమిది నగరాలు - అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబయిలో చేపడుతున్న సేఫ్ సిటీ ప్రాజెక్టు, పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులు (డబ్ల్యూహెచ్డీలు), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ)లకు కూడా నిధులు అందిస్తుంది. అలాగే రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబరేటరీ (ఎస్ఎఫ్ఎస్ఎల్)ల్లో డీఎన్ఏ విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్, తదితర వసతులను బలోపేతం చేయడానికి, అత్యాచార, పోక్సో సహా ఇతర చట్టాల పరిధిలో విచారణలో ఉన్న కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక పోక్సో కోర్టులతో పాటుగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాకు కోర్టు (ఎఫ్టీఎస్సీ)లను ఏర్పాటు చేయడానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తుంది.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ఈ సమాచారాన్ని లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2246107)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13