విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో అతిపెద్ద విద్యుత్తు రంగ ప్రదర్శన: భారత్ ఎలక్ట్రిసిటీ సదస్సు 2026 తొలి సంచిక ప్రారంభం
రెండు ప్రధాన నివేదికలు – జాతీయ వనరుల సముచిత వినియోగ ప్రణాళిక, 2035-36 నాటికి 900 గిగావాట్లకు పైగా శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని అనుసంధానించే ప్రసార ప్రణాళిక ఆవిష్కరణ
ఈ రంగంలో ఆవిష్కరణ, అందుబాటు ధరలు, ప్రపంచ భాగస్వామ్యాలపై దృష్టి సారించిన భారత్: శ్రీ మనోహర్ లాల్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 7:24PM by PIB Hyderabad
‘భారత విద్యుత్తు సదస్సు – 2026’ను కేంద్ర విద్యుత్తు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రారంభించారు. ఇది విద్యుత్తు రంగానికి సంబంధించి నాలుగు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ స్థాయి సదస్సు, ప్రదర్శన. నూతన, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి, విద్యుత్తు, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్, విద్యుత్తు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) ఛైర్పర్సన్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్దేశించిన సమయానికంటే సుమారు అయిదేళ్లు ముందుగానే 50 శాతం సంచిత శిలాజేతర విద్యుత్తు సామర్థ్యాన్ని చేరుకోవాలన్న జాతీయ స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాన్ని (ఎన్డీసీ) సాధించడం, శాంతి చట్టం-2025, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్తును సాధించిన దేశంగా మారడం, 2.8 గిగావాట్ల నుంచి ప్రస్తుతం 143 గిగావాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యానికి చేరడం లాంటి విజయాలను శ్రీ మనోహర్ లాల్ ప్రముఖంగా ప్రస్తావించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో భారతీయ విద్యుత్తు రంగంలో అపూర్వమైన రీతిలో రూ. 200 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతి గురించి మంత్రి వివరించారు. విద్యుత్ సరఫరా మౌలిక వసతులు 72 శాతం మేర విస్తరించి 5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు పైగా చేరుకున్నాయన్నారు. ఇవి 2024-25లో ఎదురైన 250 గిగావాట్ల గరిష్ఠ డిమాండును తీర్చగలిగాయని, 270 గిగావాట్లకు పైబడి వచ్చే డిమాండును తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో భవిష్యత్తులో తక్కువ ధరకే విద్యుత్తును ఎగుమతి చేసే దేశంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందన్నారు. 2047 నాటికి అభివృధ్ధి చెందిన దేశంగా మారాలనే భారత్ లక్ష్య సాధనకు విద్యుత్తు రంగం వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సీమాంతర విద్యుత్తు అనుసంధానం, సముద్ర గర్భంలో ప్రసార వ్యవస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు.
‘‘ఈ రోజు సాధారణమైనది కాదు. విద్యుత్తు రంగంలో పరివర్తనకు భారత్ సంకల్పం తీసుకున్న రోజు. సంప్రదాయ వనరులపై ఆధారపడటం నుంచి సౌరశక్తి వినియోగం దిశగా మన దిశను మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. విద్యుత్తే అభివృద్ధికి మూలాధారం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయాణంలో ఆవిష్కరణలు, అందుబాటు ధరలు, అంతర్జాతీయ సహకారంపై మా దృష్టిని సారించాం. ఈ సదస్సు ఓ సాధారణ కార్యక్రమంగా తన పరిధిని పరిమితం చేసుకోలేదు. ఇది విద్యుత్తు రంగంలో భారత నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పే ఉద్యమం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రస్తుతం దేశ విద్యుత్తు వ్యవస్థలో థర్మల్ విద్యుత్తుకు సింహభాగం వాటా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలే సుస్థిరమైన ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తాయని శ్రీ ప్రల్హాద్ జోషి అన్నారు. విస్తృతి, వేగం, నైపుణ్యం ఆధారంగా సాగే సమతుల పరివర్తనకున్న అవసరాన్ని ఆయన వివరించారు.
ఈ దార్శనికతకు మరింత బలాన్ని అందిస్తూ.. భారత విద్యుదుత్పత్తి సామర్థ్యం గురించి శ్రీ శ్రీపాద నాయక్ వివరించారు. 2014తో పోలిస్తే.. దేశంలో విద్యుదుత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్తు వేగంగా విస్తరించిందన్నారు. సోలార్ విద్యుత్తు 2.8 గిగావాట్ల నుంచి ప్రస్తుతం 143 గిగావాట్లకు పైగా చేరుకుందని వెల్లడించారు. ఇప్పటికే 32 లక్షల గృహాలు, 23 లక్షల మంది రైతులు శుద్ధ ఇంధన ఉత్పత్తిలో భాగమవుతున్నారని, ఇది భాగస్వామ్యయుత ఇంధన ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్న ప్రయాణాన్ని తెలియజేస్తుందని వివరించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సింక్రోనైజ్డ్ గ్రిడ్లలో ఒకదాన్ని భారత్ నిర్వహిస్తోందని భారత్ విద్యుత్తు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ తెలిపారు. ఈ గ్రిడ్కు అధునాతన సమతుల్య వ్యవస్థలు, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లు, బలమైన విధాన వ్యవస్థల సహకారం ఉందని వివరించారు.
‘‘గడచిన దశాబ్దంలో విధానపరమైన స్పష్టత, విస్తృతి, ఆవిష్కరణలతో భారత విద్యుత్తు రంగం సాధించిన మార్పులు గొప్ప అంతర్జాతీయ నమూనాగా నిలుస్తాయి. దాదాపుగా సున్నాకు చేరుకున్న గరిష్ఠ విద్యుత్తు లోటు నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద సింక్రోనైజ్డ్ గ్రిడ్లలో ఒకదానిగా, తగ్గుతున్న సౌర విద్యుత్తు ధరల నుంచి స్మార్ట్ మౌలిక వసతుల ఏర్పాటు వరకు, అత్యంత సమర్థమైన, విశ్వసనీయమైన, పెట్టుబడులకు అనుకూలమైన వ్యవస్థను మేం నిర్మిస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, ప్రపంచ భాగస్వామ్యాలతో తదుపరి దశ నిర్వచితమవుతుంది’’ అని అన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ ముఖ్యమైన వ్యూహాత్మక నివేదికలను విడుదల చేసింది. వాటిలో దేశంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండును ఇంధన వనరుల సమతుల్యం ద్వారా తీర్చేందుకు రూపొందించిన జాతీయ వనరుల సముచిత వినియోగ ప్రణాళిక, 2035-36 నాటికి 900 గిగావాట్లకు పైగా శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని అనుసంధానించే ప్రసార ప్రణాళిక ఉన్నాయి. 1,37,500 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు, 8,27,600 ఎంవీఏ విద్యుత్తు ఉపకేంద్రాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే విద్యుత్తు ప్రసారానికి సంబంధించిన ముసాయిదా లక్ష్యం. రూ.7.93 లక్షల కోట్ల అంచనా వ్యయంతో వీటిని అభివృద్ధి చేస్తారు. ఫలితంగా పునరుత్పాదక విద్యుత్తు ప్రసారం సులభతరం కావడంతో పాటు, గ్రిడ్ స్థిరత్వం బలోపేతమవుతుంది.
విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పరిశ్రమల నేతృత్వంలో భారత్ విద్యుత్ సదస్సు – 2026ను నిర్వహిస్తున్నారు. దీనిలో 100కు పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతాయి. 80కి పైగా దేశాలకు చెందిన 300కు పైగా వక్తలు, ప్రతినిధులు వీటిలో పాల్గొంటారు. 100 అంకుర సంస్థలతో సహా 500 మంది ఎగ్జిబిటర్లు, 25,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యే ఈ కార్యక్రమం విద్యుత్ రంగంపై దృష్టి సారించిన అంతర్జాతీయ వేదికల్లో ఒకటిగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2242776)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11