హోం మంత్రిత్వ శాఖ
సీఎఫ్ఎస్ఎల్ విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 5:29PM by PIB Hyderabad
దేశంలో ఇప్పటికే ఉన్న చండీగఢ్, ఢిల్లీ, కామ్రూప్ (అసోం), కలకత్తా (పశ్చిమ బెంగాల్), భోపాల్ (మధ్యప్రదేశ్), పూణే (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ)లలోని ఏడు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు అదనంగా.. జమ్మూ (జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం), రాజస్థాన్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కేరళల్లో మరో 8 కొత్త కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దేశంలో ఫోరెన్సిక్ సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వ నిరంతర కృషిలో.. ఈ మౌలిక సదుపాయాల విస్తరణ భాగంగా ఉంది.
ఫోరెన్సిక్ డేటాను డిజిటల్గా భద్రపరచడం కోసం ‘ఇ-ఫోరెన్సిక్స్’ అనే కేంద్రీకృత అప్లికేషన్ను రూపొందించారు. ఇది డేటా నిల్వ ఉన్న సమయంలోనూ, బదిలీ అవుతున్నప్పుడూ.. అన్ని దశల్లోనూ దాని భద్రతకూ, సమగ్రతకూ హామీ ఇస్తుంది. అంతేకాకుండా సమర్థంగా సాక్ష్యాధారాల నిర్వహణ వ్యవస్థ కోసం అన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలల నుంచి వచ్చే డేటాను క్రమపద్ధతిలో నిక్షిప్తం చేయడానికి ‘మహిళా భద్రత (సేఫ్టీ ఆఫ్ విమెన్)’ సమీకృత పథకం కింద జాతీయ ఫోరెన్సిక్ డేటా కేంద్రం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం ‘'పోలీస్’, ‘ప్రజల శాంతిభద్రతలు’ రాష్ట్ర జాబితాలోని అంశాలు. శాంతిభద్రతల నిర్వహణ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణతోపాటు.. నేర పరిశోధన, నేరస్థుల విచారణ, సంబంధిత ఫోరెన్సిక్ సైన్స్ కేంద్రాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయినా, రూ. 4,800 కోట్లకు పైగా వ్యయంతో కూడిన ‘నిర్భయ నిధి’ వంటి వివిధ పథకాలు సహా వివిధ పథకాల ద్వారా దేశంలో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విశేష చర్యలు చేపట్టింది:-
i. చండీగఢ్లోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో అత్యాధునిక డీఎన్ఏ విశ్లేషణ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం ఏర్పాటు.
ii. డిజిటల్ మోసాలు/సైబర్ ఫోరెన్సిక్లకు సంబంధించిన కీలక కేసులను విచారించడం కోసం హైదరాబాద్లోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో ఒక జాతీయ సైబర్ ఫోరెన్సిక్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. దీనితోపాటు ‘విమెన్ సేఫ్టీ’ సమీకృత పథకం కింద మరో ఆరు అదనపు జాతీయ సైబర్ ఫోరెన్సిక్ లేబొరేటరీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
iii. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల్లో డీఎన్ఏ విశ్లేషణ/సైబర్ ఫోరెన్సిక్ సామర్థ్యాల బలోపేతం కోసం.. నిర్భయ నిధి పథకం కింద ఇప్పటి వరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేయూతనిచ్చింది.
iv. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూటర్లు, వైద్య అధికారులకు డీఎన్ఏ సాక్ష్యాధారాల సేకరణ, నిల్వ, నిర్వహణపైనా, అలాగే లైంగిక దాడులకు సంబంధించి సాక్ష్యాల సేకరణ కిట్ల వినియోగంపైనా ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. పోలీసు పరిశోధన, అభివృద్ధి బ్యూరో (బీపీఆర్డీ), ఎల్ఎన్జేఎన్ జాతీయ నేర విచారణ శాస్త్ర, ఫోరెన్సిక్ సైన్సుల సంస్థ (ఇప్పుడు ఢిల్లీలోని జాతీయ ఫోరెన్సిక్ సైన్సుల యూనివర్సిటీ ప్రాంగణం) ఇప్పటివరకు 36,915 మంది దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూటర్లు, వైద్య అధికారులకు శిక్షణ ఇచ్చాయి.
v. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఫోరెన్సిక్ రంగానికి అవసరమైన నిపుణులను అందించడం కోసం.. 2020లో పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ఫోరెన్సిక్ సైన్సు యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొదట గుజరాత్లోని గాంధీనగర్, ఢిల్లీలో క్యాంపస్లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు గోవా, అగర్తలా (త్రిపుర), భోపాల్ (మధ్యప్రదేశ్), ధార్వాడ్ (కర్ణాటక), గువహటి (అస్సాం), నాగ్పూర్ (మహారాష్ట్ర), ఖోర్దా (ఒడిశా), రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), చెంగల్పట్టు (తమిళనాడు), రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో అదనంగా మరో 14 ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అలాగే ఇంఫాల్ (మణిపూర్), పూణే (మహారాష్ట్ర)లలో శిక్షణ సంస్థలను కూడా ఎన్ఎఫ్ఎస్యూ ఏర్పాటు చేసింది.
vi. ఫోరెన్సిక్ సామర్థ్యాల ఆధునికీకరణ పథకం కింద.. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఆధునీకరణ / స్థాయి పెంపు కోసం రూ. 420 కోట్లు మంజూరయ్యాయి. అలాగే, దేశంలోని అన్ని జిల్లాలు, రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్ల కోసం ‘మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ల’ను సమకూర్చుకునేందుకు రూ. 496.66 కోట్ల కేటాయింపునకు ఆమోదం లభించింది.
లోక్సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2241543)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10