సహకార మంత్రిత్వ శాఖ
భారత్ టాక్సీ విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 4:45PM by PIB Hyderabad
‘సహకారం ద్వారా సమృద్ధి’ అన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. సహకార రంగాన్ని బలోపేతం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా, ప్రజలే కేంద్రంగా రవాణా మార్గాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సహకార మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. బహురాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002 కింద నమోదైన భారత్ టాక్సీని.. 2025 జూన్ 6న సహకార రంగంలో పనిచేస్తున్న 8 జాతీయ స్థాయి సంస్థలు నెలకొల్పాయి. భారత్ టాక్సీ ముఖ్య లక్షణాలిలా ఉన్నాయి:
-
సహకార యాజమాన్య నమూనా: ఒక బహు రాష్ట్ర సహకార సంస్థగా ఈ వేదికను రూపొందించారు. ఇందులో డ్రైవర్లు, వాహన యజమానులు సభ్యులుగా, భాగస్వాములుగా ఉంటారు. దీనివల్ల వారికి ఉమ్మడి యాజమాన్య హక్కులు లభించడమే కాకుండా, నిర్వహణలోనూ భాగస్వామ్యం లభిస్తుంది.
-
ప్రజాస్వామిక పాలన: సభ్యులు ఎన్నుకున్న సంచాలక మండలి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) ఈ సహకార సంస్థను నిర్వహిస్తుంది. దాంతో నిర్ణయాధికారంలో అందరి భాగస్వామ్యానికీ, కార్యకలాపాలను ప్రజాస్వామ్యబద్ధంగా పర్యవేక్షించడానికీ అవకాశం లభిస్తుంది. డ్రైవర్ల ప్రయోజనాలకు సమర్థమైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం.. డ్రైవర్ల తరఫున ఇద్దరు ఎన్నుకున్న ప్రతినిధులు (సారథులు) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యులుగా ఉంటారు.
-
డ్రైవర్లు కేంద్రంగా భారత్ టాక్సీ వేదిక: కమిషన్ ఆధారిత సమీకరణ నమూనాలకు ప్రత్యామ్నాయంగా.. సభ్యుల యాజమాన్యంలో నడిచే డిజిటల్ రవాణా వేదికను రూపొందించాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. డ్రైవర్లు తమ ఆదాయాన్ని పూర్తిగా తమ వద్దే ఉంచుకుంటూ, అదే సమయంలో ఆ వేదిక యాజమాన్యంలో భాగస్వాములుగా ఉండేలా చేయడం దీని ముఖ్య లక్ష్యం.
-
అందుబాటు వ్యయంలో పారదర్శకంగా సేవలు: ప్రజలకు పారదర్శకమైన ధరల విధానాన్ని, అందుబాటులో ఉండే రవాణా సేవలను అందించడం భారత్ టాక్సీ వేదిక లక్ష్యం. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు, అణగారిన వర్గాల వారికి ఈ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
-
డిజిటల్ రవాణా మౌలిక సదుపాయాలు: రైడ్ బుకింగ్, వాహనాల ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, వినియోగదారు సేవల కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను భారత్ టాక్సీ వినియోగిస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు సమర్థమైన, పారదర్శకమైన, సులభతరమైన సేవలను అందిస్తుంది.
-
డ్రైవర్ సంక్షేమం, ఉపాధి భద్రత: డ్రైవర్లకు న్యాయబద్ధమైన ఆదాయ అవకాశాలను అందించడం, సామాజిక భద్రతా చర్యలను పెంపొందించడం, గౌరవప్రదమైన పని పరిస్థితులను కల్పించడం, సహకార యాజమాన్యాన్ని అందించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. తద్వారా డ్రైవర్ల జీవనోపాధి భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.
డ్రైవర్ కేంద్రంగా ఉన్న ఆదాయ నమూనాతో కూడిన సహకార సూత్రాల ప్రాతిపదికన భారత్ టాక్సీ వేదిక ఆర్థిక, కార్యాచరణ వ్యవస్థ పనిచేస్తాయి. నిర్వహణ వ్యయాలు, ప్రయాణించిన దూరం, అప్పటి మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డ్రైవర్లు - ప్రయాణికుల మధ్య ఉత్తమమైన సమన్వయాన్ని కుదిర్చేలా.. ధరల నిర్ధారణ విధానాన్ని ఈ సహకార సంఘం నిర్ణయిస్తుంది. పారదర్శకమైన, నియంత్రిత ప్రయాణ రుసుములను నిర్ధారించేలా ఈ ధరల విధానాన్ని రూపొందించారు. వీటిని క్రమబద్ధంగా సమీక్షిస్తూ, ఆ ధరల వివరాలను భాగస్వాములందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. డ్రైవర్ల నుంచి భారత్ టాక్సీ ఎలాంటి కమిషన్నూ వసూలు చేయదు. ఈ సహకార నిర్మాణం వల్ల.. వర్తించే చట్టబద్ధమైన చార్జీలు పోను.. మొత్తం ప్రయాణ రుసుము నేరుగా సభ్యులకే అంటే డ్రైవర్లకు చేరుతుంది. దీనివల్ల వారి ఆదాయం గరిష్ఠంగా పెరుగుతుంది. న్యాయబద్ధమైన, సమానత్వంతో కూడిన రవాణా వ్యవస్థ పెంపొందుతుంది. వాటా మూలధన కంట్రిబ్యూషన్లు, సభ్యత్వ రుసుములు, సహకార నిబంధనల మేరకు అనుమతించదగిన ఇతర వనరుల ద్వారా సహకార సంఘం వనరులను సమీకరించుకుంటుంది. భారత్ టాక్సీలో భారత ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడీ పెట్టలేదు. ఈ రంగంలోని ఇతర సంస్థలతో సమాన స్థాయిలో ఇది పోటీ పడగలదని భావిస్తోంది.
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం – ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్తోపాటు.. గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, సోమనాథ్, ద్వారకల్లో ప్రస్తుతం భారత్ టాక్సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే వచ్చే మూడేళ్లలో దశలవారీగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ, అలాగే దేశవ్యాప్తంగా మండల స్థాయి వరకూ సేవలను విస్తరించాలని భారత్ టాక్సీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిద్వారా మరిన్ని ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో, సహకార ఆధారిత రవాణా సేవలను అందరికీ చేరవేయాలని భావిస్తోంది.
డిజిటల్ లావాదేవీలు, సమీకృత సేవలకు అనువైన సాంకేతిక రవాణా వ్యవస్థగా భారత్ టాక్సీ వేదికను రూపొందించారు. భవిష్యత్తులో ఇతర విస్తృత రవాణా వ్యవస్థలు, సాధ్యమయ్యే చోట డిజిటల్ వాణిజ్య వ్యవస్థలతో కలిసి పనిచేసేలా దీని నిర్మాణం ఉంది. భారత్ టాక్సీ ప్రస్తుతం ఓఎన్డీసీ నెట్వర్కుతో అనుసంధానమై ఉంది. దీంతో ఓఎన్డీసీ నెట్వర్కులోని రవాణా సేవల బ్రాండ్లయిన డిజీహాత్, బాబ్ రైడ్స్, వన్ టికెట్ వంటి వేదికల్లోనూ దీంతో భారత్ టాక్సీ సేవలు కనిపిస్తాయి. సాంకేతికంగా ఓఎన్డీసీ నెట్వర్కులోని ఏ రవాణా సేవల వేదిక అయినా.. తగిన అనుమతి ద్వారా భారత్ టాక్సీ సేవలను తమ వేదికలో పొందుపరచవచ్చు.
ఆర్థిక సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కార్యకలాపాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, డ్రైవర్ల సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా.. డిజిటల్ చెల్లింపుల అనుసంధానం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, డ్రైవర్లకు బీమా సేవల కోసం వివిధ సంస్థలతో ఈ వేదిక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.
లోకసభలో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2241495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11