జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆచూకీ దొరకని వ్యక్తుల సంఖ్య పెరుగుతుందనీ, వారిని గుర్తించే పనితీరు సరిగ్గా లేదన్న వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
ఒడిశా, బీహార్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులు గరిష్ఠంగా నమోదయినట్లు వెల్లడించిన నివేదిక
రెండు వారాల్లోగా పూర్తి నివేదిక అందించాలని ఆదేశిస్తూ బీహార్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు నోటీసుల జారీ
ఈ అయిదు రాష్ట్రాల్లో తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించాలని ఎన్సీఆర్బీని కోరిన కమిషన్
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 12:43PM by PIB Hyderabad
బీహార్లో 2013 నుంచి ప్రతి ఏటా 12,000 నుంచి 14,000 వరకు తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయనీ, వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారనీ, తప్పిపోయిన పిల్లల్లో మూడింట రెండొంతుల మంది మాత్రమే తిరిగి దొరుకుతున్నారన్న పత్రికా కథనాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా ఒడిశా, బీహార్, తెలంగాణ, మహారాష్ట్రలో నమోదవుతున్నాయని నివేదిక పేర్కొంది. మైనర్ బాలుర అక్రమరవాణా కేసుల్లో ఒడిశా తొలి స్థానంలోనూ, బీహార్ తర్వాతి స్థానంలోనూ ఉన్నాయి. రాజస్థాన్లో మైనర్ బాలికల అక్రమ రవాణా కేసులు అధికంగా నమోదయ్యాయి. 2026 మార్చి9న ప్రచురితమైన ఈ పత్రికా కథనం ఆధారంగా ఈ చిన్నారులను భిక్షాటన, బాల కార్మిక వ్యవస్థ, వ్యభిచారం, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లోకి బలవంతంగా నెడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలో ప్రస్తావించిన అంశాలను గమనించిన కమిషన్, అవే నిజమైతే బాధితుల మానవ హక్కులకు సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ తప్పిపోయిన వారి సంఖ్యలో పెరుగుదలను, వారిలో తక్కువ మంది ఆచూకీ మాత్రమే తెలియడం లాంటి ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంలో రెండు వారాల్లోగా పూర్తి నివేదికను అందించాలని కోరుతూ బీహార్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరళ్లకు నోటీసులు జారీ చేసింది.
ఆచూకీ తెలియరాని వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న లేదా ప్రతిపాదిత చర్యల గురించి నివేదికలో ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ రాష్ట్రాల్లో తప్పిపోయిన వ్యక్తుల స్థితిగతులకు సంబంధించిన తాజా గణాంకాలను రెండు వారాల్లోపు అందించాలని ఎన్సీఆర్బీని కమిషన్ కోరింది.
***
(రిలీజ్ ఐడి: 2240043)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13