కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2026 నిర్వహించిన ఈఎస్ఐసీ.. దేశవ్యాప్తంగా 'ప్రత్యేక సేవా పక్షోత్సవాల' ముగింపు
3.84 కోట్ల మందికి పైగా బీమా వ్యక్తుల సంక్షేమం, 'నిస్వార్థ సేవ' పట్ల ఈఎస్ఐసీ అంకితభావాన్ని చాటిచెప్పిన 'త్యాగంలోనే ప్రతిఫలం' నినాదం
ప్రత్యేక సేవా పక్షోత్సవాల్లో భాగంగా, నూతన కార్మిక చట్టాలకనుగుణంగా 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ
సామాజిక భద్రతా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సువిధా సమాగమాల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 11:30AM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయంలో మార్చి 10న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 వేడుకలతో ఈఎస్ఐసీ ప్రత్యేక సేవా పక్షోత్సవాలు-2026 విజయవంతంగా ముగిశాయి. మహిళా ఉద్యోగులు, లబ్దిదారుల హక్కులు, గుర్తింపు, సంక్షేమానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమానికి ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ అశోక్ కుమార్ సింగ్, ఫైనాన్షియల్ కమిషనర్ శ్రీమతి టి.ఎల్. యాదెన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ మనీష్ కుమార్ అగర్వాల్, మెడికల్ కమిషనర్ (ఎంఈ) డాక్టర్ స్వప్న మిట్టల్ హాజరయ్యారు. అతిథిగా వక్త శ్రీమతి అంజు బహ్రీ, ఆశ్రయ్ ట్రస్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ ముంజేశ్ యాదవ్, ఈఎస్ఐసీ ప్రధాన కార్యాలయ సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం 'త్యాగంలోనే ప్రతిఫలం’.. నిస్వార్థ సేవ పట్ల ఈఎస్ఐసీ అంకితభావాన్ని ఇది అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక భద్రత పట్ల కార్పొరేషన్ నిబద్ధతకు ఈ ఇతివృత్తం శక్తిమంతమైన నిదర్శనమన్నారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా మహిళా లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు, పటిష్టమైన సామాజిక భద్రతను అందిస్తూ, వారి సాధికారతకు ఈఎస్ఐసీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. 3.84 కోట్లకు పైగా బీమా లబ్ధిదారులకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత, ఆరోగ్య సేవలను ఈఎస్ఐసీ అందిస్తోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, సమగ్ర సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దేశవ్యాప్తంగా మహిళా లబ్ధిదారుల సాధికారత, ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి మద్దతిచ్చేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉందని ఈఎస్ఐసీ ఫైనాన్షియల్ కమిషనర్ శ్రీమతి టి.ఎల్. యాడెన్ తెలిపారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న దోపిడీ, వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, ఆశ్రయ్ ట్రస్ట్ చేపట్టిన "పర్పుల్ రిబ్బన్ ప్లెడ్జ్" కార్యక్రమంలో ఈఎస్ఐసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ముంజేష్ యాదవ్ నేతృత్వంలో ఈ ప్రమాణ కార్యక్రమం జరిగింది. సమాజంలో బలహీన వర్గాలకు రక్షణ కల్పించటంలో ఉమ్మడి సామాజిక బాధ్యత కీలకమని ఈ సందర్భంగా తెలియజేశారు.
తమను తాము గౌరవించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో మార్పును ఆహ్వానించాలని అతిథిగా హాజరైన వక్త, లైఫ్ కోచ్ శ్రీమతి అంజు బహ్రీ మహిళలను ప్రోత్సహించారు. ఈఎస్ఐసీలోని ప్రతిభను గౌరవించే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా ఉద్యోగులతో పాటు పోస్టర్ పోటీల్లోని విజేతలను సన్మానించారు.
***
(రిలీజ్ ఐడి: 2238276)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9