నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
యువతకీ, మహిళలకీ, గ్రామీణ ప్రాంతాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకీ సహకారం
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 4:01PM by PIB Hyderabad
దేశంలో వృత్తివిద్యల శిక్షణకు సంబంధించిన నాణ్యతనీ, ప్రయోజనాన్నీ ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబులిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం ఎస్ఈటీయూ.. ‘పీఎం సేతు’) పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ పథకం ముఖ్య లక్ష్యాల్లో -
• పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐస్)తో పాటు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల (ఎన్ఎస్టీఐస్)లో ఇస్తున్న శిక్షణ నాణ్యతని మెరుగుపరచడం,
• మౌలిక సదుపాయాలనీ, సామగ్రినీ పరిశ్రమ ప్రమాణాలకు సరిపడేటట్లుగా ఆధునికీకరించడం,
• కొత్త రంగాల్లోనూ, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న రంగాల్లోనూ పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఉండే దీర్ఘకాలిక కోర్సులతో పాటు స్వల్ప కాల కోర్సులను పరిచయం చేయడం,
• డిమాండుకు తగ్గట్టు నైపుణ్యాల కల్పన, ఉత్తమ ఉద్యోగావకాశాల కల్పన కోసం పారిశ్రామిక రంగంతో సంబంధాలను పటిష్ఠపరుచుకోవడంతో పాటు
• శిక్షణనిచ్చేవారికి (ట్రయినర్లకు) మరిన్ని మెళకువలను నేర్పించేందుకు ఎన్ఎస్టీఐల సామర్థ్యాన్ని పెంపొందించడం భాగంగా ఉన్నాయి.
ఈ పథకంలో రెండు భాగాలు ఉంటాయి:
ఒకటో భాగంలో - హబ్ అండ్ స్పోక్ మాడల్లో 1,000 ప్రభుత్వ ఐటీఐలని ఉన్నతీకరిస్తారు. వీటిలో 200 ఐటీఐలను హబ్ ఐటీఐలుగాను, 800 ఐటీఐలను స్పోక్ ఐటీఐలుగా తీర్చిదిద్దుతారు. వీటిలో పరిశ్రమ అవసరాలకు సరిపడేటట్లు స్మార్ట్ క్లాస్రూములు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ సామగ్రి, కొత్త పాఠ్యక్రమాల కూర్పు వంటివి సమకూరుస్తారు.
రెండో భాగంలో - భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లూధియానాలలో ఉన్న అయిదు ఎన్ఎస్టీఐల సామర్థ్యాన్ని పెంచుతారు. దీనిలో.. ప్రపంచ భాగస్వాముల సహకారంతో ట్రయినర్లకు ఉన్నత నాణ్యతతో కూడిన శిక్షణను అందించడంపై దృష్టి సారిస్తారు. అంతేకాక నైపుణ్యాలకు మెరుగులు దిద్దడానికి వీలుగా నిర్దిష్ట రంగాలకు చెందిన జాతీయ శ్రేష్ఠతా కేంద్రాలను (నేషనల్ ఎక్స్లెన్స్ సెంటర్స్) ఏర్పాటు చేస్తారు.
పరిశ్రమ నాయకత్వంలోని పాలనా మాధ్యమం ద్వారా ఉపాధి తాలూకు మెరుగైన అవకాశాల్ని కల్పించడంపై ‘పీఎమ్-సేతు’ దృష్టిని కేంద్రీకరిస్తుంది. పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను శిక్షణార్థులు అలవరుచుకొనేటట్లు, వాస్తవ పని వాతావరణం తాలూకు అనుభవాన్ని సంపాదించుకొనేటట్లు, బలమైన సంస్థాగత ప్రణాళికలు, సంస్థాగత ప్రణాళికలు, పారిశ్రామిక సంబంధాల మాధ్యమం ద్వారా కెరియర్ గైడెన్సు, ఉద్యోగం పొందడానికి సంబంధించిన సహాయం, స్వయంఉపాధికి సంబంధించిన సహాయం అందుకొనేటట్లు చూస్తూ పరోక్షంగా స్వయంఉపాధికీ, ఔత్సాహిక పారిశ్రామికత్వానికీ అండదండల్ని అందిస్తుంది. ఏమైనా, ఐటీఐ శిక్షణార్థులందరికీ పాఠ్యక్రమంలో 120 గంటల ఉపాధి సంబంధిత నైపుణ్య శిక్షణ (ఒక సంవత్సరం కోర్సుల విషయంలో) తప్పనిసరి చేసేశారు. దీనిలో ఔత్సాహిక పారిశ్రామికత్వంతో పాటు ఆర్థిక అంశాల పట్ల, డిజిటల్ అంశాల పట్ల అవగాహనకు సంబంధించిన మాడ్యూళ్లు కూడా భాగంగా ఉంటాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకూ, శిక్షణార్థులకూ స్వయంఉపాధి అవకాశాల్ని అన్వేషించడంలో సహాయం లభిస్తుంది.
ఈ పథకంలో భాగంగా, ఉన్నతీకరణ ప్రక్రియకు పరిశ్రమ నాయకత్వంలోని స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీస్) సారథ్యం వహిస్తాయి. స్థానిక పరిశ్రమ అవసరాలు, పథకం మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా పాఠ్యక్రమానికి తాజా రూపురేఖలనివ్వడం, శిక్షణ నమూనాల్ని సూచించడం, మౌలిక సదుపాయాల స్థాయిని పెంచడం, పరిశ్రమతో సంబంధాలను ఏర్పరుచుకోవడం, ఉద్యోగం లేదా స్వయం ఉపాధి సదుపాయానికి సంబంధించిన అవసరమైన చర్యలను ప్రతిపాదించే అధికారాలను కూడా ఎస్పీవీలకు అప్పగిస్తారు.
ఈ పథకం అమలు తీరును జాతీయ సారథ్య సంఘం (ఎన్ఎస్సీ) పర్యవేక్షిస్తుంది. ఈ సంఘంలో ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పరిశ్రమ భాగస్వాములు ఉంటారు. ఈ సంఘం విధాన పరంగా సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. దీనికి అదనంగా, రాష్ట్రాల స్థాయుల్లో పురోగతిని ఆయా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించే రాష్ట్ర సారథ్య సంఘాలు (ఎస్ఎస్సీస్) పర్యవేక్షిస్తాయి. ఈ పథకాన్ని ప్రభావవంతంగా అమలు చేస్తూ, ఆశించిన ఫలితాలను సాధించేలా నిర్ణీత కాలం వారీ పర్యవేక్షణ, పనితీరుపై సమీక్షలతో పాటు మూడో పక్షం ద్వారా దీని ప్రభావాన్ని అంచనా వేసే ఏర్పాటు కూడా ఉంది.
ఈ సమాచారాన్ని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం (ఎమ్ఎస్డీఈ) శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌధరి ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2237291)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50