రైల్వే మంత్రిత్వ శాఖ
మిజోరం ఆహార ధాన్యాల సరఫరాలో నూతన అధ్యాయం: రైలు మార్గం ద్వారా పంజాబ్ నుంచి సైరాంగ్కు చేరిన 25,900 క్వింటాళ్ల బియ్యం
ఎఫ్సీఐ సరకు రవాణా రైలు సైరాంగ్కు చేరుకోవటం చారిత్రక ఘట్టం.. కార్యచరణ సామర్థ్యం, మిజోరం రవాణా వ్యవస్థ, ఆహార పంపిణీ వ్యవస్థకు ఊతం
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 4:00PM by PIB Hyderabad
మిజోరంలో ప్రయాణికుల, సరకు రవాణా రైలు సర్వీసుల ప్రారంభంతో ప్రయాణికుల రాకపోకలల్లోనూ, రాష్ట్రవ్యాప్తంగా సరకు రవాణాలోనూ గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పు కేవలం అనుసంధానతను మెరుగుపరచటమే కాక, ఆర్థిక వృద్ధిని, ఆ ప్రాంత పర్యాటక రంగాన్ని బలోపేతం చేసింది.
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ), ఆహార ధాన్యాల సరకు రవాణా మొదటి రైలు మార్చి 3, 2026న సైరంగ్ రైల్వే స్టేషన్కు చేరుకోవటం కీలక ఘట్టం. 42 సరకు రవాణా రైలు పెట్టెల ద్వారా 25,900 క్వింటాళ్ల బియ్యంతో పంజాబ్ నుంచి ఈ రైలు సైరాంగ్ చేరుకుంది. ఆ రాష్ట్రంలో రైలు మార్గం ద్వారా సరకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయటంలో, నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థను మెరుగుపరచటంలో ఈ పరిణామం కీలక ముందడుగు. ఎఫ్సీఐ ఆహారధాన్యాల రైలు విజయవంతంగా సైరాంగ్ చేరుకోవటం ఆ స్టేషన్కు పెరుగుతున్న నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మిజోరాం రవాణా, ఆహార పంపిణీ వ్యవస్థకు మద్దతివ్వటంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరిస్తున్న పాత్రను ఇది స్పష్టం చేస్తుంది.
సెప్టెంబర్ 13, 2025న గౌరవ ప్రధానమంత్రి 51.38 కి.మీ. బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ ప్రారంభంతో మిజోరాం చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ద్వారా మిజోరాం నేరుగా జాతీయ రైల్వే వ్యవస్థతో అనుసంధానమవటంతో రాజధాని ఐజ్వాల్, భారత రైల్వే పటంలో చోటు సంపాదించుకుంది. దీనివల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాక, నూతన రైల్వే ప్రాంతంలో గణనీయమైన ఆర్థిక వృద్ధికి, పర్యాటక రంగ అభివృద్ధికి సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి.
మిజోరాంలో సరకు రవాణా పనితీరు
బైరబీ-సైరాంగ్ రైల్వే సెక్షన్ ప్రారంభమైనప్పటి నుంచి, ఆ మార్గంలో సరకు రవాణా కార్యకలాపాలు నూతనోత్తేజాన్ని పుంజుకున్నాయి. ఈ మార్గాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే 21 సిమెంట్ వ్యాగన్లతో మొదటి గూడ్స్ రైలు విజయవంతంగా సైరాంగ్కు చేరుకుంది. ఇది మిజోరాంనకు నిరంతర సరకు రవాణాకు నాంది పలికింది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు సైరాంగ్ టెర్మినల్కు 30కి పైగా సరుకు రవాణా రైళ్లు వెళ్లాయి. మిజోరాంలో రైలు మార్గం ద్వారా సరకు రవాణా అభివృద్ధిని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో సైరాంగ్ టెర్మినల్కు 3.5 రేక్స్ సిమెంట్ చేరుకుంది. రైలు మార్గం ద్వారా చేరుకున్న ఇతర వస్తువులు.. ఆటోమొబైల్స్ (2 రేక్స్), ఎరువులు (0.5 రేక్స్), స్టోన్ చిప్స్ (20.5 రేక్స్), ఇసుక (4 రేక్స్). వైవిధ్యమైన వస్తువుల నిర్వహణ ద్వారా సైరాంగ్ కీలక సరకు రవాణా కేంద్రంగా ఎదుగుతుందని నిరూపితమవుతోంది. ఇది రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాక, నిర్మాణ సామాగ్రి, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా డిసెంబర్లో 119 ప్రయాణికుల వాహనాలను రవాణా చేసే మొదటి ఆటోమొబైల్ రేక్ సైరాంగ్కు చేరుకుంది. భారీ స్థాయిలో విలువైన వస్తువుల రవాణాలో ఈ రైలు మార్గానికున్న సామర్థ్యం రుజువైంది. పార్శిళ్ల రవాణాను బలోపేతం చేయటానికి భారతీయ రైల్వేలు చర్యలు ప్రారంభించాయి. వీటిలో ఉద్యానవన, త్వరగా పాడైపోయే ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ వ్యాన్ సేవలను ప్రవేశపెట్టటం ద్వారా స్థానిక రైతులు, వ్యాపారులకు మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయి.
మిజోరాంలో పర్యాటక రంగానికి ఊతం
నూతన రైల్వే లైన్ మిజోరాంలో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చింది. ఆరు నెలలుగా రాష్ట్రానికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఫిబ్రవరి 12, 2026న నార్త్ ఈస్ట్ డిస్కవరీ సర్క్యూట్లో భాగంగా భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు తొలిసారిగా సైరాంగ్ రైల్వేస్టేషన్కు చేరుకోవటంతో మిజోరాం రైల్వే సేవలు మరో కీలక ఘట్టాన్ని చేరుకున్నాయి.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, నేపాల్ వంటి ఇతర దేశాల నుంచి 81 మంది పర్యటకులతో వచ్చిన ఈ ప్రత్యేక రైలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో మిజోరం గుర్తింపును చాటిచెబుతోంది. రవాణా సౌకర్యం మెరుగవటంతో స్వదేశీ, విదేశీ పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ఇది ఆతిథ్య, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పర్యావరణ, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. సమ్మిళిత వృద్ధి, ప్రాంతీయ సమైక్యత దృక్పథంతో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి గమ్యస్థానంగా మిజోరాం నిలుస్తోంది.
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ
సెప్టెంబర్ 2025లో బైరాబీ-సైరాంగ్ మధ్య రైలు సర్వీసుల ప్రారంభానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సైరాంగ్-ఆనంద్ విహార్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు వచ్చి, వెళ్లే మార్గాల్లో 150 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ నమోదవటం విశేషం. సైరాంగ్-గౌహతి, సైరాంగ్-కోల్కతా ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా 100 శాతానికి మించి నడుస్తున్నాయి. సైరాంగ్ నుంచి రైల్వే సేవలకు పెరుగుతున్న డిమాండ్ను, ప్రజల ఆదరణను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ రవాణాను బలోపేతం చేస్తూ, ఫిబ్రవరి 9, 2026న సైరాంగ్ నుంచి సిల్చర్కు కొత్త రైలు సర్వీస్ ప్రారంభమైంది. ఇది అస్సాంలోని విద్య, వైద్య, వాణిజ్య కీలక కేంద్రమైన బరాక్ వ్యాలీతో మిజోరాంని అనుసంధానిస్తుంది.
రైల్వే అనుసంధానత విస్తరణ మిజోరాం చరిత్రలో కీలక మలుపు. రవాణా సౌకర్యాలను మెరుగుపరచటం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం, పర్యాటక రంగానికి ఊతమివ్వటం ద్వారా రాష్ట్రంలోని విప్లవాత్మక మార్పుల్లో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మౌలిక సదుపాయాల నిరంతర అభివృద్ధి వల్ల ఈశాన్య భారతంలో సులభంగా చేరుకోగలిగే, అత్యంత ఆకర్షనీయమైన గమ్యస్థానంగా మిజోరం ఎదుగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2235897)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41