స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026లో భారత దేశ కార్యకలాపాలకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వం వహిస్తున్నారు. జీఎస్ఎంఏ మంత్రివర్గ కార్యక్రమం, ఎండబ్ల్యూసీ లాంటి ప్రధాన వేదికల్లో ఉన్నత స్థాయి భాగస్వామ్యంతో, సరసమైన, సమగ్రమైన, భవిష్యత్తుకు అనుగుణంగా ఉన్న డిజిటల్ అనుసంధానత విషయంలో భారత్ ప్రణాళికను వివరించారు.
జీఎస్ఎంఏ మంత్రివర్గ కార్యక్రమం ముగింపు ఉపన్యాసం: ‘‘ధరల అవరోధాన్ని అధిగమించడం’’
‘‘బ్రేకింగ్ ది కాస్ట్ బ్యారియర్’’ అంశంతో నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమం ముగింపు ఉపన్యాసంలో శ్రీ సింధియా కీలక విషయాలను పంచుకున్నారు. అర్థవంతమైన డిజిటల్ భాగస్వామ్యం నుంచి అంతర్జాతీయంగా 3.1 బిలియన్ల మంది ప్రజలను దూరంగా ఉంచుతున్న ధరల సవాళ్లను పరిష్కరించడంపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు.
డిజిటల్ సమ్మిళిత్వంలో పరికరాలు, సేవలు అందుబాటు ధరల్లో ఉండటమే ప్రధాన కేంద్రంగా ఉంటాయని స్పష్టం చేస్తూ. వినియోగ అంతరాన్ని తక్షణమే పూడ్చాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు.
‘‘అనుసంధానత నిజంగా పరివర్తనాత్మకంగా ఉండాలంటే.. అది సార్వత్రికంగా అందుబాటులో ఉండాలి. మన ముందున్న సవాలు సాంకేతికత అందుబాటులో లేకపోవడం కాదు. బిలియన్ల మందిని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగం కాకుండా అడ్డుకుంటున్న ధరలే’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
విధాన సంస్కరణలు, పోటీ, విస్తరణ ద్వారా ధరలను తగ్గించడంలో భారత్ అనుభవాన్ని ఆయన వివరించారు. ‘‘విస్తరణ, ఆవిష్కరణ, స్థిరమైన విధాన వ్యవస్థలు నాటకీయంగా ధరలు తగ్గిస్తాయని భారత డిజిటల్ ప్రయాణం తెలియజేస్తోంది. 5జీ నుంచి 6జీ వ్యవస్థలకు మారుతున్న తర్వాతి తరం కనెక్టివిటీని అందరికీ అందుబాటులో, సమ్మిళితంగా, విస్తరించదగినదిగా ఉంచేలా చేయడమే మనందరి సమష్టి బాధ్యత కావాలి’’ అని తెలిపారు.
అందుబాటు ధరలకు పరికరాలను, ఆవిష్కరణాత్మక ఆర్థిక విధానాలను, సుస్థిరమైన డిజిటల్ వ్యవస్థలను తీసుకురావడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ సంస్థల మధ్య సమన్వయం, బహుళ భాగస్వామ్యంతో కూడిన విధానానికి శ్రీ సింధియా పిలుపునిచ్చారు.
ఎండబ్ల్యూసీ మెయిన్ స్టేజ్పై కీలకోపన్యాసం: ‘‘బిల్ట్ ఫర్ వాట్స్ నెక్ట్స్’’


అదే రోజు సాయంత్రం ఎండబ్ల్యూసీ మెయిన్ స్టేజిలో ‘‘బిల్ట్ ఫర్ వాట్స్ నెక్స్ట్’’ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంలో ఏఐ, క్లౌడ్-నేటివ్ సాంకేతికతలు, అత్యాధునిక మౌలికవసతులపై ఆధారపడి ఉన్న తెలివైన, స్వీకరించదగిన, మానవ-కేంద్రీకృత వేదికలుగా నెట్వర్క్ల పరిణామంపై దృష్టి సారించారు.
ఓ పరికరం స్థాయి నుంచి అవకాశాలను అందించే, ఆవిష్కరణలను, ఆర్థిక వృద్ధిని, సామాజిక సాధారికతను నడిపించే శక్తిమంతమైన చోదకశక్తిగా మారిన కనెక్టివిటీ పరిణామక్రమాన్ని కేంద్ర మంత్రి వివరించారు.
‘‘నెట్వర్కులు తెలివిగా, స్వతంత్రంగా, ముందుచూపు కలిగినవిగా ఉండే యుగంలోకి మనం వెళుతున్నాం. పౌరులు కనెక్టివిటీని ఎలా పొందుతున్నారో, సంస్థలు ఆవిష్కరణలను ఎలా చేస్తున్నాయో ఏఐ-ఆధారిత వ్యవస్థలు, క్లౌడ్-నేటివ్ ఆర్కిటెక్చర్లు, సురక్షితమైన డిజిటల్ వ్యవస్థలు పునర్నిర్వచిస్తున్నాయి’’ అని తెలిపారు.
అలాగే, ‘‘వేగానికి మాత్రమే అనుసంధానత భవిష్యత్తు పరిమితం కాలేదు. ఎలాంటి అవరోధాలు లేని డిజిటల్ అనుభవాలు, స్థిరమైన మౌలిక వసతులు, సుస్థిర వృద్ధిలో ఉంది. సాంకేతికత.. వ్యక్తులను శక్తిమంతం చేయాలి. వ్యాపారాలను బలోపేతం చేయాలి. సమాజాలు అభివృద్ది చెందే వీలు కల్పించాలి’’ అని చెప్పారు.
సురక్షితమైన, విశ్వసనీయమైన, అంతర్జాతీయంగా పోటీనిచ్చే డిజిటల్ మౌలిక వసతులను నిర్మించడంలో భారత దేశ అంకితభావాన్ని ఈ ప్రసంగం పునరుద్ఘాటించింది.
భారత్ పెవిలియన్ ప్రారంభం

విస్తరిస్తున్న భారతీయ టెలికాం తయారీ రంగం సామర్థ్యాలను, ఆవిష్కరణ వ్యవస్థను ప్రదర్శించే భారత్ పెవిలియన్ ప్రారంభం మరో ఆకర్షణ. ఈ పెవిలియన్ ద్వారా ఈ ఏడాది ఎండబ్ల్యూసీలో 40 భారతీయ సంస్థలు, ఆవిష్కర్తలు పాల్గొంటున్నారు.
4జీ, 5జీ రేడియో నెట్వర్క్లు, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు, ఐపీ/ఎంపీఎల్ఎస్ రూటింగ్, బ్రాడ్బ్యాండ్ యాక్సెస్, శాటిలైట్ కమ్యూనికేషన్లు, ఏఐ-ఆధారిత నెట్వర్క్ నిర్వహణ, ఐవోటీ అప్లికేషన్లు, సెమీకండక్టర్-ఎనేబుల్డ్ హార్డ్వేర్, భవిష్యత్తు తరం డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో పరిష్కారాలను అందించే భారతీయ అగ్ర సంస్థలను ఈ పెవిలియన్ ఒక్కచోట చేర్చింది.
డిజైన్ ఆధారిత తయారీ కేంద్రంగా, తక్కువ ఖర్చుతో కూడిన, సురక్షితమైన అనుసంధాన పరిష్కారాలను అందించే విశ్వసనీయమైన ప్రపంచ భాగస్వామిగా భారత్ ఆవిర్భావాన్ని ఈ పెవిలియన్ ప్రతిబింబిస్తుంది.
ఐఎంసీ-2026 కర్టెన్ రైజర్ ఆవిష్కరణ



జీఎస్ఎంఏ ఇన్సైట్స్ హబ్లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2026 కర్టెన్ రైజర్ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో 2026 అక్టోబర్ 7 నుంచి 10 వరకు ఐఎంసీ-2026 జరుగుతుందని ప్రకటించారు. ఇది అధునాతన టెలీకమ్యూనికేషన్లు, ఏఐ-ఆధారిత నెట్వర్కులు, నూతన డిజిటల్ సాంకేతికతలకు అంతర్జాతీయ వేదికగా భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది.
తేజస్ నెట్వర్క్స్ వద్ద ప్రారంభం
తేజస్ నెట్వర్క్స్ బూత్ను సందర్శించినప్పుడు టీజే1600-డీ3 హైపర్ స్కేలబుల్ డీసీఐ ప్లాట్ఫాంను ప్రారంభించారు. ఇది భారత్లో తయారైన అధునాతన ఆప్టికల్ నెట్వర్కింగ్ పరిష్కారాల్లో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అధిక సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీల్లో పెరుగుతున్న భారతదేశ సామర్థ్యాలను ఈ ప్రారంభం తెలియజేస్తుంది.
వ్యూహాత్మక సమావేశాలు, సాంకేతిక చర్చలు

ఎండబ్ల్యూసీ ఎరీనాను సందర్శిస్తున్న సమయంలో ఐటీయూ సెక్రటరీ జనరల్ డోరీన్ బోగ్డాన్ మార్టిన్తో సంభాషించే అవకాశం కేంద్ర మంత్రికి లభించింది. జీఎస్ఎంఏ మంత్రివర్గ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, అంతర్జాతీయ వేదికపై శక్తిమంతమైన భారత టెలికాం వ్యవస్థ, డిజిటల్ పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరించినందుకు కేంద్ర మంత్రిని ఐటీయూ ఎస్జీ అభినందించారు.
భారత్లో సార్వత్రికమైన, అర్థవంతమైన, స్థిరమైన అనుసంధాన వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లే చర్యలను అర్థం చేసుకోవడానికి యూటెల్ శాట్, వయా శాట్తో ద్వైపాక్షిక చర్చలను మంత్రి నిర్వహించారు. భారత దేశమంతటా సురక్షితమైన, అధిక వేగంతో కూడిన, సార్వజనీనమైన, అర్థవంతమైన అనుసంధానాన్ని అందించడం కోసం మంత్రి దార్శనికతను రెండు సంస్థలు అభినందించాయి.

భారతదేశ డిజిటల్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య ఉన్న సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వం వహిస్తున్న భారతీ గ్రూపు ప్రతినిధులతో సైతం శ్రీ సింధియా సమావేశమయ్యారు.

పలు అగ్ర అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన బూత్లను శ్రీ సిందియా సందర్శించి ఆయా నాయకత్వ బృందాలతో చర్చించారు. ఏఐ ఆధారిత, ధరించగలిగిన, న్యూరల్ ఇంటర్ఫేస్ టెక్నాలజీల గురించి మెటా బూత్ వద్ద మంత్రికి వివరించారు. అలాగే మెటా రే-బ్యాన్ డిస్ప్లేను పరీక్షించారు. శబ్దాలతో నిండిన లేదా రద్దీగా ఉండే వాతావరణంలో ఎదుటి వ్యక్తి స్వరాన్ని వేరు చేసేలా ఈ కళ్లద్దాల్లో ఉపయోగించిన ‘కన్వర్జేషన్ ఫోకస్’ ఫీచర్ను కూడా ఆయన పరీక్షించారు.



అవసరానికి తగినట్టుగా 5జీని విస్తరించే సాఫ్ట్వేర్ నిర్వచిత ఏఐ-నేటివ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లను రకుటన్ వద్ద మంత్రి పరిశీలించారు. ఆ సంస్థ సీఈవో హిరోషి మికిటనీను కూడా కలుసుకున్నారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ వద్ద దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వై-ఫై, నెట్వర్క్ పరిష్కారాలను చూశారు.
ఎరిక్సన్ బోర్డ్ ఛైర్మన్ జాన్ కార్ల్సన్తో ఎరిక్సన్ బూత్ వద్ద కేంద్ర మంత్రి ముచ్చటించారు. అధునాతన నెట్వర్క్ సాంకేతికతలు, నూతన 6జీ సామర్థ్యాలపై ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు. మూడు ప్రధానాంశాలను ఇక్కడ ప్రదర్శించారు: సీఎంవేవ్పై 6జీ డేటా కాల్, అనుభవపూర్వకమైన 6జీ ప్రదర్శనలు, భారతీయ అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన కొత్త రేడియో పరిష్కారాలు.

నోకియా సందర్శన సందర్భంగా, జెనరేటివ్ ఏఐ-ఎనేబుల్డ్ ఎడ్జ్ అప్లికేషన్లు, ఇమ్మర్సివ్ 6జీ వినియోగ ప్రయోజనాలను పరిశీలించారు. నోకియా బూత్లో నోకియా అధ్యక్షుడు, సీఈఓ జస్టిన్ హాటార్డ్తో సమగ్ర చర్చ చేపట్టారు.
అత్యాధునిక ప్రాసెసర్ల శక్తి నిండిన ఏఐ-ఆప్టిమైజ్డ్ వర్చువల్ ర్యాన్ పరిష్కరాలను ఇంటెల్ బూత్లో శ్రీ సింధియా పరిశీలించారు.
సిస్కో సందర్శనలో భాగంగా ఏఐ-ఆధారిత ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ ఆటోమేషన్ ప్రదర్శనలను తిలకించారు. అలాగే క్వాల్కమ్ వద్ద ఏఐ-ఆధారిత ర్యాన్ ఆటోమేషన్, అధునాతన 5జీ ఆధునిక వ్యవస్థలు, ఎడ్జ్ ఏఐ వేదికల గురించి మంత్రికి వివరించారు.
అంతకు ముందు, ఎండబ్ల్యూసీ-2026 వద్ద భారత్ కార్యకలాపాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 2026 మార్చి 2న ప్రపంచ, భారతీయ సీఈవోలతో అత్యున్నత స్థాయి విందుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థలను ప్రోత్సహించడంపై ఆలోచనలను పంచుకొనే అవకాశాన్ని భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ విందు అందించింది.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026లోని కార్యక్రమాలు టెలీకమ్యూనికేషన్లు, డిజిటల్ ఆవిష్కరణల్లో భారత్కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రతిబింబిస్తాయి. అలాగే సమ్మిళిత వృద్ధి కోసం సురక్షితమైన, చౌకయిన, భవిష్యత్తుకు అనుగుణమైన అనుసంధాన వ్యవస్థలను నిర్మించడంలో దేశ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తాయి.
టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ) ఆధ్వర్యంలో భారత టెలికమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ), కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఎండబ్యూసీ-2026లో భారతీయ టెలికాం ఆవిష్కర్తలు పాల్గొంటున్నారు.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026 గురించి
స్పెయిన్లోని బార్సిలోనాలో ఫిరా బార్సిలోనా గ్రన్ వియాలో 2026 మార్చి 2 నుంచి 5 వరకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026 జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్, టెక్నాలజీ పరిశ్రమ సమావేశంగా జీఎస్ఎంఏ నిర్వహించిన ఎండబ్యూసీ-2026 నిలిచింది. దాదాపు 109,000 మంది సందర్శకులను, సుమారుగా 2,900 మంది ఎగ్జిబిటర్లు, ప్రాయోజకులు, భాగస్వాములను ఈ కార్యక్రమం ఆకర్షించింది.
ఎండబ్ల్యూసీ-2026 అధికారిక ఇతివృత్తం ‘‘ది ఐక్యూ ఎరా’’. తెలివైన నెట్వర్కులను, వ్యాపార ఆవిష్కరణలను, సామాజిక ప్రభావాన్ని ముందుకు నడిపించేందుకు కృత్రిమ మేధ, అనుసంధానత ఏకీకరణను ఇది తెలియజేస్తుంది.
టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ)
టెలికాం పరికరాలు, సేవల ఎగుమతులను ప్రోత్సహించి, అభివృద్ధి చేయడానికి భారత విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) పరిధిలో, టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీపీఈసీ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భారత్ నుంచి టెలికాం ఎగుమతులను పెంపొందించడంలో, సభ్యత్వమున్న సంస్థలకు ఎగుమతులను సులభతరం చేయడంలో టీఈపీసీ కీలకపాత్ర పోషిస్తుంది. సంపూర్ణ టెలికాం పరిష్కారాలను అభివృద్ధి చేసి పంపిణీ చేయడంలో భారత ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలతో పాటు భారతీయ టెలికాం ఎగుమతిదారుల మొత్తం వ్యవస్థతో కలసి టీఈపీసీ కలసి పనిచేస్తుంది.
మరిన్ని వివరాలకు టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికారిక ఖాతాలను ఫాలో అవ్వండి: -