ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఫార్మాకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ బలోపేతం దిశగా విశాఖలో జాతీయ సదస్సు నిర్వహించిన ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ), ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (ఏఎంటీజడ్)
ఔషధ, వైద్య పరికరాల భద్రతా వ్యవస్థ, సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా
పీవీపీఐ, ఎంవీపీఐ ప్రాంతీయ కేంద్రాల తొలి జాతీయ వార్షిక సమావేశం
ఔషధ దుష్ప్రభావాలను నివేదించేందుకు, దేశవ్యాప్తంగా రోగుల భద్రతను పెంపొందించేందుకు
ఏడీఆర్ పీవీపీఐ 2.0 మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరణ
అవగాహన నుంచి ఆచరణ వరకు: భారత్లో ఔషధ, వైద్య పరికరాల భద్రతను, రోగుల సంరక్షణను పటిష్ఠం చేసేందుకు సమన్వయంతో కూడిన సాంకేతిక మార్పు దిశగా ఈ జాతీయ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2026 4:39PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ), ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (ఏఎంటీజడ్)తో కలిసి.. ఫార్మాకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ను బలోపేతం చేయటంపై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. 2026 ఫిబ్రవరి 27 నుంచి 28 వరకు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (ఏఎంటీజడ్) వద్ద ఆ సదస్సు జరిగింది. భారతదేశంలో ఔషధాలు, వైద్య పరికరాల భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు.. నియంత్రణా అధికారులు, ఆరోగ్య సంస్థలు, ఏడీఆర్ మానిటరింగ్ కేంద్రాలు (ఏఎంసీలు), వైద్య పరికరాల పర్యవేక్షణ కేంద్రాల (ఎండీఎంసీలు) మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు, ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ), మెటీరియోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (ఎంవీపీఐ) ప్రాంతీయ కేంద్రాల మొదటి జాతీయ వార్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ చర్చల్లో నియంత్రణ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్య సంస్థల ప్రతినిధులు, భారత్లోని డబ్ల్యూహెచ్వో కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ఐపీసీ కార్యదర్శి, శాస్త్రీయ డైరెక్టర్ డాక్టర్ వి. కలైసెల్వన్ అధ్యక్షత వహించారు. అవగాహన కల్పించే స్థాయి నుంచి, స్పష్టమైన ఫలితాలతో పనితీరు ఆధారిత ఫార్మాకోవిజిలెన్స్ వ్యవస్థ వైపు మారాల్సిన ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఎయిమ్స్ సీనియర్ అధికారి ప్రొఫెసర్ వై.కె. గుప్తా, ప్రొఫెసర్ అశోక్ పురాణిక్, ఏఎంటీజడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సీఈఓ డాక్టర్ కవితా కచ్రూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఫార్మాకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయటంలో వివిధ సంస్థల పరస్పర సహకారం కీలకమని వివరించారు.
సెషన్ ప్రారంభంలో, దేశవ్యాప్తంగా మందుల దుష్ప్రభావాలను సమయానుగుణంగా నివేదించటాన్ని సులభతరం చేసేందుకు, తక్షణమే సమాచారాన్ని సేకరించే సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు, వాటాదారుల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏడీఆర్ పీవీపీఐ 2.0 మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించారు.
పీవీపీఐ, ఎంవీపీఐ ద్వారా జరిగిన పురోగతిని సమీక్షించటానికి, మందుల దుష్ప్రభావాల నివేదన లోపాలు, డాక్యుమెంటేషన్ కొరత, మెటీరియోవిజిలెన్స్ను పటిష్ఠం చేయాల్సిన అవసరం వంటి కీలక సవాళ్లపై చర్చించటానికి సాంకేతిక సమావేశాలు నిర్వహించారు. ఏఎంసీలు, ఎండీఎంసీల పనితీరుని మెరుగుపరచటం, ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో క్రమబద్ధమైన రిపోర్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించటంపై చర్చలు దృష్టి సారించాయి.
"భారతదేశ ఫార్మాకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ను బలోపేతం చేయటం: అవగాహన నుంచి ఆచరణ వరకు" అనే ఇతివృత్తంతో సమావేశం రెండో రోజు నిర్మాణాత్మక వర్కింగ్ బృంద చర్చలు జరిగాయి. సాంకేతిక సెషన్లతో పాటు నివేదికల కొరత పరిష్కారానికి, నివారించగల ప్రతికూల సంఘటనల డాక్యుమెంటేషన్, విశ్లేషణకు ప్రామాణిక వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు, జిల్లా స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు మించి ఫార్మకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ విస్తరణ ప్రచారానికి వ్యూహాలను వర్కింగ్ బృందాలు పరిశీలించాయి.
ఈ చర్చల సిఫార్సులు ప్రధానంగా రోగుల భద్రతను పటిష్ఠం చేయటానికి సామర్థ్య పెంపుదల, నివేదన పద్ధతుల ప్రామాణీకరణ, సంస్థల మధ్య మెరుగైన సమన్వయం, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల అనుసంధానంపై దృష్టి సారించాయి.
సమన్వయం, సాక్ష్యాధారిత చర్యల ద్వారా భారత ఫార్మకోవిజిలెన్స్, మెటీరియోవిజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఐపీసీ నిబద్ధతను స్పష్టం చేస్తూ ఈ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2234269)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21