ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బ్లాక్చైన్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్ పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్లాక్చైన్ ఇండియా చాలెంజిని ప్రారంభించిన ఎంఈఐటీవై
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 7:22PM by PIB Hyderabad
‘బ్లాక్చైన్ ఇండియా చాలెంజి’ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ఐఏఎస్ 2026 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలోని ఎంఈఐటీవైలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్, ఎంఈఐటీవై సంయుక్త కార్యదర్శి శ్రీ సుదీప్ శ్రీవాస్తవ, ఎంఈఐటీవై గ్రూప్ కోఆర్డినేటర్లు శ్రీమతి సునీతా వర్మ, శ్రీ మనోజ్ కుమార్ జైన్, సైంటిస్ట్ జీ, ఎంఈఐటీవై, సీ-డీఏసీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శ్రీమతి పి. ఆర్. లక్ష్మీ ఈశ్వరిలతో పాటు ఎంఈఐటీవై, సీ-డీఏసీలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు అంకుర సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.

ఈ చాలెంజిని ఎంఈఐటీవై సహకారంతో సీ-డీఏసీ ద్వారా అమలు చేస్తున్నారు. బ్లాక్చైన్ ఇండియా చాలెంజి జాతీయ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమం. అత్యాధునిక బ్లాక్చైన్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్ పరిష్కారాల్ని ఆవిష్కరించడంతో పాటు, వాటిని పరీక్షించి చూడటానికి భారతీయ అంకుర సంస్థల్ని ప్రోత్సహించడం ఈ చాలెంజి ఉద్దేశం. ప్రభుత్వ యూజ్ కేసుల కోసం రెగ్యులేటరీ కంట్రోలుతో పాటు, విశ్వసనీయమైన, ఆడిట్కు అనువైన, జోక్యం చేసుకోవడానికి వీలు ఉండని రీతిలో భద్రతను కల్పించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ, అనుమతి ఆధారిత బ్లాక్చైన్ పరిష్కారాల్ని రూపొందించడం కూడా బ్లాక్చైన్ ఇండియా చాలెంజి లక్ష్యాలే. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సేకరణ (ఇ-ప్రొక్యూర్మెంట్), సరఫరా వ్యవస్థ నిర్వహణ, ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యుత్తు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), భూమి రికార్డులు, పర్యావరణం, స్థిరత్వం వంటి కీలక రంగాల్లో కీలక పాలన, సేవల అందజేతలలో ఎదురవుతున్న సవాళ్లపై బ్లాక్చైన్ ఇండియా చాలెంజిలో ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఈ రంగాలు సూచనప్రాయమైనవి మాత్రమే.. వీటి విషయంలో పరిమితులేవీ లేవు. ప్రస్తావిత రంగాలకు అదనంగా ఇతరత్రా కూడా ప్రభావవంతమైన పరిష్కారాలను ప్రభుత్వ విభాగాల సహకారంతో అంకుర సంస్థలు ప్రతిపాదించేందుకు వీలు ఉంది.
సభను ఉద్దేశించి ఎంఈఐటీవై కార్యదర్శి మాట్లాడుతూ, బ్లాక్చైన్ ప్రభుత్వ సేవల్లో కీలక పాత్రను పోషిస్తుందనీ, ప్రమాణీకరణ యోగ్యతల్ని నిర్ధారించడంతో పాటు అనేక మూలాల నుంచి అందే సమాచారాన్ని ఒకే మూలం ద్వారా విశ్వసనీయంగా మారుస్తుందన్నారు. దీంతో పారదర్శకత్వంతో పాటు సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. గుర్తించిన 10 యూజ్ కేస్ కేటగిరీలకు అదనంగా, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఏదైనా ఇతర ప్రభావవంతమైన యూజ్ కేసును అంకుర సంస్థలు వెతకవచ్చని ఆయన చెప్పారు. అంకుర సంస్థల సముదాయంలో బ్లాక్చైన్ ఇండియా చాలెంజిని విస్తృతంగా వ్యాప్తి చేయడం కోసం పని చేయాల్సిందిగాను, ప్రభుత్వ విభాగాల్లో ఆచరణీయ పద్దతుల్లో వినియోగించదగిన యూజ్ కేసులను రూపొందించాల్సిందిగాను సీ-డీఏసీ, ఎంఈఐటీవై బృందాలకు ఆయన సూచించారు. ఆయా యూజ్ కేసుల్ని తరువాత భారత్ అంతటా అమలుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ చాలెంజిలో భాగంగా, డీపీఐఐటీ గుర్తించిన అంకుర సంస్థలకు ప్రభుత్వ విభాగాల సహకారంతో తమ ఆలోచనలను వాస్తవిక, ప్రభావవంతమైన పరిష్కారాలుగా మార్చడానికి అవకాశం లభిస్తుంది. ఎంపికైన అంకుర సంస్థలకు ప్రభుత్వ విభాగాల కోసం 10 వేర్వేరు కేటగిరీల పరిధిలో 10 ప్రభావవంతమైన బ్లాక్చైన్ ఆధారిత యూజ్ కేసులను అభివృద్ధిపరచడానికి దశల వారీగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. మరిన్ని వివరాల్ని https://challenge.cdac.in లో అందుబాటులో ఉంచారు.
బ్లాక్చైన్ ఇండియా చాలెంజిలో పాల్గొని ప్రభుత్వ విభాగాల సహకారంతో, ఎంపిక చేసిన సేవల రంగాల్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలను కనుగొనడానికి నవకల్పనసహిత ఆలోచనలతో ముందుకు రావాల్సిందిగా అర్హత గల అంకుర సంస్థలను ఆహ్వానిస్తున్నారు. బ్లాక్చైన్ ఇండియా చాలెంజికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోవడానికి పేర్లను వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా అంకుర సంస్థలను కోరుతున్నారు. అర్హత ప్రమాణాలు, నమోదు ప్రక్రియ, ఉపయోగానికి సంబంధించిన ఉదాహరణలు, మార్గదర్శక సూత్రాలు, మేధా సంపత్తి హక్కుల (ఐపీఆర్)తో పాటు ఇతర సంబంధిత వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://challenge.cdac.in ను సందర్శించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2232863)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20