గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లో జరిగిన 25వ సీఎల్సీసీ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ప్రసంగం
మహిళా వ్యవస్థాపకుల సాధికారత కోసం ఒకే ప్రామాణిక రుణ దరఖాస్తు,
డిజిటల్ అనుసంధానం, రియల్-టైమ్ డాష్బోర్డ్ల ఏర్పాటుకు పిలుపు
మహిళా సంఘాల ఎన్పీఏలు 1.5 శాతం కంటే తక్కువే
మహిళా పారిశ్రామికవేత్తలు దేశంలోనే అత్యంత విశ్వాసపాత్రమైన, తక్కువ సేవలు పొందుతున్న వినియోగదారులు: గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 7:15PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన దీన్దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్) ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్లో 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ (సీఎల్సీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని ప్రసంగించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖల మంత్రి డి. అనసూయ సీతక్క పాల్గొన్నారు.
గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో మహిళా సంఘాల నాయకత్వం, నిబద్ధతను కేంద్ర సహాయ మంత్రి ప్రశంసించారు. ఎన్ఆర్ఎల్ఎమ్ కార్యక్రమం ద్వారా సాధించిన గణనీయమైన పురోగతి పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. లఖ్పతి దీదీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు, బ్యాంకింగ్ భాగస్వాములు, మహిళా సంఘాల కార్యకర్తల అంకితభావాన్ని డాక్టర్ చంద్రశేఖర్ ప్రశంసించారు. పరివర్తన స్థాయిని ప్రధానంగా ప్రస్తావిస్తూ... మహిళా సంఘాలకు అందించే రుణాలు గడిచిన పదేళ్లలో పది రెట్లు పెరిగాయన్నారు. 2013లో రూ.23,000 కోట్లుగా ఉన్న రుణాల మొత్తం... 2024 నాటికి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. ఇది స్వయం సహాయక మహిళా సంఘాలు-బ్యాంక్ లింకేజీ వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దాదాపు 50–60 లక్షల మంది లఖ్పతి దీదీలకు బ్యాంక్ లింకేజీలు సులభతరం అయ్యాయనీ... 2021లో 30,000 మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూ.138 కోట్ల రుణాలు పంపిణీ చేయగా ప్రస్తుతం ఈ వ్యక్తిగత వ్యాపార రుణాలు రూ. 8,300 కోట్లకు పెరిగాయనీ, ఈ సంవత్సరం 5.5 లక్షలకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలు దీని ద్వారా లబ్దిపొందారని ఆయన తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఎన్పీఏలు 1.5 శాతం కంటే తక్కువగా ఉన్నాయనీ, అనేక ఇతర విభాగాల కంటే ఇది అత్యంత తక్కువ అని చెబుతూ... మహిళా పారిశ్రామికవేత్తల క్రమశిక్షణ, రుణ అర్హతను ఇది ప్రదర్శిస్తుందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
రుణాల లభ్యతను మరింత వేగవంతం చేయడానికి వ్యవస్థాగత సంస్కరణలకు పిలుపునిచ్చిన డాక్టర్ పెమ్మసాని... మహిళా వ్యవస్థాపకుల కోసం ఒకే ప్రామాణిక దరఖాస్తు వ్యవస్థ, డిజిటల్ కేవైసీ, లావాదేవీ డేటా ఏకీకరణ, సరళీకృత మూల్యాంకన విధానాలు, బ్యాంకులు-వాటాదారులకు అందుబాటులో ఉండే రియల్-టైమ్ డాష్బోర్డ్ల ఏర్పాటును సమర్ధించారు. బ్యాంకులు సమయానుకూల ప్రాసెసింగ్ నిబంధనలను అనుసరించాలనీ, క్లస్టర్ స్థాయి సమాఖ్యల (సీఎల్ఎఫ్ల) ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరణను బలోపేతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం కోసం ప్రత్యేక అధికారులను పరిగణించాలని ఆయన బ్యాంకులను కోరారు.
లఖ్పతి దీదీలు దాతృత్వం ద్వారా లబ్ధి పొందిన వారు కాదనీ, నమ్మకమైన ఆర్థిక భాగస్వాములని స్పష్టం చేస్తూ... మహిళలు నడిపించే గ్రామీణ వ్యాపారాలను పెంపొందించడానికి ఆర్థిక అక్షరాస్యత, మార్కెటింగ్ మద్దతు, షీ-మార్ట్స్ వంటి డిజిటల్ వేదికలు, వ్యాపార సామర్థ్యాలను పెంపొందించాల్సిన ప్రాముఖ్యాన్నీ కేంద్ర సహాయ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను శక్తిమంతమైన గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి... సమ్మిళితమైన, సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని నడిపించడానికి... పారదర్శక డిజిటల్ వ్యవస్థలను నిర్మించడానికి... బహుళ-భాగస్వామ్య సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను డాక్టర్ పెమ్మసాని పునరుద్ఘాటిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీల కోసం విధాన రూపకల్పన, పర్యవేక్షణ, మూల్యాంకనంలో సహాయం చేయడానికి గ్రామీణాబివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎల్సీసీ ప్రతి సంవత్సరం సమావేశమవుతుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్గా ఉంటారు. భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్, పలు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నాబార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులు, అన్ని వాణిజ్య రంగ బ్యాంకుల ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
గత 14 సంవత్సరాలుగా ఈ మిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోతైన మూలాలను ఏర్పరచుకుంది. 10 కోట్లకు పైగా గ్రామీణ పేద మహిళలను 93 లక్షల స్వయం సహాయక బృందాలు, వాటి సమాఖ్యల్లో సమీకరించింది. ఈ సంస్థలు ప్రస్తుతం రూ. 1.2 లక్షల కోట్లకు పైగా అంతర్గత కార్పస్ను నిర్వహిస్తున్నాయి. అధికారిక ఆర్థిక సహాయం అందరికీ అందుబాటులో ఉంచాలనే బలమైన సంకల్పం కారణంగా ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్ రంగానికి అధిక భాగస్వామ్యం లభించింది. రూ. 12 లక్షల కోట్లకు పైగా సంచిత రుణ పంపిణీలు బ్యాంకుల ద్వారా జరిగాయి. స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అత్యధిక మంది నిరంతరం సకాలంలో రుణాలను చెల్లిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2231594)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2