ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026: ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్లో భారతదేశానిది ప్రత్యేక స్థానమని కొనియాడిన బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్
బ్లెచ్లీ నుంచి భారత్ వరకు: మానవ కేంద్రీకృత మేధస్సు తదుపరి హద్దులను నిర్దేశిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ నాయకులు.. 140 కోట్ల మంది ప్రజల కోసం ఏఐ విస్తరణకు అవసరమైన వ్యవస్థను నిర్మించిన భారత్: రిషి సునాక్
కృత్రిమ మేధస్సును తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మూడు మార్గాలు.. డేటా సామర్థ్యం, శక్తి సామర్థ్యం, మెదడు, యంత్రాల అనుసంధానాన్ని ప్రతిపాదించిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏఐ, న్యూరో సైన్స్, ఫిజిక్స్ విభాగాల ప్రొఫెసర్ సూర్య గంగూలీ
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 8:48PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించిన ఇండియా ఏఐ సమ్మిట్-2026 అద్భుతమైన చర్చలకు వేదికైంది. కృత్రిమ మేధ కేవలం ఒక సాంకేతిక విప్లవంగానే కాక.. ఆర్థిక వ్యవస్థలను, సమాజాన్ని, మానవ జీవన గమనాన్ని మార్చే శక్తిమంతమైన సాధనమని ఈ సదస్సులోని రెండు కీలక ప్రసంగాలు స్పష్టం చేశాయి.
ఏఐ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుని, దానితో ముడిపడున్న బాధ్యతను గుర్తుచేస్తూ యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బ్లెచ్లీ పార్క్లో జరిగిన తొలి ఏఐ సేఫ్టీ సమ్మిట్ను ప్రస్తావిస్తూ.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వటం కీలకమని స్పష్టం చేశారు.

"కృత్రిమ మేధ ఎన్నో పనులు చేయగలదు" కానీ "మనిషి అనుభూతిలోని అద్భుతాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదు" అని ఆయన తెలిపారు. అయినా దాని పరివర్తనా శక్తి అపూర్వమైనదని స్పష్టం చేశారు. 100 మిలియన్ల వినియోగదారులను చేరేందుకు టెలిఫోన్కు 75 ఏళ్లు పడితే, కేవలం రెండు నెలల్లోనే అంతమంది వినియోగదారులను చేరుకున్న చాట్జీపీటీ ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. ఇంతటి మార్పు చరిత్రను తిరగరాస్తోంది.
ప్రపంచ స్థాయి పరివర్తనలో భారతదేశ విశిష్ట స్థానాన్ని సునాక్ ప్రస్తావిస్తూ.. ఆధార్, యూపీఐ, హెల్త్ అకౌంట్స్ వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో 140 కోట్ల మంది ప్రజలకు ఏఐ సేవలను విస్తరించేందుకు బలమైన వ్యవస్థలను భారత్ నిర్మించుకుందన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ, పెరుగుతున్న యూనికార్న్ కంపెనీలు, సర్వం ఏఐ వంటి ఆవిష్కరణలను ఉదహరిస్తూ.. ఏఐ రంగంలో "అసలైన పోటీ" కొత్త సాంకేతికతను కనుగొనటం కాదని, ఆ సాంకేతికతను సామాన్యులకు చేరవేయటంలో ఉందని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. ఆహార భద్రత నుంచి ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగంలోని అంతరాలకు ఏఐ పరిష్కారాలను చూపుతుందని సునాక్ అన్నారు. రైతులకు సాధికారత కల్పించటం, మాతృత్వ ఆరోగ్య సంరక్షణకు మద్దతివ్వటం, వ్యక్తిగతంగా విద్యను అభ్యసించే వెసులుబాటు కల్పించటం ద్వారా మానవాళికి బలమైన వ్యవస్థను నిర్మించి, గతంలో ఎన్నడూలేని విధంగా సమాన అవకాశాలను సృష్టించే సామర్థ్యం ఏఐకి ఉందని ఆయన వెల్లడించారు.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఏఐ, న్యూరో సైన్స్, ఫిజిక్స్ విభాగాల ప్రొఫెసర్ సూర్య గంగూలీ మాట్లాడుతూ.. భవిష్యత్ మేధస్సుపై శాస్త్రీయ రోడ్మ్యాప్ను అందించి, ఈ సదస్సును సాంకేతికత పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.
ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని గంగూలీ ఎత్తి చూపారు. ‘కృత్రిమ మేధ వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా... అవి ఎలా పనిచేస్తాయనే ప్రాథమిక అవగాహన మనకు లేదు. అదే సమయంలో 500 మిలియన్ ఏళ్ల పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్న మానవ మెదడు.. డేటా వినియోగంలోనూ, శక్తి సామర్థ్యంలోనూ ఆధునిక ఏఐ కంటే మెరుగ్గా ఉంది’ అన్నారు.
కృత్రిమ మేధస్సును తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మూడు ప్రధాన మార్గాలను ఆయన ప్రతిపాదించారు. అవి: డేటా సామర్థ్యం, శక్తి సామర్థ్యం, మెదడు, యంత్రాల అనుసంధానం.
డేటా సామర్థ్యంపై కొత్త సిద్ధాంతపరమైన పురోగతి ద్వారా ఏఐ పనితీరుని నిర్దేశించే న్యూరల్ స్కేలింగ్ చట్టాల వెనకున్న అసలు కారణాలను గంగూలీ వివరించారు. ఇవి చాలా కాలంగా వాడుకలో ఉన్నప్పటికీ, వాటి పనితీరుపై స్పష్టత లేదని చెప్పారు. ఆయన బృందం చేసిన తాజా పరిశోధన ప్రకారం.. సరైన డేటాను ఎంచుకోవటం ద్వారా వేగంగా నేర్చుకోవచ్చు. దీనివల్ల నెమ్మదిగా సాగే ప్రక్రియ వేగంగా వృద్ధి చెందుతుంది.
శక్తి సామర్థ్యం గురించి వివరిస్తూ.. మానవ మెదడు వినియోగించే 20 వాట్ల విద్యుత్తును, లక్షల వాట్ల శక్తి అవసరమయ్యే ప్రస్తుత ఏఐ వ్యవస్థలతో పోల్చారు. భౌతిక నియమాలకనుగుణంగా జీవశాస్త్రం గణనను ఎలా నిర్వహిస్తుందో అధ్యయనం చేయటం ద్వారా టెక్నాలజీ స్టాక్ను అల్గారిథమ్స్ నుంచి క్వాంటం హార్డ్వేర్ వరకు పూర్తిగా పునర్నిర్మించాలని గంగూలీ ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే ఆయన “క్వాంటం న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్” అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
మెదడు-యంత్రాల అనుసంధానం గురించి ఆయనకున్న దార్శనికత అన్నింటికంటే అద్భుతమైనది. నాడీ మండలాల డిజిటల్ ట్విన్స్ను రూపొందించటం ద్వారా పరిశోధకులు గ్రహణశక్తిని విశ్లేషించగలరు. వ్యాధి స్థితిగతులను తెలుసుకోగలరు. మెదడులోకి కచ్చితమైన నాడీ నమూనాలను పంపగలరు. ఎలుకల్లో దృశ్య గ్రహణశక్తిని డీకోడ్ చేయటం నుంచి మూర్ఛ వ్యాధి నియంత్రణ వరకు ఏఐ, న్యూరోసైన్స్ కలయిక భవిష్యత్తును సూచిస్తోంది. ఇక్కడ మేధస్సు మరింతగా అర్థమవటమే కాక, చికిత్సాపరంగా శక్తివంతంగా మారుతుంది.
ఏఐ ఒక ఊహాజనిత అంశం కాదని, మన జీవితాలను మార్చేసే గొప్ప శక్తి అని ఈ రెండు ప్రసంగాలు చాటిచెప్పాయి. ప్రపంచ స్థాయి ఏఐ పాలన, వినియోగం, మానవాళిపై దాని ప్రభావం గురించి ఒకరు తెలపగా.. ప్రస్తుత ఏఐ నమూనాల కంటే మెరుగైన వాటిని రూపొందించటానికి అవసరమైన శాస్త్రీయ వ్యవస్థల గురించి మరొకరు వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2230692)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8