ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్వయంప్రతిపత్తి, మౌలిక సదుపాయాలు, సామూహిక సాధికారతతో భారత ఏఐ భవిష్యత్ నిర్మాణం: గ్లోబల్ సీఈఓల ఉద్ఘాటన
ఏఐ సాధికారతకు ఒక సాధనం కావాలి గానీ ఆధిపత్యం కోసం కాదు: మిస్ట్రల్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆర్థర్ మెన్ష్
తర్వాతి పారిశ్రామిక యుగానికి, ముఖ్యంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు
ప్రాథమిక మౌలిక సదుపాయంగా ఏఐ: ఫెడెక్స్ సీఈఓ, రాజేష్ సుబ్రమణ్యం
ఒక దేశంలో ఇంధన వ్యవస్థలు బలహీనంగా ఉంటే, ఆ దేశ మేధో వ్యవస్థలు కూడా బలహీనంగానే ఉంటాయి: అదానీ డిజిటల్ ల్యాబ్స్ డైరెక్టర్ జీత్ అదానీ
భారత జనాభాలోని దిగువ సగం మందికి ఏఐ ప్రయోజనం చేకూర్చని పక్షంలో, దాని అసలైన ప్రభావాన్ని మనం చూడలేం: ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 8:50PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 140 కోట్ల మంది భారతీయులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఆతృతతో ఉన్నారని పేర్కొన్నారు. వారి తరపున, ఈ సదస్సులో పాల్గొంటున్న వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలకు, గ్లోబల్ ఏఐ వ్యవస్థల నేతలకు, ఆవిష్కర్తలకు ఆయన సాదర స్వాగతం పలికారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 సందర్భంగా మిస్ట్రల్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆర్థర్ మెన్ష్, ఫెడెక్స్ సీఈఓ రాజేష్ సుబ్రమణ్యం, అదానీ డిజిటల్ ల్యాబ్స్ డైరెక్టర్ జీత్ అదానీ, ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా కీలకోపన్యాసాలు చేశారు. కృత్రిమ మేధ సార్వభౌమాధికారాన్ని, ప్రపంచ వాణిజ్యాన్ని, మౌలిక సదుపాయాలను, ప్రాథమిక సేవల లభ్యతను ఏ విధంగా పునర్నిర్మిస్తోందో వారు విశ్లేషించారు. ఈ సందర్భంగా పారదర్శకత, యాజమాన్య హక్కులు, భారీ స్థాయి సామాజిక ప్రభావం గురించి వారు ప్రధానంగా వివరించారు.
మిస్ట్రల్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆర్థర్ మెన్ష్ మాట్లాడుతూ, ఏఐ స్వయంప్రతిపత్తి, అందరితో కలసి ఆవిష్కరణలు చేయవలసిన ఆవశ్యకతను వివరించారు. వికేంద్రీకరణ, డిజిటల్ స్వయంప్రతిపత్తిని ఉద్ఘాటిస్తూ "ఏఐ అనేది సాధికారతకు ఒక సాధనంగా ఉండాలి, ఆధిపత్యం కోసం కాదు. దేశాలు, ప్రాంతాలు తమ ఏఐ భవిష్యత్తుపై సొంత అధికారాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక ప్రత్యేక హక్కు కాదు, డిజిటల్ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఒక అవసరం” అని అన్నారు. అధికార కేంద్రీకరణ పెరిగిపోవడంపై హెచ్చరిస్తూ "కేవలం మూడు లేదా నాలుగు భారీ కంపెనీలకే కృత్రిమ మేధ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని మనం కోరుకోవడం లేదు. భవిష్యత్తు అనేది అందరి చేత, అందరి కోసం నిర్మాణం కావాలి” అని పేర్కొన్నారు.
ఫెడెక్స్ సీఈఓ రాజేష్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, తర్వాతి పారిశ్రామిక యుగానికి, ముఖ్యంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు ఏఐ ఒక పునాది మాదిరి మౌలిక సదుపాయమని పేర్కొన్నారు. తమ సంస్థలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ, ఏఐ అనేది ఇకపై కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదని, ఇది తదుపరి పారిశ్రామిక వ్యవస్థ అని అన్నారు. మేధస్సు అనేది ఒక ఆస్తి కాదు, అది ఒక మౌలిక సదుపాయం" అని స్పష్టం చేశారు. అవకాశాల విస్తృతిని ప్రస్తావిస్తూ “రాబోయే 50 సంవత్సరాల్లో, ఆధునిక వాణిజ్యాన్ని నడిపించే మేధస్సును సమన్వయం చేయడం, అంతరాయాలను ముందుగానే అంచనా వేయడం, పెట్టుబడుల ప్రవాహాలను సమర్థవంతంగా మెరుగుపరచడం, దృఢమయిన సరఫరా వ్యవస్థలను నిర్మించడం ద్వారానే మన ప్రత్యేకత చాటుకోగలం” అన్నారు.
అదానీ డిజిటల్ ల్యాబ్స్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ, జాతీయ సామర్థ్యం, వ్యూహాత్మక సార్వభౌమాధికారం అనే కోణంలో ఏఐని విశ్లేషించారు. ఇంధనం, కంప్యూట్, సేవల సార్వభౌమాధికారాన్ని మూడు నిర్వచనాత్మక స్తంభాలుగా పేర్కొంటూ “ఏఐ అనేది కోడ్ రూపంలో ఉంటుంది. కానీ అది విద్యుత్తుపై నడుస్తుంది. ఒక దేశంలో ఇంధన వ్యవస్థలు బలహీనంగా ఉంటే, ఆ దేశ మేధో వ్యవస్థలు కూడా బలహీనంగానే ఉంటాయి” అన్నారు. పర్యావరణ హిత, స్వయంప్రతిపత్తి గల ఏఐ మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులను ప్రకటిస్తూ, “ఏఐ శకంలో భారత్ భాగస్వామి అవుతుందా లేదా అనేది ఇక ప్రశ్న కాదు. ఏఐ శకం మౌలిక సదుపాయాలపై, దాని మేధస్సుపై, దాని విలువలపై భారత్ ముద్ర ఉంటుందా లేదా అన్నదే అసలైన ప్రశ్న” అని పేర్కొన్నారు.
ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా మాట్లాడుతూ, ప్రజల జీవితాలను మార్చగల తక్షణ, భారీ స్థాయి అనువర్తనాల గురించి ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా ఏఐ ట్యూటర్లు, ఏఐ వైద్యులు, ఏఐ అగ్రోనమీ (వ్యవసాయ శాస్త్ర) సేవలను సమర్థిస్తూ “భారత జనాభాలోని దిగువ సగం మందికి ఏఐ ప్రయోజనం చేకూర్చని పక్షంలో, దాని అసలైన ప్రభావాన్ని మనం చూడలేం” అన్నారు. సాధ్యాసాధ్యాలను వివరిస్తూ, “భవిష్యత్తు ఇప్పటికే ఇక్కడ ఉంది. ఒకప్పుడు వందల బిలియన్ల డాలర్లు అవసరమైన పనులను ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో అందించవచ్చు. తద్వారా ప్రతి భారతీయుడికి విద్య, వైద్యం, నైపుణ్యం పొందే అవకాశాలను ఎన్నో రెట్లు పెంచవచ్చు” అని పేర్కొన్నారు.
సాంకేతిక నైపుణ్యం మాత్రమే కాకుండా, యాజమాన్య హక్కులు, లభ్యత, సమానమైన విస్తరణ వంటి అంశాలే ఏఐ తదుపరి దశను నిర్వచించాలని సదస్సు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందరికీ అందుబాటులో ఉండే స్వయంప్రతిపత్తి, సార్వభౌమ మౌలిక సదుపాయాల నుంచి మేధోరహిత సరఫరా శ్రేణులు, సార్వత్రిక డిజిటల్ సేవల వరకు, భారత్ ఒక నిర్ణయాత్మకమైన మలుపులో ఉందని ఈ నాయకులు ఉద్ఘాటించారు. సమగ్రమైన, సుస్థిర, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగల ఏఐ వ్యవస్థలను రూపొందించే అవకాశం ఇప్పుడు భారత్కు ఉందని వారు పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2230645)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3