వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తున్న భారత్: వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంతో అయిదేళ్ల కాలానికి బియ్యం సరఫరా ఒప్పందంపై ఎఫ్సీఐ సంతకం
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 8:48PM by PIB Hyderabad

ఆకలిని ఎదుర్కోవడమే లక్ష్యంగా అంతర్జాతీయ మానవతా కార్యకలాపాలకు మద్దతుగా బియ్యం సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ) ఓ అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)పై 2026, ఫిబ్రవరి 18న సంతకం చేశాయి.
భారత ప్రభుత్వం తరఫున ఎఫ్సీఐ సీఎండీ రబీంద్ర కుమార్ అగర్వాల్, డబ్ల్యూఎఫ్పీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కౌ ఈ ఎంవోయూపై సంతకం చేశారు. ఆహారం, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎంవోయూ ప్రకారం డబ్ల్యూఎఫ్పీకి 2,00,000 మెట్రిక్ టన్నులు బియ్యం (25 శాతం వరకు నూకలు)ను ఎఫ్సీఐ సరఫరా చేస్తుంది. సంతకం చేసినప్పటి నుంచి అయిదేళ్ల కాలానికి ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారం ఆధారంగా దీనిని పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. పరస్పర అంగీకారంతో ఏటా ధరలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం 2026 మార్చి 31 వరకు క్వింటాలుకు ధరను రూ.2,800గా నిర్ణయించారు.
‘‘ఆకలితో అలమటిస్తున్నవారికి డబ్ల్యూఎఫ్పీ ద్వారా ఆశను, పోషణను, గౌరవాన్ని అందిస్తున్నాం. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే భారత దేశ సంకల్పాన్ని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోంది. పోషకాహార లోపం, ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది’’ అని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా అన్నారు.
‘‘అంతర్జాతీయంగా ఆకలిని ఎదుర్కోవడంలో భారత్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది. వచ్చే అయిదేళ్లలో అవసరార్థులకు పోషకాహారాన్ని చేరవేయడంలో భారత్ అందిస్తున్న సహకారం డబ్ల్యూఎఫ్పీకీ ఎంతో ఉపకరిస్తుంది. వ్యవసాయ ప్రధానమైన, అంతర్జాతీయ ఐక్యతను ప్రతిపాదించిన దేశంగా సున్నా ఆకలి లక్ష్యాన్ని సాధించడంలో భారత్ మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ పరివర్తనాత్మక భాగస్వామ్యాన్ని అందించిన భారత్కు ధన్యవాదాలు’’ అని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కార్ల్ స్కౌ చెప్పారు.
అంతర్జాతీయ ఆహార భద్రత పట్ల భారతదేశ అంకితభావాన్ని ఈ భాగస్వామ్యం తెలియజేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అవసరాలను తీర్చేందుకు డబ్ల్యూఎఫ్పీతో సహకారాన్ని బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ వ్యవస్థల్లో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా భారత్ పాత్రను పెంపొందిస్తుంది.
(రిలీజ్ ఐడి: 2230176)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4