ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బాధ్యతాయుత ఆవిష్కరణల పట్ల భారత దార్శనికత ప్రపంచ భవిష్యత్ ఏఐ ప్రయాణానికి మార్గదర్శి
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భారత ఏఐ గవర్నెన్స్ విజన్ను ఆవిష్కరించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
బాధ్యతాయుత ఏఐ కోసం కార్యాచరణ ప్రణాళికలను అందించనున్న వర్కింగ్ గ్రూపులు
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 7:43PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 3వ రోజు ప్రారంభ సమావేశం సదస్సు వర్కింగ్ గ్రూపుల ద్వారా కీలకమైన ఫలితాల గురించిన సంభాషణలతో ప్రారంభమైంది. ఇది ప్రపంచ ఏఐ ప్రాధాన్యాల కోసం సహకారాత్మక చర్యలకు వేదికను అందించింది. ప్రజలు, భూమి, పురోగతి వంటి సూత్రాల మార్గనిర్దేశంలో ఈ సదస్సు ఏడు థీమాటిక్ వర్కింగ్ గ్రూపులు (చక్రాలు) కేంద్రంగా తన ఎజెండాను రూపొందించింది. ఈ సమూహాలు గత కొద్ది నెలలుగా ప్రపంచ ఏఐ ప్రాధాన్యాల కోసం సహకారాత్మక చర్యలను కొనసాగించే లక్ష్యంతో కేంద్రీకృత ఏఐ ఫలితాలపై చర్చించాయి.
ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన గౌరవ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, "ఈ ఇంపాక్ట్ సదస్సును మించి మనం ముందుకు సాగి మన ఎజెండాను నిర్దేశించుకుంటున్నప్పుడు, ఏడు అద్భుత ఇతివృత్తాలను కలిగిన ఈ వర్కింగ్ గ్రూపుల ఫలితాలు మనం ముందుకు సాగడానికి మార్గదర్శక దీపాలుగా పనిచేస్తాయి. రాబోయే రోజుల్లో మన సహకారం, ఆవిష్కరణలు, బాధ్యతాయుత ఏఐ వ్యవస్థలను నిర్మించడం కొనసాగించాల్సిన తీరును అవి రూపొందిస్తాయి" అని అన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, “ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా ఆశావాదంతో సమీపిస్తున్నాం. ఏఐ సామర్థ్యాన్ని స్వీకరిస్తూనే ప్రమాదాలు, ప్రమాణాలు, పాలన, మరీ ముఖ్యంగా ఏఐ చర్చను రూపొందించడంలో అన్ని ప్రపంచస్థాయి గళాలకు సాధికారత కల్పించేలా చూసుకుంటున్నాం” అన్నారు.
ప్రారంభ సమావేశం తర్వాత ఒక క్లోజ్డ్ డోర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్కింగ్ గ్రూప్ డెలివరీలను గురించి వాటాదారులతో మరింత లోతుగా చర్చించారు. ఈ చర్చల ద్వారా పొందిన అభిప్రాయాలు, సిఫార్సులను రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తారు.
ప్రపంచస్థాయి నైపుణ్యం, భాగస్వామ్య దృక్పథాలను కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడానికి భారత్ చేస్తున్న కృషిని ఈ ఏడు థీమాటిక్ చక్రాలు ప్రతిబింబిస్తాయి. అవి మానవ మూలధనం... సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం... సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ... సమర్థత, ఆవిష్కరణలు-సామర్థ్యం... సైన్స్, ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ... ఆర్థిక వృద్ధి, సమాజ హితంల కోసం ఏఐ.
ఈ వర్కింగ్ గ్రూపులు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజం, అంతర్జాతీయ భాగస్వాముల నుంచి నిపుణులను నియమించుకున్నాయి. నెలల తరబడి సంప్రదింపులు, ఆధారాల ఆధారిత సంభాషణల ద్వారా ఆచరణీయ ఫలితాలను రూపొందిస్తున్నాయి. ఏఐ విధానం, ఆచరణలో విజన్ నుంచి అమలు వరకు సదస్సు పరివర్తనను బలోపేతం చేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2230004)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6