ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026.. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా ఏఐ సేవలు విస్తరిస్తున్న తరుణంలో మానవ కేంద్రీకృత పాలనకు ప్రపంచ దేశ నేతల ప్రాధాన్యత
ప్రపంచ దేశాల ఏఐ పాలనపై భారత డిజిటల్ ఆశయాల ప్రభావం: ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు అలార్ కారిస్
గ్లోబల్ సౌత్ దేశాల సమ్మిళిత చర్చల ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఇండియా ఏఐ సమ్మిట్
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 5:56PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మూడో రోజున డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో (డీపీఐ) సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ పాలన అంశంపై జరిగిన చర్చలో ప్రపంచ దేశాల నాయకులు, నిపుణులు పాల్గొన్నారు. ప్రజాప్రయోజన వ్యవస్థల్లో కృత్రిమ మేథను సురక్షితంగా, జవాబుదారీతనంతో, అందరికీ అందుబాటులో ఉండేలా ఎలా అనుసంధానించవచ్చనే అంశాలపై చర్చించారు.
ఆరోగ్యం, విద్య, సామాజిక రక్షణ, ప్రభుత్వ పరిపాలన వంటి రంగాల్లో సేవలందించటానికి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు కీలకంగా మారుతున్న తరుణంలో.. నిర్ణయాధికారాన్ని, వనరుల కేటాయింపును, హక్కుల వినియోగాన్ని ఏఐ పెద్దఎత్తున ప్రభావితం చేస్తుందని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశ్వసనీయత, చట్టబద్ధత, జవాబుదారీతనం వంటివి సాంకేతిక చేరికలు మాత్రమే కాదు.. పాలనకు ప్రాథమిక సూత్రాలు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగంలో భారత నాయకత్వాన్ని ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు అలార్ కారిస్ ప్రశంసించారు. సాంకేతికత, పాలన, సమ్మిళిత వృద్ధి అంశాల్లో ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు. ఆధునిక ప్రభుత్వాల సామర్థ్యానికి డీపీఐ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసిన ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్.ఈ అలార్ కారిస్.. "డిజిటల్ మౌలిక సదుపాయాలు కేవలం సేవలందించే సాంకేతిక వ్యవస్థే కాదు.. ఆధునిక దేశాల పనితీరుకు ఎంతో కీలకం. ఈ వ్యవస్థల్లో ఏఐని వినియోగించినప్పుడు.. అల్గారిథమ్, పారదర్శకత, మానవ పర్యవేక్షణ వంటివి కేవలం అదనపు ఆప్షన్లు కావు.. ప్రజల విశ్వసనీయత, చట్టబద్ధతను కాపాడే తప్పనిసరి నిబంధనలు" అని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్ స్టేట్ సెక్రటరీ, ఫెడరల్ ఆఫీస్ ఫర్ కమ్యూనికేషన్స్ అధ్యక్షుడు హెచ్.ఈ బెర్నార్డ్ మైసెన్ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత పాలనలో ప్రభుత్వ సంస్థల బాధ్యతను తెలియజేశారు. "ప్రపంచవ్యాప్తంగా సుపరిపాలనకు ఏఐని ఉపయోగించటంలో అంతర్జాతీయ సహకారం, సామర్థ్య పెంపుదల కీలకమైన అంశాలు. దేశాల మధ్య ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవటం వల్ల నేర్చుకోవటానికి, వృద్ధి చెందటానికి అవకాశముంటుంది. గ్లోబల్ సౌత్ దేశాల ఏకాభిప్రాయ చర్చల విలువను ఇండియా ఏఐ సమ్మిట్ చాటిచెప్పింది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు.. మానవ హక్కులు, జవాబుదారీతనం, సమ్మిళితత్వం, పారదర్శకత వంటి అత్యున్నత ప్రమాణాలను ప్రతిబింబించాలి. ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిన, నిర్వహించిన ఏఐ వ్యవస్థల మద్దతుతో తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి. జవాబుదారీతనం లేనప్పుడు, నమ్మకం నిలబడదు" అని తెలిపారు.
డిజైన్ ద్వారానే భద్రతా ప్రమాణాలుండాల్సిన అవసరాన్ని లిథువేనియా వైస్ మినిస్టర్ హెచ్.ఈ టౌరిమాస్ వాలీస్ స్పష్టం చేశారు. "బలమైన ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారానే బాధ్యతయుతమైన ఏఐ ప్రారంభమవుతుంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో వినియోగించే ఏఐ.. నిఘా కోసమో, వివక్ష చూపటానికి సాధనంగా మారకూడదు. సాంకేతికత ప్రజలకు సేవ చేయాలి కానీ, సాంకేతికతకు ప్రజలు బానిసలు కాకూడదు. వ్యవస్థల రూపకల్పనల్లోనే సమ్మిళితత్వం ఉండాలి" అని వ్యాఖ్యానించారు.
నెదర్లాండ్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కృత్రిమ మేథ రాయబారి హెచ్.ఈ హ్యారీ వెర్వీజ్ మాట్లాడుతూ.. డీపీఐలోని ఏఐ పాలన ప్రజాస్వామ్య చట్టబద్ధతకు కీలకమని వివరిస్తూ, "డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ఏఐ పాలన.. ప్రజల నమ్మకం, ప్రజాస్వామ్య చట్టబద్ధతకు సంబంధించిన అంశం. మానవ హక్కులు, పారదర్శకత, జవాబుదారీతనం, సమ్మిళితత్వం వంటివి అదనంగా చేర్చుకునే ఐచ్ఛికాలు కావు. వ్యవస్థ రూపకల్పనలో ఉండాల్సిన ప్రాథమిక సూత్రాలు. గౌరవం, నిజాయితీ విలువల కంటే సామర్ధ్యం ముఖ్యం కాకూడదు" అని అన్నారు.
ప్రతినిధి బృందాలు అధిపతుల ప్రసంగాల అనంతరం జరిగిన ప్యానెల్ చర్చలో ఆచరణాత్మక పాలనా వ్యవస్థలు, ప్రక్రియల్లో జవాబుదారీతనం, గ్లోబల్ సౌత్ దేశాల్లోని అనుభవాలను విశ్లేషించారు. హక్కులను గౌరవించే, మానవ కేంద్రీకృత పాలనా వ్యవస్థలపై ప్రధానంగా ఈ చర్చ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్గారిథమిక్ పారదర్శకత, ప్రభావ అంచనాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, భాగస్వామ్య రూపకల్పన ప్రక్రియలపై చర్చించారు. అమలు తర్వాత కాకుండా ముందుగానే పాలనపరమైన వైఫల్యాలు ఎదురవుతాయని, సంస్థాగత రూపకల్పన, రాజకీయ నిర్ణయాధికార స్థాయిలోనే అంటే ప్రారంభ దశలోనే జవాబుదారీతనం ఉండటం అత్యవసరమని స్పష్టం చేశారు.
ఈ ప్యానెల్లో టెక్ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ప్రోగ్రామ్స్, పార్ట్నర్షిప్స్ హెడ్ ప్రతీక్ వాఘ్రే, డెరెచోస్ డిజిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జువాన్ కార్లోస్ లారా, గూగుల్ గ్లోబల్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అలెగ్జాండ్రియా వాల్డెన్, జర్మనీ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్లోని ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ఫారిన్ పాలసీ కోఆర్డినేషన్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ నార్మన్ షుల్జ్ పాల్గొన్నారు.
యూరప్, గ్లోబల్ సౌత్ దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో వినియోగించే ఏఐ.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేయటానికి, మానవ హక్కులను కాపాడేందుకు, పెద్ద ఎత్తున ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించటానికి సమ్మిళిత ప్రపంచ వేదికలు, ఉమ్మడి ప్రమాణాలు అత్యవసరమని ఈ సెషన్ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఏఐని విస్తరిస్తున్న తరుణంలో సాంకేతిక సామర్థ్యంతో పాటు బాధ్యతాయుతమైన పాలన వృద్ధి చెందాలని ఈ చర్చ స్పష్టం చేసింది. ఈ డిజిటల్ పరివర్తనలో ప్రజలు, హక్కులు, విశ్వసనీయత కీలకంగా ఉండాలని పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2230003)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7