ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కృత్రిమ మేధ ప్రభావం, సార్వభౌమ విధానాలు, భద్రతా విధానాలను ప్రదర్శించనున్న భారత్
బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ వల్ల ప్రపంచానికి విశ్వసనీయమైన భాగస్వామిగా మారిన భారత్: దావోస్లో భారత్
2030 నాటికి 7 నానోమీటర్, 2032 నాటికి 3 నానోమీటర్ల టెక్నాలజీలు సిద్ధం: దావోస్లో భారత్
ఈ ఏడాదే నాలుగు యూనిట్లలో దేశీయంగా చిప్ ఉత్పత్తి ప్రారంభం: అశ్వనీ వైష్ణవ్
प्रविष्टि तिथि:
21 JAN 2026 4:13PM by PIB Hyderabad
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం-2026లో భాగంగా నిర్వహించిన వివిధ చర్చల్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ పాల్గొన్నారు. వాటిలో.. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, డీప్ టెక్ ఆవిష్కరణల్లో భారత్ అనుసరిస్తున్న సమగ్ర విధానాన్ని ఆయన వివరించారు.
ప్రభావం, గ్లోబల్ సౌత్, భద్రతపై దృష్టి సారించే ఏఐ ఇంపాక్ట్ సదస్సు
ఫలితాలపైనే స్పష్టమైన దృష్టి సారిస్తూ త్వరలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సదస్సు రూపుదిద్దుకుందని శ్రీ వైష్ణవ్ తెలిపారు. ఈ సదస్సు ప్రధాన లక్ష్యం ‘ప్రభావం’ అని ఆయన తెలిపారు. అంటే, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్పాదకతను పెంపొందించడానికి, ఆర్థికరంగంపై గుణాత్మక ప్రభావం చూపించేలా ఏఐ విధానాలు, అనువర్తనాలు, మొత్తం ఏఐ వ్యవస్థను ఎలా ఉపయోగించవచ్చో తెలియజేస్తుంది.
రెండో లక్ష్యం ముఖ్యంగా భారత్, గ్లోబల్ సౌత్ దేశాలకు ‘అందుబాటులో ఉండటం’ అని చెప్పారు. యూపీఐ, డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) స్టాక్ను నిర్మించడంలో భారత్ సాధించిన విజయాన్ని ఉదహరిస్తూ.. ఏఐ కోసం ఇదే తరహా సులభమైన, సరసమైన ధరలకే స్టాక్ను అభివృద్ధి చేయడానికి ప్రపంచం భారత్ వైపు చూస్తోందని శ్రీ వైష్ణవ్ అన్నారు.
ఏఐ ఇంపాక్ట్ సదస్సు మూడో లక్ష్యం ‘భద్రత’ అని మంత్రి తెలియజేశారు. తగిన భద్రతా వ్యవస్థలు, మార్గనిర్దేశకాలు, రక్షణ సౌకర్యాలను రూపొందించడం ద్వారా ఏఐ విషయంలో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఏఐ కోసం నియంత్రణ, భద్రతా స్టాక్ సైతం భారత్లోనే తయారుచేయాలన్నారు.
ఈ సదస్సులో ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని ఆయన చెప్పారు. అలాగే పెట్టుబడుల ప్రకటనలు, భారత ఏఐ విధానాల ఆవిష్కరణ ఉంటాయని తెలిపారు.
అంకుర సంస్థల వృద్ధి, డీప్ టెక్ జోరు
ప్రస్తుతం భారత్లో సుమారుగా 2,00,000 అంకుర సంస్థలు ఉన్నాయని, ప్రపంచంలోనే మూడు అగ్ర అంకుర సంస్థల వ్యవస్థల్లో ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీప్ టెక్పై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో గత దశాబ్దంలో ప్రాథమిక మార్పు చోటు చేసుకుందని తెలిపారు.
అంకుర సంస్థలకు అత్యంత సవాలుతో కూడుకున్న రంగాల్లో ఒకటైన చిప్ తయారీలో 24 భారతీయ అంకుర సంస్థలు నిమగ్నమయ్యాయని, వాటిలో 18 సంస్థలకు మూలధన పెట్టుబడులు లభించాయని తెలియజేశారు.ఇది భారత డీప్ టెక్ సామర్థ్యాలపై పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుందన్నారు.
సెమీకండక్టర్ల కోసం ప్రణాళిక
భారత దేశ సెమీకండక్టర్ల వ్యూహాన్ని శ్రీ వైష్ణవ్ వివరించారు. అంతర్జాతీయంగా తయారవుతున్నచిప్పుల్లో 75 శాతం 28 నానో మీటర్ల నుంచి 90 నానోమీటర్ల పరిధిలోకి వస్తున్నాయన్నారు. వీటిని విద్యుత్ వాహనాలు, ఆటోమొబైల్స్, రైల్వేలు, రక్షణ వ్యవస్థలు, టెలికాం పరికరాలు, పెద్ద స్థాయిలో ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు.
ఈ రంగంలో అధునాతన నోడ్స్ దిశగా వెళ్లడానికంటే ముందే.. తయారీపై పట్టు సాధించడంపై భారత్ దృష్టి కేంద్రీకరించిందని తెలియజేశారు. ఐబీఎంతో సహా పారిశ్రామిక భాగస్వాములతో కలసి పనిచేస్తూ.. 2030 నాటికి 28 నుంచి 7 నానోమీటర్లకు, 2032 నాటికి 3 నానోమీటర్లకు చేరుకోవాలని భారత్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందని వెల్లడించారు.
విస్తారమైన ప్రతిభ, డిజైన్ సామర్థ్యాలు, విస్తరిస్తున్న తయారీ, వేగంగా విస్తరిస్తున్నఎలక్ట్రానిక్స్ మార్కెట్ను ఉదహరిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో అంతర్జాతీయంగా నాలుగు లేదా అయిదు అగ్రదేశాల జాబితాలో భారత్ చేరుతుందన్న విశ్వాసాన్నిఆయన వ్యక్తం చేశారు.
దావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో శ్రీ వైష్ణవ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్, దేశీయ అంకుర సంస్థలతో భాగస్వామ్యాలతో సహా భారత దేశ ఏఐ వ్యవస్థను గూగుల్ బలోపేతం చేస్తోంది. అలాగే దావోస్లో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయల్ కప్లన్తో కూడా భేటీ అయ్యారు. డీప్ ఫేక్, ఏఐ రూపొందించిన కంటెంట్ నుంచి సామాజిక మాధ్యమ వినియోగదారులకు భద్రత కల్పించడంపై చర్చించారు. వినియోగదారుల రక్షణ కోసం మెటా చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రికి మెటా వివరించింది.
మొత్తం ఏఐ మౌలిక వ్యవస్థపై పనిచేస్తున్న భారత్
ఏఐ రంగంలో అయిదు అంచెలున్నాయని శ్రీ వైష్ణవ్ వివరించారు. అవి- అనువర్తనం, నమూనా, సెమీకండక్టర్ లేదా చిప్, డేటా సెంటర్ల వంటి మౌలికవసతులు, ఇంధన దశలు. ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జనాభా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఐటీ సంస్థల ఉనికి ఆధారంగా.. ఈ అయిదు దశల్లోనూ భారత్ పనిచేస్తోందని ఆయన తెలిజేశారు.
అప్లికేషన్, వినియోగ దశ పెట్టుబడులపై అధిక రాబడిని అందిస్తుందని స్పష్టం చేశారు. సంస్థల పనితీరును వేగంగా అర్థం చేసుకొని, ఏఐ టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఏఐ అప్లికేషన్లలో అగ్రస్థానానికి భారత్ చేరుకోవాలన్నారు. 33 శాతం పెరిగిన ఏఐ నియామకాలతో ఈ దిశగా భారతీయ ఐటీ సేవల సంస్థలు ముందుకు వెళుతున్నాయన్నారు.
చిన్న నమూనాలు, సార్వభౌమ సామర్థ్యం, దక్షత
ప్రస్తుతం 95 శాతం వరకు ఏఐ పనులను చిన్న నమూనాలే చేపడుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. చాల వరకు సంస్థల అవసరాలకు 50 బిలియన్ - పరామితుల విధానం సరిపోతుందన్నారు. దాదాపుగా 12 ఏఐ నమూనాలను భారత్ అభివృద్ధి చేస్తోందని, ఇవి చిన్న జీపీయూ వ్యవస్థలపై కూడా పనిచేయగలవని, అధిక జనాభాకు తక్కువ ఖర్చుతోనే ఏఐ సేవలను అందిస్తాయని తెలియజేశారు.
సార్వభౌమ ఏఐ విధానాల ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేస్తూ.. అంతర్జాతీయ వనరులను వినియోగించుకోవడంలో ఆటంకం ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఇలాంటి విధానాలు అవసరమన్నారు. సామర్థ్యం, చౌకగా లభించడం, సార్వభౌమత్వం కేంద్రంగా ఉన్న ఈ విధానం అంతర్జాతీయ ఏఐ రంగంలో భారత్ను పోటీలో నిలుపుతుందని తెలిపారు.
వీటిలో అనేక నమూనాలను వివిధ స్థాయుల్లో, వాస్తవ జీవిత వినియోగంలో పరీక్షించినట్లు శ్రీ వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి విధానాలను ప్రారంభించే స్థాయికి భారత్ చేరుకుంటుందన్నారు.
ఏఐ మౌలిక వసతులు, ఇంధన సన్నద్ధత
దాదాపుగా 70 బిలియన్ల ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఇప్పటికే ఖరారయ్యాయని, ఆచరణలోకి వచ్చాయని మంత్రి చెప్పారు. ఏఐ రంగానికి ఇంధన రంగం కీలకమైందని వివరిస్తూ.. శాంతి చట్టం ద్వారా అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించామని, ఇది మొత్తం ఏఐ వ్యవస్థకు తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు.
బహుళ దశాబ్ద ఏఐ ప్రయాణం, ఆవిష్కరణల సామర్థ్యం
ప్రస్తుతం ప్రపంచం ఏఐ విప్లవం ఆరంభ దశలో ఉందని, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇది కొనసాగుతుందని శ్రీ వైష్ణవ్ చెప్పారు. కొన్ని వాట్ల విద్యుత్తుతో పనిచేసే మానవ మెదడుకు, వందల కొద్దీ మెగావాట్లతో పనిచేసే ఏఐ డేటా సెంటర్ల మధ్య ఉన్న భేదాన్ని తెలిజేశారు. భవిష్యత్తులో ఆవిష్కరణలకున్న విస్తృత అవకాశాన్ని ఈ వ్యత్యాసం తెలియజేస్తుందన్నారు.
అధునాతన ఏఐ నమూనాలను తయారు చేసేందుకు ఇంజినీరింగ్, సామర్థ్యంలో విప్లవాత్మక ఆవిష్కరణలపై అనేక భారతీయ అంకుర సంస్థలు దృష్టి సారిస్తున్నాయని, ఇవి దేశానికి గణనీయమైన అవకాశాలను అందిస్తున్నాయని తెలియజేశారు.
డిమాండును సృష్టించేదిగా ప్రభుత్వం, ప్రధాన రంగాలు
ఏఐకు డిమాండును సృష్టించడంలో, ముఖ్యంగా స్పష్టమైన వాణిజ్య విధానాలు లేని రంగాల్లో ప్రభుత్వం కీలకమైన పాత్రను పోషిస్తోందని శ్రీ వైష్ణవ్ తెలిపారు. వాతావరణ అంచనా, వ్యవసాయం, ఆరోగ్య సేవలు లాంటి రంగాల్లో ఏఐ వినియోగానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచాన్ని ముందుండి నడిపించేలా రోగ అంచనా, నివారణ ఆరోగ్య సేవలపై భారత్ ప్రధాన దృష్టి సారిస్తోందని వివరించారు.
సార్వభౌమ ఏఐ విధానాలు ఉపయోగించి, పెద్ద ఎత్తున మౌలిక వసతుల తోడ్పాటు, ఏఐ సాకేంతికతల వినియోగ విస్తరణ, నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందని ఆయన వివరించారు.
పారిశ్రామిక సహకారం, నైపుణ్యాలు
సెమీకండక్టర్ కార్యక్రమం మాదిరిగానే పరిశ్రమలతో సంప్రదింపుల అనంతరం భారత ఏఐ ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గతంలో సెమీకండక్టర్లు, 5జీలో చేసిన ప్రయత్నాల మాదిరిగానే నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత పారిశ్రామిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏఐ పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
***
(रिलीज़ आईडी: 2217307)
आगंतुक पटल : 4