ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆగామి కార్యక్రమం ‘‘ఫ్రం యాక్షన్ టు ఇంపాక్ట్’’లో కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రసంగం ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంలో భారత్, ఫ్రాన్స్ కలిసి నిర్వహించిన కార్యక్రమం
प्रविष्टि तिथि:
17 DEC 2025 3:45PM by PIB Hyderabad
న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకేంద్రంలో ‘‘ఫ్రం యాక్షన్ టు ఇంపాక్ట్’’ పేరుతో 2025 డిసెంబరు 16న నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆగామి కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఫ్రాన్స్లు ఏర్పాటు చేశాయి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను న్యూఢిల్లీలో 2026 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు కూడా పాలుపంచుకున్నారు. ఐరాసలో ఫ్రాన్సు శాశ్వత ప్రతినిధి
జెరోమ్ బోనాఫాంట్, ఫ్రాన్సు ప్రభుత్వంలో ఏఐ, డిజిటల్ వ్యవహారాల రాయబారి క్లారా చపాజ్, ఐక్యరాజ్యసమితి అండర్- సెక్రటరీ- జనరల్, సాంకేతిక విజ్ఞాన విషయాల్లో ఐరాస ప్రతినిధి అమన్దీప్ సింగ్ గిల్, ఐరాస సహాయక సెక్రటరీ- జనరల్, ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టరు కన్నీ విఘ్నరాజా ఉన్నారు. వీరితో పాటు, యునెస్కో కమ్యూనికేషన్లు, సమాచార వ్యవహారాల సహాయక డైరెక్టర్ జనరల్ తౌఫిక్ జెలాసీ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)లో వ్యూహాత్మక ప్రణాళిక, సభ్యత్వ విభాగ ప్రధానాధికారి, సెక్రటరీ-జనరల్కు ప్రత్యేక సలహాదారు నూర్ సులీనా అబ్దుల్లా, హగింగ్ ఫేస్ సంస్థ - మెషీన్ లెర్నింగ్, సామాజిక విభాగ ప్రధానాధికారి శ్రీ యాసీన్ జర్నైట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచ శిఖరాగ్ర సదస్సు పరిణామ క్రమాన్ని శ్రీ ప్రసాద వివరించారు. ఈ ప్రక్రియ బ్లెచ్లే పార్కులో రిస్క్ ప్రధానాంశంగా నిర్వహించిన సభలతో మొదలై, సియోల్లో ఎథిక్స్, ఇంక్లూజన్ అంశాలపై చర్చల మజిలీకి చేరుకొని, చివరగా ప్యారిస్లో అంగీకారం కుదిరిన సిద్ధాంతాలను అమలు చేయడంపై దృష్టిని కేంద్రీకరించిందని ఆయన తెలిపారు. ఈ శతాబ్దంలో కృత్రిమ మేధ మానవతకు ఒక నియమావళిని రచిస్తోంద’’న్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యను శ్రీ ప్రసాద ప్రస్తావించారు. అన్ని వర్గాలనూ కలుపుకొని ముందుకు వెళ్లడం, నైపుణ్యాలను సాధించడం, ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాలను అలవరుచుకొంటూ ఉండటం, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని చేపట్టే చర్యలకు ఉన్న ప్రాముఖ్యాన్ని మంత్రి ఉద్ఘాటించారు. ఇవి విధానాన్ని వాస్తవ ప్రభావం చూపేదిగా మార్చుతాయని ఆయన అన్నారు.
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ కు సంబంధించిన 3 సూత్రాలు.. ప్రజలు, భూగ్రహం, ప్రగతి.. లను గురించి శ్రీ జితిన్ ప్రసాద తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ మౌలిక సూత్రాలను 7 ఇతివృత్త ప్రధాన కార్యాచరణ బృందాల సాయంతో అమలులోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. వీటిని చక్రాలుగా గుర్తించారని ఆయన చెప్పారు. ఈ చక్రాలలో.. మానవ వనరులు; సామాజిక సాధికారత కల్పనకు ఉద్దేశించిన సమ్మిళిత భావన; సురక్షిత, విశ్వసనీయ కృత్రిమ మేధ; దృఢత్వం; నవకల్పన, దక్షత; విజ్ఞానశాస్త్రం; ఏఐ సంబంధిత వనరులను అందరి చెంతకు చేర్చడం; ఆర్థిక అభివృద్ధి సాధనతో పాటు సామాజిక ప్రయోజనాల కోసం ఏఐ వినియోగం వంటి ముఖ్య రంగాలు భాగంగా ఉన్నాయి.. ఈ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
న్యూఢిల్లీలో 2026 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు శ్రీ ప్రసాద ప్రకటిస్తూ ఈ శిఖరాగ్ర సదస్సులో అనుకున్న అంశాలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రాధాన్యాన్ని ఇస్తారన్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వాలకూ, పరిశ్రమలకూ, పరిశోధకులకూ, పౌర సమాజంతో పాటు అంతర్జాతీయ సంస్థలకూ ఆహ్వానం పలుకుతూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ శిఖరాగ్ర సదస్సు సాఫల్యాన్ని దీనిలో జారీ చేసే తీర్మానాల సంఖ్యను బట్టి కాకుండా, ఈ సదస్సును నిర్వహించడం ద్వారా ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే తీరును ఆధారంగా తీసుకుని చూడాల్సిన అవసరం ఎంతయినా ఉందని శ్రీ ప్రసాద స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2206104)
आगंतुक पटल : 4