గనుల మంత్రిత్వ శాఖ
భారత మైనింగ్ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
11 DEC 2025 5:18PM by PIB Hyderabad
జైపూర్లో బుధవారం జరిగిన ప్రవాస రాజస్థానీ దినోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
స్వదేశానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ, ప్రవాస భారతీయులు దేశంతో గాఢమైన బంధాన్ని కలిగి ఉన్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రవాస భారతీయులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవాసీలు కేవలం విదేశీ మారక ద్రవ్యాన్ని పంపడమే కాకుండా, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, కొత్త అవకాశాలను తీసుకువస్తూ దేశానికి ఎంతో సహాయపడుతున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులను ‘‘దేశ రాయబారులు’’గా అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారు భారతదేశ ప్రతిష్టను, విలువలను, సామర్థ్యాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తున్నారని అన్నారు. రాజస్థాన్తో పాటు యావత్ దేశ గనుల తవ్వకాల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని విస్తారమైన సహజ వనరులను ప్రస్తావిస్తూ.. దేశ సాంస్కృతిక వారసత్వానికి రాష్ట్రం ఆభరణం మాత్రమే కాకుండా, గనుల వారసత్వానికి కూడా ఒక నిధిగా మారిందని శ్రీ జీ కిషన్ రెడ్డి చెప్పారు. పురాతన కాలం నుంచి రాజస్థాన్ ఖనిజాల వెలికితీత, గనుల తవ్వకం సాంకేతికతలో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. నేటికి దేశ ఖనిజ భద్రతకు రాజస్థాన్ వెన్నెముకగా నిలుస్తోందని అన్నారు. పాలరాయి, గ్రానైట్, ఇసుకరాయి, స్లేట్ వంటి వాటిని ఉత్పత్తి, ఎగుమతి చేయడంలో రాష్ట్రం ముందంజలో నిలుస్తుందన్నారు.
దేశంలో మైనింగ్ రంగం నేడు సహకార, పోటీ సమాఖ్యవాద సూత్రాల ఆధారంగా నడుస్తోందని, ఇది దేశ ఖనిజ భద్రతకు, వృద్ధి సామర్థ్యానికి పునాదిగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మైనింగ్ రంగం చారిత్రాత్మక సంస్కరణలను చూసిందన్నారు. పారదర్శక వేలం వ్యవస్థను ప్రవేశపెట్టడం, ప్రైవేటు రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం, అన్వేషణలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, వ్యాపారం సులభతరం చేయడంలో గణనీయమైన మెరుగుదల వంటివి ఉన్నాయని చెప్పారు.
కొత్త పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వాడకం దేశ మైనింగ్ రంగంలో గణనీయమైన అవకాశాలను అందిస్తుందని శ్రీ జీ కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ కీలక ఖనిజాల మిషన్ కోసం రూ.34,300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇది కీలక ఖనిజాల అన్వేషణలో దేశాన్నిస్వావలంబనగా మార్చేందుకు దోహదపడుతుందన్నారు. మొదటిసారిగా అన్వేషణ లైసెన్స్లను వేలం వేశారని, ఏడు బ్లాకులను విజయవంతంగా వేలం వేయడంతో ఈ ప్రయత్నం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచుతుందని, దేశంలో అన్వేషణ ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన రూ. 1,500 కోట్ల రీసైక్లింగ్ పథకం ద్వారా వార్షికంగా 3 లక్షల టన్నుల సామర్థ్యాన్ని సృష్టించడం, 2030 నాటికి సుమారు 40,000 టన్నుల కీలక ఖనిజాల పునరుద్ధరణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో బొగ్గు రంగం పూర్తిగా మారిపోయిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు తవ్వకం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచిందని, దీని వల్ల అధిక ఉత్పత్తి, బలమైన పోటీ, మెరుగైన కార్యాచరణ సామర్థ్యం ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు గ్యాసిఫికేషన్పై ప్రత్యేక దృష్టి సారించామని, గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది సహకరిస్తుందని తెలిపారు. దేశంలో తొలిసారి భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ బ్లాక్లను కూడా వేలం వేశారని మంత్రి చెప్పారు.
దేశ మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు, అంతర్జాతీయ పోటీ సామర్థ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఈ అవకాశాలను సాకారం చేసుకోవడంలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చెశారు. భారత మైనింగ్ రంగం అపారమైన అవకాశాల ముంగిట నిలబడి ఉందని, దీనికి ప్రవాసుల శక్తి, దార్శనికత,ప్రపంచ అనుభవం అవసరమని అన్నారు. భారత వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి విదేశాల్లో కీలక ఖనిజాల సేకరణలో కబిల్ వంటి సంస్థలతో కకలిసి పనిచేయాలని వారిని ప్రోత్సహించారు. రాజస్థాన్ను అవకాశాల రాజధానిగా, భారత్ను ప్రపంచ మైనింగ్ శక్తిగా మార్చడంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు పిలుపునిస్తూ కేంద్రమంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
(रिलीज़ आईडी: 2202667)
आगंतुक पटल : 10