యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
సర్దార్@150 పాదయాత్ర కెవాడియాలో చారిత్రక ముగింపునకు చేరడంతో ఐక్యతా విగ్రహం వద్ద ఏకమైన ప్రజలు
10 రోజుల దేశవ్యాప్త జాతీయ సమైక్యతా పాదయాత్రలో 717 జిల్లాల నుంచి పాల్గొన్న 3.5 లక్షలమంది యువత
560కి పైగా సంస్థానాలను ఏకం చేసి, అఖండ భారతానికి పునాది వేసిన
సర్దార్ పటేల్ కు భారత్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది : ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ దార్శనికతతో
స్ఫూర్తి పొందిన సర్దార్@150 పాదయాత్ర: డాక్టర్ మాండవియా
భారత ఉక్కు మనిషికి నివాళులర్పించడానికి దేశంలోని
నలుమూలల నుంచి యువత ఏకమయ్యారు: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
2047 నాటికి వికసిత్ భారత్ దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో, సర్దార్ పటేల్ దార్శనికత అందుకు మార్గనిర్దేశం చేస్తోంది: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్
బార్డోలీ వీరత్వాన్ని, జాతీయ సమైక్యతను వెలుగులోకి తీసుకువస్తూ,
ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ సిద్ధాంతాలను పునర్జీవింపజేశారు: గుజరాత్ గవర్నర్
प्रविष्टि तिथि:
06 DEC 2025 6:18PM by PIB Hyderabad
భారత ఉక్కు మనిషికి కృతజ్ఞతాపూర్వక నివాళిగా 2025 నవంబర్ 26న కరమ్సద్ నుంచి ప్రారంభమైన చరిత్రాత్మక సర్దార్@150 ఐక్యతా యాత్ర నేడు గుజరాత్లోని కెవాడియాలో గల ఐక్యతా విగ్రహం వద్ద ఒక అద్భుతమైన వేడుకతో ముగిసింది. ఇది ఇటీవలి కాలంలో ప్రజలు నిర్వహించిన అతిపెద్ద ఉద్యమాలలో ఒకటిగా ఆవిర్భవించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే నేడు ముగింపు రోజున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గరుడేశ్వర్ దత్త మందిరం నుంచి ఐక్యతా విగ్రహం వరకు యాత్రలో పాల్గొన్నవారితో కలిసి నడిచి, ఈ చరిత్రాత్మకపాదయాత్ర ముగింపు రోజుకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని అందించారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల పాదయాత్ర నిబద్ధతను చాటుతూ, స్మృతి వనం వద్ద ఏక్ పేడ్ మా కే నామ్ తో ఈ రోజు కారక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత, ఏక్తా నగర్లోని కెవాడియా కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ వద్ద గల ప్రేరణా స్థల్ వద్ద, మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా శ్రీ మన్సుఖ్ మాండవియా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కు 'ప్రతిమా సమ్మాన్' నిర్వహించి ఘన నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ఉత్సవాలలో ఒక ముఖ్యమైన భాగం సర్దార్@150 ఐక్యతా యాత్ర.
ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన సర్దార్@150 ఐక్యతా యాత్ర ఘనమైన ముగింపు వేడుకకు జాతీయ, రాష్ట్ర నాయకులు సహా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు, పంచాయతీ రాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖాద్సేతో పాటు పలువురు ఇతర ప్రముఖ నాయకులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భం జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ఈ యాత్ర ముగింపునకు మరింత గౌరవాన్ని అందించింది.
కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా స్వాగతోపన్యాసం చేస్తూ, దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాల ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండేళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంతో సర్దార్@150 ఐక్యతా యాత్ర స్ఫూర్తి పొందిందని అన్నారు. జిల్లా స్థాయి పాదయాత్రలలో లక్షలాది మంది పౌరులు పాల్గొన్నారని, ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని, 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' సాధించే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ జాతీయ ఆకాంక్షను నెరవేర్చడంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు తమ గౌరవప్రదమైన నివాళిని దేశం నలుమూలల నుంచి యువకులు సర్దార్@150 సందర్భంగా నిర్వహించిన పాదయాత్రలో చేరారు" అని డాక్టర్ మాండవియా అన్నారు.
"మై భారత్ వేదికపై నమోదు చేసుకున్న యువత చురుకైన భాగస్వామ్యంతో ఈ 182 కిలోమీటర్ల పొడవైన పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. గత 10 రోజుల్లో 717 జిల్లాల నుంచి 3.5 లక్షల మంది యువకులు ఈ జాతీయ ఐక్యతా యాత్రలో చేరారు. సర్దార్ పటేల్ జీవితం,ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందారు" అని డాక్టర్ మాండవియా అన్నారు. కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేసినందుకు గుజరాత్ ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఉత్సాహంగా పాల్గొన్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర విజయవంతంగా ముగియడం జాతీయ ఐక్యతకు శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ మాట్లాడుతూ, జాతి నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సాటిలేని కృషి నేటికీ భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తోందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అచంచలమైన నిబద్ధతతో సర్దార్ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆయన వారసత్వాన్ని గౌరవించారని అన్నారు. దేశమే ఎప్పుడూ తొలి ప్రాధాన్యంగా ఉండాలనే సర్దార్ పటేల్ విశ్వాసాన్ని గుర్తుచేస్తూ, ఈ పాదయాత్ర ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్ర 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కోసం ప్రజలను ఏకం చేసిందని ఆయన తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికత దిశగా దేశాన్ని నడిపించడంలో ఇదే సామూహిక సంకల్పం దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మాట్లాడుతూ, సర్దార్@150 ఐక్యతా యాత్ర అసాధారణ ప్రభావాన్ని చూపిందని, భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు ఐక్యతా యాత్రకు అద్భుతంగా కలిసి వచ్చారని అన్నారు. బ్రిటీష్ పాలనను వ్యతిరేకించడానికి కొద్దిమంది మాత్రమే సాహసించిన యుగంలో, గాంధీజీ బోధనల నుంచి స్ఫూర్తి పొంది, రైతులను రక్షించడానికి గ్రామ గ్రామాన తిరుగుతూ, అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా బార్డోలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా నిలబడ్డారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటం చివరికి పన్నును చారిత్రాత్మకంగా 6.5 శాతానికి తగ్గించడమే కాకుండా, ఆయనకు 'సర్దార్' అనే గౌరవ బిరుదును సంపాదించిపెట్టిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ఆదర్శాల ద్వారా జాతీయ సమైక్యతపై సర్దార్ పటేల్ దార్శనికతను పునరుద్ధరించారని ఆయన చెప్పారు.
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్, సర్దార్@150 ఐక్యతా యాత్ర ముగింపును "భారతదేశ ఐక్యత, కర్తవ్యం దేశ నిర్మాణ శాశ్వత స్ఫూర్తికి ఒక వేడుక" గా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పాదయాత్రలో పాల్గొనడం సర్దార్ వల్లభాయ్ పటేల్ రగిల్చిన ఐక్యతా జ్వాల ఈనాటికీ సజీవంగా ఉందని, అది వెలుగుతూనే ఉంటుందని నిరూపిస్తోందని అన్నారు. 560కి పైగా సంస్థానాలను ఏకం చేసి 'అఖండ భారతాన్ని' నిర్మించిన శిల్పిగా సర్దార్ పటేల్ను అభివర్ణించిన ఆయన, దేశం ఆయనకు శాశ్వతంగా రుణపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆయన నాయకత్వం ముక్కలైన భూభాగాన్ని ఏకీకృతం చేసి, నిజమైన ఐక్య దేశానికి పునాది వేసింది కాబట్టి, భారతదేశం ఎల్లప్పుడూ సర్దార్ పటేల్కు రుణపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, బలమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కావాలన్న సర్దార్ పటేల్ కల వేగంగా సాకారం అవుతోందని, ఆయన సంస్కరణలు యువత ప్రాధాన్య కార్యక్రమాలు దేశాన్ని 'వికసిత్ భారత్ 2047' వైపు నడిపిస్తున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ స్ఫూర్తితో దేశ నిర్మాణానికి నిత్యం సహకరించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ఆత్మవిశ్వాసంతో కూడిన నవభారత సామూహిక సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ గొప్ప బలం దాని ఐక్యతేనని, "భారతదేశం ఒకటే - ఒకటిగానే ఉంది - ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది" అని ఆయన ప్రసంగాన్ని ముగించారు.
ప్రారంభంలో ఒక ప్రతీకాత్మక జాతీయ పాదయాత్రగా మొదలైన ఈ ఉద్యమం, 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమృత కాల యువశక్తి, పౌరులు, సమాజాల సహకారంతో దేశవ్యాప్త మహా ఉద్యమంగా విస్తరించింది. దీనికి ముందస్తుగా దేశవ్యాప్తంగా, 1,527 జిల్లా స్థాయి పాదయాత్రలు నిర్వహించారు. ఇవి 450కి పైగా లోక్సభ నియోజకవర్గాలను, 640కి పైగా జిల్లాలను కలుపుకొని, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 15 లక్షలకు పైగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చాయి. 717 జిల్లాల నుంచి 3.5 లక్షల మంది యువత జాతీయ పాదయాత్రలో పాల్గొన్నారు. గరుడేశ్వర్ దత్ ఆలయం నుంచి ప్రారంభమైన ముగింపు యాత్ర ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం వద్దకు చేరుకోగా, వాతావరణం దేశభక్తి, సామూహిక గర్వంతో నిండిపోయింది. భారతదేశ విస్తారమైన వైవిధ్యాన్ని చాటే సాంస్కృతిక ప్రదర్శనలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్తో సహా జాతీయ నాయకులకు నివాళులు, భారతసుస్థిర భవిష్యత్తుకు ప్రతీకగా ఒక ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమంతో, ఈ యాత్ర ఒక జాతీయ చైతన్య క్షణంగా ముగిసింది. ఇది 'ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్'ను వేడుకగా జరుపుతూ, దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్న సర్దార్ వల్లభభాయి పటేల్ దార్శనిక శాశ్వత వారసత్వాన్ని పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2200030)
आगंतुक पटल : 33