రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సింధూర్ పౌర-సైనిక కలయికకు అద్భుతమైన ఉదాహరణ; ప్రజా విశ్వాసాన్ని పెంపొందించడానికి సాయుధ దళాలతో కలిసి సమర్థవంతంగా పనిచేసిన పరిపాలనా యంత్రాంగం: ఎల్బీఎస్ఎన్ఏఏలో రక్షణ మంత్రి
‘‘యువ సివిల్ సర్వెంట్లు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో తమ కీలక పాత్రను తప్పక అర్థం చేసుకోవాలి; ధైర్యవంతులైన సైనికుల్లాగే, వారు కూడా క్లిష్ట పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి."
प्रविष्टि तिथि:
29 NOV 2025 2:07PM by PIB Hyderabad
పౌర-సైనిక సమ్మేళనానికి ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ పరిపాలనా యంత్రాంగం సాయుధ దళాలతో సమన్వయంగా కలిసి పనిచేసి, ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించింది’’ అని రక్షణమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యువ సివిల్ సర్వెంట్లు జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో తమ కీలక పాత్రను అర్థం చేసుకోవాలని, ధైర్యవంతులైన సైనికుల్లాగే, క్లిష్ట పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముస్సోరీలోని లాల్ బహాదూర్ శాస్త్రీ జాతీయ పరిపాలనా అకాడమీలో నవంబర్ 29న జరిగిన 100వ కామన్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి రక్షణమంత్రి హాజరై ప్రసంగించారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తి సమన్వయంతో, ఉద్రిక్తత రహితంగా ప్రతిస్పందన ద్వారా ధ్వంసం చేశాయని రక్షణమంత్రి చెప్పారు. అయితే పొరుగు దేశం దుష్ప్రవర్తన కారణంగా సరిహద్దు వెంబడి పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి రాలేదని పేర్కొన్నారు. ధైర్యవంతులైన సైనికుల శౌర్యాన్ని ప్రశంసించినట్లే.. పరిపాలనా అధికారులు కూడా కీలక సమాచారాన్ని తెలియజేయడంలో, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ విజయవంతంగా నిర్వహించడంలో చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్గా మారాలంటే పరిపాలన, జాతీయ భద్రత మధ్య సమన్వయం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంత్రాలైన ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’, సంస్కరణ, నిర్వహణ, మార్పు’ను ప్రస్తావిస్తూ.. స్వావలంబన, వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ‘‘2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆర్థిక పరంగా భారత్ 11వ స్థానంలో ఉండేది. గత 9,10 సంవత్సరాల్లో మనం నాల్గొ స్థానానికి ఎదిగాం. మోర్గన్ స్టాన్లీ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా వచ్చే రెండు మూడు ఏళ్లలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని చెబుతున్నాయి. మీరు కేవలం పౌర సంరక్షులు కాదు, ప్రజా సేవకులు. మీరు కేవలం సేవలు అందించే వారు కాదు.. సాధికారతకు సౌలభ్యం కల్పించేవారు. మీ వ్యక్తిత్వం అవినీతి రహితంగా ఉండాలి. మీ ప్రవర్తన నీతిమంతంగా ఉండాలి. నిజాయితీ అనేది గుణం లేదా మినహాయింపు కాకుండా నిత్య జీవితంలో సాధారణ భాగంగా ఉండే సంస్కృతిని మీరు సృష్టించాలి.’’ అని ఆయన తెలిపారు. సివిల్ సర్వెంట్లు బాధ్యత, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆయన కోరారు.
యువ సివిల్ సర్వెంట్లు సాంకేతికత ఆధారిత యుగంలో వినూత్నంగా పనిచేయాలని, ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని రక్షణమంత్రి మంత్రి పిలుపునిచ్చారు. సాంకేతికతను సాధికారత సాధనంగా ఉపయోగించాలని తెలిపారు. ఇందుకు ప్రధాన మంత్రి జన ధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆదాయపు పన్ను శాఖ ఫేస్లెస్ అసెస్మెంట్ పథకం వంటి కార్యక్రమాల విజయాలను ఆయన ఉదహరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘సంపూర్ణ’ ప్రాజెక్టు గురించి వివరిస్తూ.. ఇది కృత్రిమ మేధ ఆధారిత స్వయంచాలక వ్యవస్థ అని తెలిపారు. రక్షణ కొనుగోలు, చెల్లింపులను పారదర్శక పద్దతిలో విశ్లేషిస్తుందన్నారు. సాంకేతికత కేవలం సాధనం మాత్రమే కావాలని కానీ అదే అంతిమ లక్ష్యం కాకూడదని స్పష్టం చేశారు. ‘‘ప్రజలకు చేరువ, అందుబాటు, పారదర్శకత పెంపు కోసం సాంకేతికతను ఉపయోగించాలి. సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి, సమానత్వాన్ని పెంచడానికి సాంకేతికతను వినియోగించండి’’ అని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
పౌర ఉద్యోగులు, శిక్షణార్థులు మంచితనం, అర్థం చేసుకునే తత్వంతో ప్రతి పౌరున్ని కలవాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ సూచించారు. ‘‘అధికారులు సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల ప్రజలతో సంభాషించినప్పుడు.. ఆ ప్రజల కష్టాలు కేవలం వారి ప్రయత్నాల వల్ల మాత్రమే కాకుండా, విస్తృత సామాజిక, ఆర్థిక పరిస్థితుల ద్వారా కూడా ఏర్పడతాయని వారు గుర్తించాలి. ఇదే నిజమైన నిర్వాహకుడుని ప్రజల పట్ల మానవత్వం, కరుణ గల వ్యక్తిగా మారుస్తుంది’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
సివిల్ సర్వీసుల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటాన్ని రక్షణమంత్రి ప్రస్తావించారు. ఇటీవల జరిగిన యూపీఎస్సీ పరీక్షలో ఒక మహిళ మొదటి స్థానాన్ని సంపాదించిందని, తొలి అయిదుగురిలో ముగ్గురు అభ్యర్థులు మహిళలేనని తెలిపారు. 2047 నాటికి చాలా మంది మహిళలు కేబినెట్ కార్యదర్శుల స్థాయికి చేరుకుని దేశ అభివృద్ధి ప్రయాణానికి నాయకత్వం వహిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఫౌండేషన్ కోర్సును కేవలం శిక్షణ మాడ్యూల్గా మాత్రమే కాకుండా.. సమర్థవంతమైన, సామర్థ్యం గల, సున్నితమైన పాలన వ్యవస్థను నిర్మించేందుకు ఓ నిబద్ధతగా శ్రీ రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. దేశ పరిపాలనా సామర్థ్యాలను బలోపేతం చేసే సంపూర్ణ సంస్థగా ఎదిగిన ఎల్బీఎస్ఎన్ఏఏ సమగ్ర శిక్షణా వ్యవస్థను ఆయన ప్రశంసించారు.
మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన పేరును కలిగిన అకాడమీ ధైర్యం, సరళత, నిజాయితీకి చిహ్నంగా నిలుస్తోందని రక్షణ మంత్రి తెలిపారు. 1965 యుద్ధంలో శాస్త్రి గారి నాయకత్వాన్ని, హరిత విప్లవంలో ఆయన పాత్రను ప్రస్తావించారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ సందేశాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన ఆదర్శం నుంచి అధికారులు స్ఫూర్తి పొందాలని కోరారు. యూపీఎస్సీ తన 100వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, యూపీఎస్సీ, ఎల్బీఎస్ఎన్ఏఏ మధ్య భాగస్వామ్యం తరతరాలుగా పరిపాలనాధికారులను తీర్చిదిద్దిందని, దేశ పాలనా నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
అంతకుముందు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి,దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు శ్రీ రాజ్నాథ్ సింగ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అకాడమీ ప్రాంగణంలో ఓడీఓపీ పెవిలియన్ను కూడా ప్రారంభించారు.
***
(रिलीज़ आईडी: 2196694)
आगंतुक पटल : 2