నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘‘అత్యంత వృద్ధిని సాధించే దశాబ్దంలోకి భారత సరకు రవాణా రంగం ప్రవేశిస్తోంది, దాని కోసం ఆధునికమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్య శక్తి అవసరం’’ - హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం (సీవోఎల్టీఈ) ప్రారంభ కార్యక్రమంలో శ్రీ జయంత్ చౌధరి
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎల్ఎస్సీ) సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెడింగ్టన్ సీఎస్ఆర్ విభాగమైన రెడింగ్టన్ ఫౌండేషన్
ఎగ్జిమ్ అసోసియేట్, ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్, వేర్హౌజ్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, సప్లయ్ చెయిన్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఉద్యోగాల రూపంలోనూ, అధునాతన సిమ్యులేషన్ ప్రయోగశాలలు, సాంకేతిక ఆధారిత శిక్షణ రూపంలోనూ- హైదారాబాద్ లోని లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం బలోపేతం కానున్న తెలంగాణ సరకు రవాణా రంగం
పరిశ్రమ 4.0 నియమాలను, నూతన సరఫరా వ్యవస్థ సాంకేతికతలను పాఠ్య ప్రణాళికలో చేర్చనున్న
హైదరాబాద్ లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం
ఈ సంస్థ ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు
Posted On:
20 NOV 2025 6:14PM by PIB Hyderabad
‘‘జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతిశక్తి, బహుళ విధ మౌలికవసతుల్లో అపూర్వమైన పెట్టుబడులతో భారీ వృద్ధిని సాధించే దశాబ్దంలోకి భారతీయ సరకు రవాణా రంగం అడుగుపెడుతోంది. కానీ, ఆధునిక శ్రామిక శక్తిని, భవిష్యత్తు అవసరాలకు తగిన వ్యవస్థలను మనం తయారుచేసినప్పుడు మాత్రమే ఈ మార్పు కొనసాగుతుంది’’ అని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం (ఎంఎస్డీఈ) సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని ఎన్ఎస్టీఐ క్యాంపస్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ప్రసంగించారు. భారతీయ సరకు రవాణా రంగంలో సాంకేతిక ఆధారిత నైపుణ్యాభివృద్ధిలో కీలకమైన దశను ఈ కార్యక్రమం సూచిస్తుంది.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎల్ఎస్సీ) సహకారంతో రెడింగ్టన్ లిమిటెడ్ సీఎస్ఆర్ విభాగమైన రెడింగ్టన్ ఫౌండేషన్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చెన్నైలో 2024 జనవరిలో ప్రారంభమై.. ఆధునికమైన, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉన్న సరకు రవాణా నైపుణ్యాలకు ప్రామాణికంగా నిలిచిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం విజయవంతమైన అనంతరం హైదరాబాద్ లో దీనిని ఏర్పాటు చేశారు. అత్యాధునికమైన ఏఆర్/వీర్ విధానాలు, ఇండస్ట్రీ-గ్రేడ్ సిమ్యులేటర్లు, విద్యాసంస్థలు, పరిశ్రమల సహకారంతో నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు గతేడాదిగా చెన్నై కేంద్రం నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ విధానం వల్ల కలిగే అధిక ప్రభావాన్ని, దాని ఉపయోగాన్ని ఈ కేంద్రం సాధించిన ఫలితాలు వివరించాయి. దీంతో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్లో దీని ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
‘‘భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా సాంకేతిక ఆధారితమైన, పరిశ్రమలు, వాస్తవ కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా సరకు రవాణా నైపుణ్యాలు ఎలా ఉండాలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణా కేంద్రం లాంటి సంస్థలు వివరిస్తాయి. ఆటోమేషన్, డిజిటల్ సరఫరా వ్యవస్థలు, కొత్త రవాణా విధానాలు ఈ రంగాన్ని పునర్నిర్వచిస్తున్న నేపథ్యంలో ఈ పోటీలో భారత్కు వెన్నుదన్నుగా నిపుణులు నిలుస్తారు. మా ఉద్దేశం స్పష్టంగా ఉంది. భారతీయ సరకు రవాణా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్నీ, స్థిరత్వాన్నీ, ప్రపంచ నాయకత్వాన్నీ ముందుకు నడిపించేలా లక్షలాది మంది భారతీయ యువతకు నైపుణ్యాలను అందించడం’’ అని ఆయన అన్నారు.
ట్రక్ డ్రైవింగ్, గిడ్డంగి కార్యకలాపాలు, ఫోర్క్లిఫ్ట్ నిర్వహణకు సిమ్యులేషన్ ల్యాబులతో సహా ఇతర నైపుణ్యాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కొత్త కేంద్రం గణనీయంగా పెంపొందిస్తుంది. ఎల్ఎస్సీ, పారిశ్రామిక నిపుణులతో కలసి అభివృద్ధి చేసిన బోధనాంశాల్లో పరిశ్రమ 4.0 నియమాలను, నూతన సరఫరా వ్యవస్థ సాంకేతికతలను హైదరాబాద్ లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం చేరుస్తుంది. తద్వారా సాంకేతిక ఆధారిత రవాణా రంగం అంచనాలను అందుకొనేలా.. ఉద్యోగానికి తగిన, భవిష్యత్తు ఆధారిత నైపుణ్యాలను శిక్షణ పొందేవారికి అందిస్తుంది. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలను పెంపొందించడానికి, ఈ ప్రాంతంలో విస్తృత నైపుణ్యాలున్న శ్రామిక శక్తిని నిర్మించడానికి ఈ కేంద్రం దోహదపడుతుంది.
‘‘భారతీయ సరకు రవాణా రంగంలో ఉద్యోగాలను సాంకేతిక ఆధారిత శిక్షణ ఎలా మార్చగలదో చెన్నైలోని లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం చూపించింది. దీనికి లభించిన గొప్ప స్పందన , బలమైన పారిశ్రామిక సహకారాన్నీ, మెరుగైన ఉద్యోగ సన్నద్ధతను చూసిన అనంతరం దేశవ్యాప్తంగా ఈ శిక్షణను విస్తరించగలమనే మా విశ్వాసం మరింత బలపడింది. లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా అంతర్జాతీయ స్థాయి సిమ్యులేటర్లు, డిజిటల్ శిక్షణ పరికరాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణను హైదరాబాద్కు తీసుకొస్తున్నాం. వేగంగా రూపాంతరం చెందుతున్న, సాంకేతిక ఆధారిత సరకు రవాణా రంగం అవసరాలను తీర్చగలిగే, భారత ఆర్థిక పురోగతికి అర్థవంతంగా సహకరించే భవిష్యత్తు అవసరాలకు తగిన నిపుణులను తయారు చేయడమే మా లక్ష్యం’’ అని రెడింగ్టన్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ ఆర్ వెంకటేష్ అన్నారు.
దేశవ్యాప్తంగా సరకు రవాణా, సరఫరా వ్యవస్థ నిర్వహణలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై ఎంఎస్డీఈకి ఉన్న నిబద్ధతను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం స్పష్టం చేస్తుంది. ప్రతి రంగానికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించినందున పరిశ్రమ సామర్థ్యాలను విస్తరించడం, ఉపాధిని పెంపొందించడం, అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయంగా పోటీ పడే శ్రామికశక్తిని నిర్మించడం ద్వారా భారతీయ ప్రగతిని ముందుకు నడిపించాలనే ఈ శాఖ లక్ష్యాన్ని తెలియజేస్తుంది.




***
(Release ID: 2192234)
Visitor Counter : 8