ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కృత్రిమ మేధపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు 'యువ ఏఐ ఫర్ ఆల్' అనే ఉచిత జాతీయ కోర్సును ప్రారంభించిన భారత ప్రభుత్వం


అందరికీ కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులో ఉండేలా స్వల్ప కాల, సులభమైన, ఆచరణాత్మకమైన ఉచిత కోర్సు

కోటి మంది పౌరులకు ప్రాథమిక ఏఐ నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం

కోర్సు ద్వారా ప్రపంచ పరిజ్ఞానాన్ని భారత్ నేపథ్యంతో మేళవించి, నైతిక, బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ వినియోగంపై దృష్టి

Posted On: 18 NOV 2025 6:45PM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని భారత్ లో అందరికీ, ముఖ్యంగా యువతకు పరిచయం చేసే లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ‘ఇండియాఏఐ‘ మిషన్ కింద, మొట్టమొదటిసారిగా  'యువ ఏఐ  ఫర్ ఆల్' ఉచిత కోర్సును ప్రారంభించింది.

విద్యార్థులు, , నిపుణులు,  ఇతర ఆసక్తిగల అభ్యాసకులు నాలుగైదు గంటల స్వల్ప వ్యవధిలో సులభంగా ఏఐ  ప్రాథమిక అంశాలను తెలుసుకోవడానికి, ఇది ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో అవగాహన పొందడానికి వీలుగా  ఈ కోర్సును రూపొందించారు. ఇది సులభంగా, ఆచరణాత్మకంగా ఉంటుంది. దీనిని నేర్చుకోవడంలో ఆసక్తి, ఉత్సాహం కోసం కోర్సులో నిజ జీవిత భారతీయ ఉదాహరణలను జోడించారు.

ఈ కోర్సు ప్రముఖ అభ్యసన వేదికలైన ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్,  ఐగాట్ కర్మయోగి, ఇతర ప్రముఖ ఎడ్‌ - టెక్ పోర్టల్స్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.కోర్సును పూర్తి చేసిన ప్రతి అభ్యాసకుడికి భారత ప్రభుత్వం నుంచి అధికారిక సర్టిఫికెట్ లభిస్తుంది.

ఆరు చిన్న, ఆకర్షణీయమైన మాడ్యూళ్ల ద్వారా, అభ్యాసకులు కింద అంశాలు తెలుసుకుంటారు. 

• నిజంగా ఏఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు

• విద్య, సృజనాత్మకత,  పనిని ఏఐ  ఎలా మారుస్తుందో అర్థం చేసుకుంటారు

• ఏఐ  సాధనాలను సురక్షితంగా బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు

• భారత్ లో విజయవంతమైన వాస్తవ ప్రపంచ ఏఐ  వినియోగ కేసులను అన్వేషిస్తారు.

• ఏఐ భవిష్యత్, రాబోయే కొత్త అవకాశాల గురించి ముందస్తు ఆలోచన చేస్తారు. 

'యువ ఏఐ ఫర్ ఆల్‘ ఎందుకు?

*ఇది 100% ఉచితం. అందరికీ అందుబాటులో ఉంటుంది

*ఎప్పుడైనా, ఎక్కడైనా స్వయంగా త్వరగా నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది

*కోర్సు పూర్తి చేశాక భారత ప్రభుత్వ సర్టిఫికెట్ పొందవచ్చు

*భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు అవసరమైన నైపుణ్యాలను పొందవచ్చు.

*ఇది ఏఐ ఆధారిత దేశంగా మారే భారత ప్రయాణంలో ఒక భాగంగా ఉంటుంది

భారత ఏఐ భవిష్యత్ నిర్మాణం

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం ద్వారా కోటి మంది పౌరులకు మౌలిక ఏఐ  నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది — దీని ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం, భారతీయ పనివారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడం సాధ్యమవుతుంది.

ఈ కోర్సును దేశంలోని ప్రతి మూలకు చేర్చడానికి సంస్థలు, పాఠశాలలు,  విశ్వవిద్యాలయాలు ఇండియాఏఐ తో భాగస్వామ్యం చేసుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలు ఈ కోర్సును అనుసంధానం చేయడంతో పాటు, అభ్యాసకుల కోసం ప్రచారం చేయవచ్చు. సర్టిఫికెట్‌లను కో-బ్రాండ్ చేయవచ్చు.

ఇండియా ఏఐ మిషన్ కోసం, ప్రముఖ ఏఐ నిపుణుడు,  రచయిత, ఏఐ అండ్ బియాండ్, టెక్ విస్పరర్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు జస్ప్రీత్ బింద్రా  ఈ కోర్సును తయారు చేశారు. ఈ కోర్సు ప్రపంచ పరిజ్ఞానాన్ని భారతదేశ నేపథ్యంతో మేళవించి, నైతిక, బాధ్యతాయుత,   సమ్మిళిత  ఏఐ వినియోగంపై దృష్టి పెడుతుంది.

https://www.futureskillsprime.in/course/yuva-ai-for-all/  లో ఈ కోర్సును యాక్సెస్ చేయవచ్చు:

 

***


(Release ID: 2191484) Visitor Counter : 20