పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
టోక్యో ఇండస్ట్రీ మీట్లో ఇండో-జపనీస్ ఇంధన అవకాశాలను స్పష్టం చేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ
Posted On:
17 NOV 2025 4:38PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ ఈ రోజు టోక్యోలో జపాన్ పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం ఇంధన వాణిజ్య కార్యకలాపాల్లో ఇండో-జపాన్ సహకారం కోసం గల అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన భారత్, జపాన్ దేశాలు సురక్షితమైన, సుస్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఇంధన వ్యవస్థల నిర్మాణం కోసం కలిసి పనిచేయగల అవకాశాలనూ వారు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మెరుగైన భారత్ స్థాయి, పెరుగుతున్న ఇంధన డిమాండ్, అపూర్వ మౌలిక సదుపాయాల విస్తరణకు జపాన్ సాంకేతిక నైపుణ్యం తోడైతే ఈ ప్రాంత దీర్ఘకాలిక ఇంధన సుస్థిరత కోసం సహజ భాగస్వామ్యాన్ని సృష్టించవచ్చని శ్రీ పురీ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి శ్రీ మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తదుపరి దశాబ్దానికి భారత్-జపాన్ ఉమ్మడి దార్శనికతను ఆమోదించాయని ఈ చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2022–2026 కాలంలో జపాన్ నుంచి భారతదేశానికి వచ్చిన 5 ట్రిలియన్ జేపీవై ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో గణనీయ లక్ష్యాన్ని సాధించిన క్రమంలో... సమీప భవిష్యత్తులో 10 ట్రిలియన్ జెపీవై (68 బిలియన్ల అమెరికన్ డాలర్ల) ప్రైవేట్ రంగ పెట్టుబడులను సాధించాలనే సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. ఈ విజయం ప్రత్యేకించి పరిశుద్ధ ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సమన్వయాన్ని స్పష్టం చేస్తుంది... ఈ భాగస్వామ్యం ద్వారా ఆచరణాత్మక, పరివర్తనాత్మక ఫలితాలు సాధించడం పట్ల ప్రధానమంత్రి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు.
అన్వేషణ, ఉత్పత్తి, ఎన్ఎన్జీ, నగర గ్యాస్ పంపిణీ, హైడ్రోజన్, షిప్పింగ్, నూతన ఇంధనాల్లో భారత్ 500 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి అవకాశాలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పురీ స్పష్టం చేశారు. అత్యధిక యువ శ్రామిక శక్తి, బలమైన సంస్కరణ-ఆధారిత వ్యాపార వాతావరణం, ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత్ జపాన్ పెట్టుబడిదారుల కోసం అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, అధునాతన పారిశ్రామిక వ్యవస్థలు, అధిక-నాణ్యత గల మౌలిక సదుపాయాల నైపుణ్యం, గ్రీన్-పర్యావరణ సాంకేతికతల్లో ప్రపంచస్థాయి నాయకత్వాన్ని అందిస్తూ జపాన్ ఇరుదేశాల భాగస్వామ్యాన్ని పరిపూర్ణం చేస్తోంది.
ఇంధన రంగాల్లో 100 శాతం ఎఫ్డీఐ, పారదర్శక బిడ్డింగ్, ఏడాది పొడవునా అన్వేషణ లైసెన్సింగ్ ద్వారా భారత్ విధానంలో పూర్తిగా మార్పు వచ్చిందన్న కేంద్ర మంత్రి... అంచనా వేయగల, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని ఇది సృష్టించిందని స్పష్టం చేశారు. దేశంలోని ఆరు ప్రధాన చమురు, గ్యాస్ పీఎస్యూలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 315 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేశాయనీ, ఇది భారత జీడీపీలో దాదాపు 8 శాతం వాటాకు సమానమని కేంద్ర మంత్రి శ్రీ పురీ పేర్కొన్నారు. ఈ స్థాయి... ప్రపంచ ఇంధన రంగంలో భారత్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు జపనీస్ కంపెనీలకు నమ్మకమైన దీర్ఘకాలిక భాగస్వామిగా భారత్ను నిలిపిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్... రాబోయే రెండు దశాబ్దాల్లో పెరుగుతున్న ప్రపంచ ఇంధన డిమాండ్లో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. సుమారు 72 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో విస్తరిస్తున్న భారత సహజవాయువు మౌలిక సదుపాయాలు... జపాన్ సాంకేతిక బలంతో సహోత్తేజానికి, ముఖ్యంగా హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధన పరిష్కారాలతో గ్యాస్ను అనుసంధానించడంలో కీలకంగా మారాయని ఆయన తెలిపారు.
భారత పారిశ్రామిక వ్యవస్థను పునర్నిర్మించిన మారుతి-సుజుకి భాగస్వామ్యాన్ని ఉదాహరణగా ఉటంకిస్తూ... ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న నమ్మకాన్ని శ్రీ పురీ గుర్తు చేసుకున్నారు. భారత్-జపాన్ ప్రస్తుత ఇంధన రంగంలో ఒకే స్థాయి వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ వారు ప్రపంచ స్థాయి సామర్థ్యాలను నిర్మించుకోవచ్చు... సంయుక్తంగా సమర్థ సరుకు రవాణా వ్యవస్థను సృష్టించవచ్చు... నైపుణ్యం కలిగిన సిబ్బందిని అభివృద్ధి చేయవచ్చు... ఇండో-పసిఫిక్ ఇంధన భద్రతను సంయుక్తంగా బలోపేతం చేయవచ్చు... అని కేంద్ర మంత్రి వివరించారు.
భారత్లో అభివృద్ధి చెందుతున్న ఇంధన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జపాన్ పరిశ్రమను ఆహ్వానించిన కేంద్ర మంత్రి... అన్ని వాణిజ్య కార్యకలాపాల్లో లోతైన సహకారాన్ని సులభతరం చేయడానికి, సంపూర్ణ మద్దతునందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2191034)
Visitor Counter : 2