వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025ను ప్రారంభించిన వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద్
సాంకేతికంగా ముందంజలో ఉన్న, స్థిరమైన భారత్ దార్శనికతను ఐఐటీఎఫ్ 2025 ప్రదర్శిస్తుంది: శ్రీ జితిన్ ప్రసాద
Posted On:
14 NOV 2025 10:20PM by PIB Hyderabad
అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో ఉన్న భారత్ సామర్థ్యాన్ని 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్) 2025 తెలియజేస్తుందని పరిశ్రమలు, వాణిజ్యం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ఐఐటీఎఫ్ 2025ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ప్రసంగించారు.
స్వావలంబన దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని శ్రీ ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత అయిన ‘‘వికసిత భారత్ @2047’’ స్ఫూర్తిగా, ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ ఇతివృత్తం కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాంకేతికంగా ముందంజలో ఉన్న, ఆర్థికంగా స్థిరత్వం సాధించిన దేశాన్ని ప్రదర్శిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో ఐటీపీవో చేపట్టిన ప్రయత్నాలను గుర్తిస్తూ.. దశాబ్దం తర్వాత డిఫెన్స్ పెవిలియన్ తిరిగి ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. వివిధ రంగాల్లో విస్తరించిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతిని, ఉపాధి కల్పనలో దాని పాత్రను ఈ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమం తెలియజేస్తుందని ఆయన అన్నారు. వివిధ భాగస్వామ్య దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. స్థిరమైన భారతీయ విధాన వ్యవస్థ, పెట్టుబడుల వాతావరణంపై అంతర్జాతీయంగా విశ్వాసం పెరుగుతోందన్నారు.
బలమైన ఆర్థిక మూలాలు, స్థిరమైన విధాన సంస్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణల తోడ్పాటుతో అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి పెరుగుతోందని శ్రీ ప్రసాద్ తెలిపారు. ఇవి అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల్లో దేశం పాత్రను బలోపేతం చేస్తున్నాయన్నారు.
ఐటీపీవో ఛైర్మన్ శ్రీ నితిన్ కుమార్ యాదవ్, ఐటీపీవో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్, ఐటీపీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ప్రేమ్జీత్ లాల్, రాజస్థాన్ ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య ప్రధాన కార్యదర్శి శ్రీ అలోక్ గుప్తా, బీహార్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ కుందన్ కుమార్, జార్ఖండ్ రెసిడెంట్ కమిషనర్, కార్యదర్శి శ్రీ అరవ రాజ్ కమల్, ఇతర ప్రభుత్వ అధికారులు, దేశవిదేశాలకు చెందినవారు, ప్రతినిధులు, విలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఐటీఎఫ్ 2025లో ప్రధాన కార్యక్రమాల గురించి ఐటీపీవో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నితిన్ కుమార్ యాదవ్ తన స్వాగతోపన్యాసంలో వివరించారు. వ్యాపార భాగస్వామ్యం, సాంకేతిక వినిమయం, పెట్టుబడి అవకాశాలకు వేదికగా ఈ ఫెయిర్ కొనసాగుతుందన్నారు. దేశవిదేశాల నుంచి 3,500 మందికికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. భాగస్వామ్య రాష్ట్రాలుగా బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వ్యవహరిస్తుండగా.. ప్రధాన దృష్టి సారించే రాష్ట్రంగా జార్ఖండ్ ఉంది. అంతర్జాతీయ పెవిలియన్లో పదకొండు దేశాలు- చైనా, థాయిలాండ్, యూఏఈ, మలేషియా, స్వీడన్, తుర్కియే, ఇరాన్, దక్షిణ కొరియా, ఈజిప్టు, లెబనాన్, రిపబ్లిక్ ఆఫ్ ట్యునీషియాతో పాటుగా టిబెటన్ ఛాంబర్ ఆప్ కామర్స్ పాల్గొంటాయి.
ఐటీపీవో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్ వందన సమర్పణ చేశారు. వాణిజ్యం, సాంకేతికత, సాంస్కృతిక వినిమయాల కేంద్రంగా ఐఐటీఎఫ్ ప్రాత్రను స్పష్టం చేస్తూ వివిధ ప్రభుత్వ విభాగాలు, పీఎస్యూలు, ఎంఎస్ఎంఈలు, అంకురసంస్థలు, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ రంగాలకు చెందిన ఉత్పత్తులను సరస్ ఎగ్జిబిటర్లు, జ్యూట్ తయారీదారుల అభివృద్ధి మండలి, ఎంఎస్ఎంఈలు, చేనేత, హస్త కళాకృతులు, కాయిర్ బోర్డు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు ప్రదర్శనలో ఉంచాయి.
***
(Release ID: 2190443)
Visitor Counter : 4