ఎరువుల విభాగం
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, దారిమళ్లింపు వంటి అంశాలపై చర్యలు తీసుకున్న ఎరువుల విభాగం..
ఖరీఫ్తో పాటు ప్రస్తుత 2025-26 రబీ పంటకాలంలో ఎరువులు
సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చూడటానికి సమన్వయ కార్యాచరణ
సరైన పంపిణీతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి
ముమ్మర తనిఖీలనూ, న్యాయపరమైన చర్యలనూ చేపట్టిన రాష్ట్రాలు
సమన్వయంతో చేపట్టిన నాణ్యత పరిరక్షణ చర్యలతో
నాసిరకం ఎరువుల తొలగింపు.. రైతుల్లో విశ్వాసం పెంపు
దేశవ్యాప్తంగా లభ్యతనీ, పారదర్శకతనీ, జవాబుదారీతనాన్నీ పెంచిన
డిజిటల్ పర్యవేక్షణ, తక్షణ సమన్వయ చర్యలు
Posted On:
13 NOV 2025 10:29AM by PIB Hyderabad
ఖరీఫ్ తో పాటు ప్రస్తుత 2025-26 రబీ సీజన్లో (ఏప్రిల్ నుంచి నవంబరు) రైతుల ప్రయోజనాలను కాపాడడానికీ, జాతీయ ఎరువుల సరఫరా వ్యవస్థను సురక్షితంగా ఉంచడానికీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం (డీఏ అండ్ ఎఫ్డబ్ల్యూ)తో సమన్వయాన్ని ఏర్పరుచుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఎరువుల విభాగం (డీఓఎఫ్) చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతో అనేక సంయుక్త సమావేశాలను డీఏ అండ్ ఎఫ్డబ్ల్యూ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎరువుల విభాగం కార్యదర్శి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో జిల్లాల అధికార యంత్రాంగాలు సమన్వయాన్ని ఏర్పరుచుకుని ఇరు పక్షాలూ కలిసి పనిచేశాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగునూ, దొంగ నిల్వలనూ, ఎరువులను చేర్చవలసిన రైతులకు కాకుండా ఇతర వర్గాలకు మళ్లింపునూ అడ్డుకోవడానికి ఇదివరకు ఎప్పుడూ లేనంత స్థాయిలో దాడులు, తనిఖీలు, సోదాలతో పాటు న్యాయపరమైన చర్యలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా వ్యవహరిస్తూ కఠిన చర్యలను తీసుకుని, దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూశాయి. ఎరువులు సకాలానికి అందేటట్లు చూస్తూ, మార్కెట్లో క్రమశిక్షణను పటిష్ఠపరిచాయి.
పంపిణీ నెట్వర్కును పర్యవేక్షించడంలో భాగంగా దేశమంతటా మొత్తం 3,17,054 తనిఖీలు, సోదాలను నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగుకు పాల్పడినందుకు 5,119 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 3,645 లైసెన్సులను రద్దు లేదా సస్పెన్షన్ చేయడమే కాకుండా, 418 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకొనే క్రమంలో 667 షోకాజ్ నోటీసులనూ, 202 లైసెన్సుల సస్పెన్షన్, లేదా రద్దుతో పాటు 37 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఎరువులను రైతులకు ఇవ్వకుండా ఇతరత్రా మళ్లించడాన్ని అడ్డుకోవడానికి 2,991 షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, 451 లైసెన్సులను రద్దు, లేదా సస్పెండ్ చేశారు. 92 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు ఎరువుల నియంత్రణ ఉత్తర్వు నియమావళి ప్రకారం నేర నియంత్రణ చర్యలను తీసుకుని, నియమాలను తప్పనిసరిగా పాటించేలా, జవాబుదారీతనం వహించేలా తగిన జాగ్రత్తచర్యలను తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనేక రాష్ట్రాలు వివిధ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ నాయకత్వం వహించింది. ఆ రాష్ట్రంలో 28,273 తనిఖీలను నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నట్లు గమనించి 1,957 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 157 ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడంతో పాటు 2,730 లైసెన్సుల రద్దు, తాత్కాలికంగా నిలిపివేత చర్యలను తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ అనేక తనిఖీ బృందాలను రంగంలో దింపి, విస్తృత స్థాయిలో పర్యవేక్షణతో పాటు న్యాయ చర్యలను త్వరితగతిన చేపట్టడం ద్వారా నేరాలను నివారించాయి. మహారాష్ట్రలో సరుకు దారిమళ్ళింపునకు సంబంధించిన ఉల్లంఘనల విషయంలో 42,566 తనిఖీలు చేపట్టడంతో పాటు 1,000కి పైగా లైసెన్సులు రద్దు చేశారు. రాజస్థాన్లో11,253 తనిఖీలు పూర్తి చేశారు. వివిధ కేటగిరీల్లో సమగ్ర చర్యలు తీసుకున్నారు. బీహార్లో దాదాపు 14,000 తనిఖీలతో పాటు 500కి పైగా లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చర్యలతో పంటకాలాల్లో అత్యంత అవసరమైన సమయాల్లో కృత్రిమ కొరతను అరికట్టడమే కాకుండా, ధరలను ఇష్టానుసారం పెంచకుండా చూశారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో నేర నియంత్రణ బృందాలు సమన్వయాన్ని ఏర్పరుచుకుని పనిచేస్తున్నాయి. నాసిరకం ఎరువులను సరఫరా చేసిన కేసుల్లో 3,544 షో కాజ్ నోటీసులను జారీ చేశారు. 1,316 లైసెన్సులను రద్దు , లేదా నిలిపివేత చర్యలు తీసుకున్నారు. ఎరువుల నియంత్రణ ఉత్తర్వు-1985ను కచ్చితంగా పాటిస్తూ 60 ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. సరఫరా వ్యవస్థలో నుంచి నాసిరకం సామగ్రిని తొలగించడానికి అనేక స్థాయుల్లో ఎప్పటికప్పుడు నమూనాలను సేకరించి కఠిన పరీక్షలు నిర్వహించారు. నిర్దిష్ట ప్రమాణాలున్న ఎరువులను మాత్రమే రైతులకు అందించేటట్లు జాగ్రత్తచర్యలను తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్రాల అధికారులు నాణ్యతా తనిఖీలు చేపడుతూ, రైతుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు దేశ ఎరువుల పంపిణీ వ్యవస్థ సమగ్రతను పరిరక్షిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి అధికారులు డిజిటల్ డ్యాష్బోర్డుల సాయంతో, వనరులను సమన్వయం చేసుకుంటూ, నిల్వల సరఫరాను వాస్తవ కాల ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. దొంగతనంగా నిల్వ చేసిన , లేదా స్వాధీనం చేసుకున్న ఎరువులను అధికారులు తిరిగి సహకార సంఘాలకు చేరుస్తున్నారు. రైతుల ఫిర్యాదులపై వెనువెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
చురుకుగా వ్యవహరిస్తున్నందుకూ, నిఘాను నిరంతరం కొనసాగిస్తున్నందుకూ, సమయానుకూల చర్యలు తీసుకుంటున్నందుకూ రాష్ట్ర, జిల్లా పాలనాయంత్రాంగాలు, వ్యవసాయ అధికారులు, నేర నియంత్రణ సంస్థలను ఎరువుల విభాగం ప్రశంసించింది. ఏవైనా అవకతవకలు చోటుచేసుకుంటే వాటిని గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగానూ, ఎరువుల పంపిణీ పారదర్శకంగా, చట్టబద్ధంగా సాగడానికి తోడ్పడాల్సిందిగానూ రైతులను, డీలర్లను, ఇతర ఆసక్తిదారులను కోరింది. ఎరువులు సక్రమంగా లభిస్తూ ఉండేటట్లు చూడటానికి కట్టుబడి ఉన్నామనీ, పౌరులు అప్రమత్తంగా ఉంటూ ఏ అక్రమం జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలనీ ఎరువుల విభాగం పిలుపునిచ్చింది.
***
(Release ID: 2189764)
Visitor Counter : 2