శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డాక్టర్ జితేంద్ర సింగ్తో లక్సెంబర్గ్ రాయబారి భేటీ..
అంతరిక్ష, సైన్స్ రంగాల్లో సహకారంపై చర్చ
భారత్, లక్సెంబర్గ్ మార్కెట్లలో భారతీయ అంతరిక్ష అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి
సైన్స్, నవకల్పనలతో పాటు అంకుర సంస్థల ప్రపంచ కూడలిగా భారత్ ఎదుగుతోందన్న డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
06 NOV 2025 7:08PM by PIB Hyderabad
సైన్స్, టెక్నాలజీ రంగాలతో పాటు అంతరిక్ష అన్వేషణలో సహకారాన్ని మరింత బలపరుచుకోవడానికి భారత్, లక్సెంబర్గ్ సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో... లక్సెంబర్గ్ రాయబారి శ్రీ క్రిస్టియన్ బీవర్తో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ విభాగం (డీఎస్టీ), అంతరిక్ష విభాగం (డీఓఎస్)లతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతికత, కృత్రిమ మేధ తదితర నవకల్పన ప్రధాన రంగాల్లో కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాలనే అంశంపై ఈ సమావేశంలో దృష్టి సారించారు.

భారత్లో ప్రయివేటు రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష అనుబంధ విస్తారిత వ్యవస్థను యూరప్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస లక్ష్యంతో భారతీయ అంతరిక్ష రంగ అంకుర సంస్థలను లక్సెంబర్గ్లో ప్రోత్సహించాలనే అంశం చర్చల్లో ప్రధానంగా చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తోడు ఇస్రో పరిశ్రమానుకూల విధానాలందిస్తున్న అండదండలతో, భారత్లో చైతన్యంతో తొణికిసలాడుతున్న అంకుర సంస్థల రంగం ప్రపంచ స్థాయి సహకారానికి అనేక అవకాశాలను అందించగల స్థితికి చేరిందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ఆర్థిక సాయం, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థల్లో లక్సెంబర్గ్ పటిష్ఠంగా ఉందనీ, యూరప్ మార్కెట్లు, సంయుక్త పరిశోధన, అభివృద్ధి సంస్థలతో పాటు పెట్టుబడి అవకాశాలను భారతీయ అంతరిక్ష రంగ అంకుర సంస్థలు అందుకోవడానికి లక్సెంబర్గ్ ప్రధానంగా ఉపయోగపడవచ్చనీ, రోజురోజుకూ మార్పునకు లోనవుతున్న ప్రపంచ అంతరిక్ష ముఖచిత్రంలో పరస్పర లాభదాయక భాగస్వామ్యానికి దీంతో దన్ను లభించగలదనీ ఆయన సూచించారు.
భారత్, లక్సెంబర్గ్ మధ్య దౌత్య సంబంధాలు 1948 నుంచీ దృఢతరమవుతున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లక్సెంబర్గ్ ప్రధానమంత్రి శ్రీ జేవియర్ బెటెల్ 2020 నవంబరులో దృశ్య మాధ్యమం ద్వారా చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశం సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సహకారానికి కొత్త దారులను ఏర్పరచడమే కాకుండా ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్ణీత క్రమంలో నిర్వహించుకొనేందుకు కూడా పునాది వేసిందని ఆయన అన్నారు.

సైన్స్, నవకల్పన రంగాల్లో ప్రపంచానికి నాయకత్వాన్ని అందించగలిగే స్థితికి భారత్ వేగంగా చేరుకొంటోందని, శాస్త్రవిజ్ఞాన ప్రచురణలు, అంకుర సంస్థల కార్యకలాపాల పరంగా ప్రపంచంలో అగ్రగామి మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధనం, సైబర్-భౌతిక వ్యవస్థలు, క్వాంటమ్ సాంకేతికతలు, నీలి ఆర్థిక వ్యవస్థ, తక్కువ ఖర్చులోనే ఆరోగ్యసంరక్షణ సేవలను అందించడం, తదితర కీలక రంగాల్లో అనేక జాతీయ పథకాలను భారత్ అమలు చేసిందని మంత్రి వివరించారు.

అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన విజయాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. 2023 ఆగస్టు లో చంద్ర గ్రహం దక్షిణ ధృవ సమీపంలో దిగిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని సంపాదించుకొనేటట్లు చంద్రయాన్-3 మిషన్ దోహదపడిందనీ, ఈ మిషన్ అంతరిక్ష రంగ సంబంధిత తయారీ, పరిశోధన విషయాల్లో ఇండియాను ఒక చైతన్యవంతమైన కూడలిగా నిలిపిందనీ మంత్రి అన్నారు. విశ్వాంతరాళాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకొనేందుకు భారత్, లక్సెంబర్గ్ 2022లో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నప్పటి నుంచీ అంతరిక్ష రంగంలో చురుకైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత, లక్సెంబర్గ్ ఉపగ్రహాలు రెండింటిని భారత పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాక, లక్సెంబర్గ్ అంతరిక్ష సంస్థ నిర్వహించిన ‘‘అంతరిక్ష వనరుల వారోత్సవం-2024’’లో ఇస్రో పాల్గొందనీ, ఇవి ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న సహకారానికి అద్దం పడుతున్నాయన్నారు.
సంయుక్త పరిశోధనతో పాటు ఇరు పక్షాల ప్రయోజనాలూ ముడిపడిన రంగాల్లో పారిశ్రామిక సంబంధాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలను రూపొందించడంపైనా ప్రధానంగా చర్చించారు. సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలు, ఇంధన ప్రత్యామ్నాయాలు, అంతరిక్ష రంగంలో నవకల్పన పరంగా ఇప్పటికే ఉన్న సంబంధాలను బలపరుచుకోవడంతో పాటు రెండు దేశాల బలాలను ఉపయోగించుకొనే విషయంలో ఉభయపక్షాలూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.

ప్రస్తుత చర్చలు అంతరిక్ష, విజ్ఞానశాస్త్ర రంగాల్లో భారత్-లక్సెంబర్గ్ సహకారానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయన్న ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. ఇది సంరక్షణ ప్రధానమైన ప్రపంచ అభివృద్దికి తోడ్పడటానికి టెక్నాలజీని ఒక శక్తిగా ఉపయోగించాలన్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, లక్సెంబర్గ్ నేతల ఉమ్మడి దృష్టికోణానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు.

***
(Release ID: 2187677)
Visitor Counter : 3