రక్షణ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో మంగోలియా అధ్యక్షుడిని కలిసిన రక్షణ మంత్రి
Posted On:
14 OCT 2025 8:41PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 14న ఢిల్లీలో మంగోలియా అధ్యక్షుడు శ్రీ ఉఖ్నాగిన్ ఖురేల్సుఖ్ తో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. శాంతి, సంక్షేమం విషయంలో ఇరు దేశాలు ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఇరువురు నాయకులూ అంగీకరించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని.. ఈ సహకారానికి రక్షణ రంగం చాలా ముఖ్యమైన అంశమని రక్షణ మంత్రి, మంగోలియా అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య విస్తృత సంబంధాలను నెలకొల్పేందుకు కొంతకాలంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం, సాయుధ బలగాల మధ్య సంబంధాలు, ఉన్నత స్థాయి పర్యటనలు, సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు, ద్వైపాక్షిక విన్యాసాలతో సహా ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు విస్తరించాయి.
మంగోలియన్ సాయుధ దళాలకు సంబంధించి సైబర్ భద్రత, సామర్ధ్యాల పెంపులో సహకారానికి గానూ భారతదేశానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ రాజ్నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు చమురు శుద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దీని ప్రారంభోత్సవం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు మంగోలియాలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు.
2018, 2022లో ఆ దేశ పర్యటన సందర్భంగా అధ్యక్షులు చూపించిన అప్యాయతను రక్షణ మంత్రి గుర్తు చేసుకున్నారు.
భారత్, మంగోలియా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలయిన సందర్భంగా 2025 అక్టోబర్ 13 నుంచి 16 వరకు మంగోలియా అధ్యక్షులు శ్రీ ఉఖ్నాగిన్ ఖురేల్సుఖ్ భారతదేశంలో అధికారికంగా పర్యటిస్తున్నారు.
***
(Release ID: 2179263)
Visitor Counter : 3