విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) 52వ వార్షికోత్సవం: భారత విద్యుత్ రంగంలో దార్శనిక కార్యక్రమాలపై ప్రధాన చర్చ
2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలోని బ్రహ్మపుత్ర బేసిన్లో విద్యుత్ సరఫరా ప్రణాళికల ఆవిష్కరణ
దేశవ్యాప్తంగా విద్యుత్ భద్రత, డేటా ఆధారిత నిర్ణయాలను బలోపేతం చేసే దిశగా విద్యుత్ ప్రమాద సమాచార పర్యవేక్షణ వ్యవస్థ (ఈఏడీఎంఎస్) పోర్టల్ను ప్రారంభించిన సీఈఏ
प्रविष्टि तिथि:
11 OCT 2025 3:04PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన సాంకేతిక సంస్థ అయిన సీఈఏ 52 వ వార్షికోత్సవం న్యూఢిల్లీలోని సెక్టార్ 1 లో ఉన్నసెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) గ్రంథాలయ భవనంలోని ఆడిటోరియంలో ఈ రోజు (2025, అక్టోబర్ 11) జరిగింది. దీర్ఘకాలిక విద్యుత్, వాతావారణ లక్ష్యాలకు అనుగుణంగా.. దేశంలో 2047 నాటికి 100 గిగా వాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికపై చర్చించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేశంలోని వినియోగదారులందరికీ 24×7 నాణ్యమైన విద్యుత్తును అందించాలనే లక్ష్యం దిశగా.. భారత విద్యుత్ రంగం చేస్తున్న ప్రయాణంలో సీఈఏ ముందంజలో ఉంది. దేశ విద్యుత్ అవసరాల ప్రణాళిక, నిర్వహణలో ఈ సంస్థ కీలక భూమిక పోషిస్తోంది. దేశంలో నమ్మకంగా.. సుస్థిరమైన విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పాన్ని అయిదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థ కొనసాగిస్తోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ హాజరయ్యారు. మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, పారిశ్రామిక సంఘాలు, సీఈఏ అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పంకజ్ అగర్వాల్ ప్రసంగిస్తూ... భారతీయ విద్యుత్ రంగాన్ని సమన్వయ విధానంలో అభివృద్ధి చేయడంలో సీఈఏ అందించిన సహకారాన్ని ప్రశంసించారు. దేశంలో నమ్మకంగా, చవకగా, స్థిరంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించడం, విద్యుత్ వ్యవస్థల ప్రణాళిక తయారు చేయడం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సీఈఏ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థల ఏకీకరణ, అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రిడ్ భద్రతను, స్థితిస్థాపకతను విస్తరించడం ద్వారా.. ‘2070 నాటికి సున్నా ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో సీఈఏ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
సీఈఏ, ఛైర్పర్సన్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ స్వాగతోపాన్యాసం చేస్తూ.. 1973లో ప్రారంభమైన నాటి నుంచి సంస్థ సాగించిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యుత్ ఉత్ప్తతి - సరఫరా ప్రణాళిక, సాంకేతిక ప్రమాణాలను రూపొందించడం, విద్యుత్ గ్రిడ్ను ఆధునికీకరించడంలో సంస్థ సాధించిన విజయాలను వివరించారు. స్థిరత్వం, సామర్థ్యం దిశగా భారత విద్యుత్ రంగాన్ని నడిపించడంలో డేటా ఆధారిత నిర్ణయాలు, డిజిటలైజేషన్, ఆవిష్కరణలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఆయన తెలియజేశారు.
వార్షికోత్సవంలో భాగంగా.. ముఖ్య అతిథి, సీఈఏ ఛైర్పర్సన్ చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రణాళికలు, పుస్తకాలను విడుదల చేశారు:
-
‘‘విద్యుత్ రంగంలో అణు విద్యుత్ సహకారం’’ పై హిందీలో త్రైమాసిక పత్రిక (ప్రత్యేక సంచిక) – ‘‘విద్యుత్ వాహిని’’ ఆవిష్కరించారు. దీనిని సీఈఏ ప్రచురించింది.
-
దీర్ఘ కాలిక విద్యుత్, పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా భారత అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే వ్యూహాత్మక మార్గాన్ని అందించే ‘‘2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్య లక్ష్య సాధన ప్రణాళిక’’ను విడుదల చేశారు.
-
‘‘బ్రహ్మపుత్ర బేసిన్లో జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా కోసం బృహత్ ప్రణాళిక’’ను విడుదల చేశారు. ఇది సుమారుగా 65 గిగావాట్ల జల విద్యుత్ను సరఫరాకు అవసరమైన దశల వారీ మౌలిక సదుపాయాలను రూపొందిస్తుంది. అలాగే ప్రాజెక్టుల రూపకల్పన, దశల వారీగా పనులు పూర్తి చేయడంలో జల్ విద్యుత్ ఉత్పత్తిదారులకు విలువైన మార్గదర్శిగా వ్యవహరిస్తుంది.
-
దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాలపై నివేదిక ఇవ్వడానికి, విశ్లేషించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి సీఈఏ రూపొందించిన కేంద్రీకృత పోర్టల్ ‘‘విద్యుత్ ప్రమాద సమాచార నిర్వహణ వ్యవస్థ (ఈఏడీఎంఎస్)’’ ను ప్రారంభించారు. తద్వారా భద్రతా పర్యవేక్షణ, విధానపరమైన చర్యలు బలోపేతం అవుతాయి.
విద్యుత్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఈఏ అధికారులకు శ్రీ పంకజ్ అగర్వాల్ పురస్కారాలను ప్రదానం చేశారు.
సాంకేతిక చర్చల్లో భాగంగా ‘‘సున్నా కర్బన ఉద్గారాల కోసం అణు విద్యుత్: అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలు’’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ప్రముఖ వక్తలు, ఈ రంగంలో నిపుణులు పాల్గొన్నారు.
‘‘అణు, పునరుత్పాదక, తదితరమైన వాటితో కూడిన ఏకీకృత విద్యుత్ వ్యవస్థ’’ అనే అంశంపై అటామిక్ ఎనర్జీ కమిషన్ సభ్యులు, హోమీ బాబా జాతీయ విద్యా సంస్థలో గౌరవ అధ్యాపకులైన డాక్టర్ ఆర్బీ గ్రోవర్ ప్రసంగించారు. డీకార్బనైజేషన్ను సాధించడంలో.. పునరుత్పాదక వనరులకు అణు విద్యుత్ అందించే సహకారాన్ని ఆయన వివరించారు.
‘‘అణు ఇంధన వ్యవస్థ సామర్థ్యం, రియాక్టర్ సాంకేతికతను అభివృద్ధి చేయడం’’ అనే అంశంపై అణు విద్యుత్ నియంత్రణ బోర్డు (ఏఈఆర్బీ) మాజీ ఛైర్మన్ శ్రీ ఎస్ఏ భరద్వాజ్ ప్రసంగించారు. అణు విద్యుత్ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, భద్రతాపరమైన పురోగతుల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీపీీసీ లిమిటెడ్, టాటా పవర్, అదానీ పవర్, ఎల్ అండ్ టీ, ఈడీఎఫ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పారిశ్రామిక సహకారం, సాంకేతిక స్వీకరణ, అణు రంగంలో భవిష్యత్ అవకాశాల గురించి తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. సందేహాల నివృత్తి, నిపుణులు తుది పలుకులతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఆవిష్కరణలు, స్థిరత్వం దిశగా భారత విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సీఈఏ ప్రదర్శిస్తున్న అంకితభావాన్ని ఈ వార్షికోత్సవం తెలియజేస్తోంది. సాంకేతిక, సహకారం, వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా దేశ విద్యుత్ రంగ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంలో సీఈఏ కొనసాగిస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ వేడుకలు ప్రదర్శించాయి.
***
(रिलीज़ आईडी: 2177966)
आगंतुक पटल : 34