రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ, భద్రత దేశం మొత్తానికి చెందిన సామూహిక బాధ్యత… రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఒక సంస్థ లేదా ప్రభుత్వ బాధ్యత కాదు… ఇది ప్రతి భారతీయుడి సంకల్పం: రక్షణశాఖ మంత్రి
రక్షణ రంగంలో స్వావలంబన.. కేవలం ఉత్పత్తి లేదా ఆర్థిక అంశం మాత్రమే కాదు
ఇది ప్రధానంగా మన వ్యూహాత్మక స్వాతంత్ర్యానికి సంబంధించింది…
నేరుగా మన సార్వభౌమత్వానికి ముడిపడి ఉంది…
ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన రక్షణ తయారీ వ్యవస్థ నిర్మాణంలో
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కీలక భాగస్వాములుగా మారాలని పిలుపు
పెట్టుబడులు, సాంకేతికత ఆమోదం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు డీఏపీ 2020, డీపీఎం 2025,
డిఫెన్స్ ఆఫ్సెట్స్ పాలసీ, డిఫెన్స్ ఇన్వెస్టర్ సెల్ వంటి విధానాలను నిరంతరం మెరుగుపరచడం...
ఐడెక్స్ కార్యక్రమం, రక్షణ కారిడార్ల ఏర్పాటు, రక్షణ తయారీలో ఎప్డీఐ ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా స్వదేశీకరణ దిశగా ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగులు: రక్షణ మంత్రి
2029 నాటికి రూ. 3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తి,
రూ. 50,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులు సాధించడమే లక్ష్యం: రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
07 OCT 2025 4:17PM by PIB Hyderabad
“రక్షణ, భద్రత... దేశం మొత్తానికి చెందిన సామూహిక బాధ్యత. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఒక సంస్థ లేదా ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది ప్రతి భారతీయుడి సంకల్పం” అని 2025 అక్టోబర్ 7న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. “దేశంలో రక్షణ తయారీ అవకాశాలు” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన రక్షణ తయారీ వ్యవస్థ నిర్మాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చురుకైన భాగస్వాములుగా మారాలని రక్షణమంత్రి పిలుపునిచ్చారు.
రక్షణ రంగంలో స్వావలంబన కేవలం ఉత్పత్తి లేదా ఆర్థిక అంశం మాత్రమే కాదనీ, ఇది ప్రధానంగా మన వ్యూహాత్మక స్వాతంత్ర్యానికి సంబంధించినదనీ, ఇది మన సార్వభౌమత్వానికి అనుసంధానమై ఉందని ఆయన స్పష్టం చేశారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో దేశానికి మాక్ డ్రిల్ అవసరమైనప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఉత్సాహంగా పాల్గొన్నాయని ఆయన గుర్తుచేశారు. “మనమంతా ఒకే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేస్తే ఏ సవాలైనా చిన్నదే అవుతుంది” అని అన్నారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న రక్షణ పరిశ్రమ
గత దశాబ్ద కాలంలో దేశ రక్షణ తయారీ రంగంలో నెలకొన్న గొప్ప వృద్ధిని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రస్తావించారు. 2014లో రూ. 46,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తి 2025 నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఇందులో రూ.33,000 కోట్ల విలువైన ఉత్పత్తి ప్రైవేట్ రంగం నుంచి వస్తుందని, ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో పరిశ్రమ భాగస్వామ్యం ఎంత ముఖ్యమో సూచిస్తుందని తెలిపారు.
దేశ రక్షణ ఎగుమతులు 2014లో రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉండగా..2025లో రూ.23,500 కోట్ల రికార్డు స్థాయి ఎగుమతులు పెరిగాయని కేంద్రమంత్రి తెలిపారు. “ప్రపంచంలో అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతిదారులలో ఒకటిగా ఉండటం నుంచి నమ్మదగిన ఎగుమతిదారుగా మారిన ఈ ప్రయాణం మన జాతీయ సంకల్పానికి నిదర్శనం” అని మంత్రి పేర్కొన్నారు.
2029 లక్ష్యాలు: అమలులోకి ఆత్మనిర్భర్ భారత్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను తెలియజేస్తూ.. 2029 నాటికి దేశంలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రక్షణ తయారీ, రూ. 50,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన కేవలం మేక్ ఇన్ ఇండియా లేదా ఎగుమతి గణాంకాల గురించి మాత్రమే కాదనీ, సంక్షోభ సమయాల్లో మనం ఇతరులపై ఆధారపడకుండా మన రక్షణను మనమే నిర్వహించడం ముఖ్యమన్నారు. ‘‘మన సాయుధ దళాలు ఉపయోగించే ఆయుధాలు మన సొంత నేలపై తయారవుతున్నాయి. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ప్రతిభతో రూపొందుతున్నాయి’’ అని అన్నారు.
రాష్ట్ర విధానాల సంకలన పత్రం విడుదల.
రక్షణ, అంతరిక్ష తయారీ రంగంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాలు, ఉత్తమ పద్ధతుల సంకలనంగా రూపొందించిన “రాష్ట్ర విధానాల సంకలనం’’ పత్రాన్ని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు .ఈ పత్రం కేంద్ర, రాష్ట్రాల మధ్య విధాన సమన్వయాన్ని మెరుగుపరచడంలో కీలక అడుగుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ సంకలనం పరిశ్రమలు, ఆవిష్కర్తలకు మార్గదర్శక పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దీన్ని అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పత్రం రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడంలో, రాష్ట్రాల మధ్య పోటీతో పాటు సహకారాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
తయారీ రంగ అభివృద్ధికి విధాన, మౌలిక సదుపాయాల సంస్కరణలు
రక్షణ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి చేపట్టిన విస్తృత సంస్కరణలను శ్రీ రాజ్నాథ్ సింగ్ వివరించారు. స్వీయ-ధ్రువీకరణ ద్వారా గడువులోగా ఉత్పత్తులను తయారు చేయడం, నిర్ధారణ పరీక్షలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తూ కేంద్రీకృతంగా పనిచేసే ఒక పోర్టల్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ సాయంతో రక్షణ శాఖ ఉత్పత్తులకు పరీక్షించేందుకు డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకాన్ని తెచ్చామనీ, దీని ద్వారా కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం సుసాధ్యం అవుతుందన్నారు.
పెట్టుబడులు, సాంకేతికతల ఆలంబన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రక్షణ వ్యయ విధానం 2020, రక్షణ సేకరణ మాన్యువల్ 2025, రక్షణ ఆఫ్సెట్ల విధానం, రక్షణ పెట్టుబడిదారుల సెల్ వంటి విధానాలను రక్షణ మంత్రిత్వ శాఖ నిరంతరం మెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ సంస్కరణలు కేవలం నియంత్రణ చర్యలు మాత్రమే కాదని, అవకాశాలను కల్పించే సాధనాలని అన్నారు.
సాంకేతికత, ఆవిష్కరణల శక్తి వినియోగం
"ఆధునిక యుద్ధం కేవలం ఆయుధాలపై మాత్రమే ఆధారపడి ఉండదు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. భౌతిక పెట్టుబడి కంటే ఆధునిక సాంకేతికతలో మనం మేధోపరమైన పెట్టుబడి పెట్టడం అవసరం’’ అని రక్షణ మంత్రి తెలిపారు. సాంప్రదాయ బలాన్ని ఆధునిక ఆవిష్కరణలతో కలిపి ప్రపంచ స్థాయి రక్షణ వ్యవస్థలను రూపొందించి, అభివృద్ధి, ఉత్పత్తి చేయగల నవ భారత్ను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.
డిజిటల్ మార్పులు, ఎంఎస్ఎంఈలకు మద్దతు
రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన డిజిటల్ చర్యలను రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ పరిశ్రమలు, వారి ఉత్పత్తుల నైపుణ్యాలను మ్యాప్ చేసే డిజిటల్ రిపోజిటరీగా శ్రీజన్ దీప్ (రక్షణ సంస్థలు, పారిశ్రామికవేత్తల వేదిక) అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రక్షణ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అనుమతులను సరళతరం చేసే సింగిల్-విండో వేదికలను, డిఫెన్స్ ఎగ్జిమ్ వేదికను కూడా ఆయన ప్రారంభించారు.
లిక్విడిటీ, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలను పరిష్కరించేందుకు, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆటోమేటెడ్ నగదు నిర్వహన సాధనాలను అభివృద్ధి చేస్తోంది. ఇది బిల్లుల ప్రాసెసింగ్, చెల్లింపు వ్యవస్థలను సరళతరం చేస్తోంది. ఈ చర్యలు ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, రక్షణ రంగ ఆవిష్కర్తలు సులభంగా, వేగంగా, పారదర్శకంగా వ్యవహరించేందుకు డిజిటల్ మార్గాన్ని అందిస్తున్నాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
సమగ్ర సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు
రక్షణ రంగంలో తయారీపరమైన అభివృద్ధికి మించి సామాజిక, మౌలిక సదుపాయాలు, విద్యా రంగాల్లో కూడా మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. సాయుధ దళాలలో మహిళల ప్రాతినిద్యం పెంచేందుకు నారీ శక్తి కార్యక్రమం, పరిశ్రమ, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, విద్యాసంస్థలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి బడ్జెట్లో 25 శాతం కేటాయించినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్ విస్తరణ గురించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 33 పాఠశాలలతో పాటు, భాగస్వామ్య నమూనాలో 100 కొత్త సైనిక పాఠశాలల ఆమోదం గురించి కూడా ప్రస్తావించారు. వీటిని ‘‘చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తిని పెంపొందించే’’ సంస్థలుగా అభివర్ణించారు.
గత 10-11 సంవత్సరాలుగా ప్రభుత్వం రక్షణ రంగంలో అనేక విధాన సంస్కరణలను చేపట్టిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ ఉత్పత్తిలో స్వదేశీ సమాచారాన్ని పెంచడం, రక్షణ పెట్టుబడులను వేగవంతం చేయడం ఈ ప్రయత్నాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. "ఐడెక్స్, రక్షణ కారిడార్లు, రక్షణ తయారీలో ఎఫ్డీఐని ప్రోత్సహించడం వంటి చర్యలన్నీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి.
రక్షణ భూమి నిర్వహణపై సమన్వయం
రక్షణ భూముల నిర్వహణ అంశంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని రక్షణమంత్రి పిలుపునిచ్చారు.రక్షణ భూమిపై ప్రజా వినియోగ ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల ప్రతిపాదనలను సులభతరం చేయడానికి ఒక ఆన్లైన్ వేదికను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించాలని, అవసరమైనచోట సమానమైన భూమిని అందించడాన్ని వేగవంతం చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల ఎకరాల రక్షణ భూమి ఉందని, స్థానిక వివాదాలను నివారించేందుకు, భద్రతను నిర్ధారించడానికి సమన్వయ నిర్వహణ అవసరమని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
జాతీయ సదస్సు 2025 గురించి..
అంతరిక్ష, రక్షణ రంగాలకు రాష్ట్రాల విధానాల సంకలన పత్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల భాగస్వామ్యంతో అంతరిక్ష, రక్షణ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, స్వావలంబన కేంద్రంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి మద్దతుగా రక్షణ ఉత్పత్తి శాఖ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల సంకలనాన్ని సిద్ధం చేసింది. ఇది ఏ అండ్ డీ, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, అంకుర సంస్థలు, ఆర్ అండ్ డీ, ఎగుమతులు, రవాణా విధానాలతో సహా రాష్ట్ర స్థాయి విధానాలను ఏకీకృతం చేస్తుంది. ఆర్థిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల మద్దతు, వ్యాపార సంస్కరణలను సులభతరం చేయడం, విధాన అమలుపై సమాచారాన్ని కూడా అందిస్తుంది. జాతీయ లక్ష్యాలు, రాష్ట్ర చర్యల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో మార్గదర్శక వనరుగా పనిచేస్తుంది. క్రాస్-లెర్నింగ్ను ప్రోత్సహిస్తుంది. సాంకేతిక స్వీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి. నైపుణ్యంలో చొరవలపై దృష్టి సారిస్తుంది. వికసిత్ భారత్-2047 దార్శనికతకు మద్దతు ఇస్తుంది.
ఐడెక్స్ కాఫీ టేబుల్ బుక్: షేర్డ్ హొరైజాన్స్ ఆఫ్ ఇన్నోవేషన్
ఈ పుస్తకం ఐడెక్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు జాతీయ రక్షణ, భద్రతా రంగాల్లో తీసుకువచ్చిన సృజనాత్మకత, సమస్య పరిష్కార స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.
ఏయిరో ఇండియా 2025 సందర్భంగా రక్షణ మంత్రి విడుదల చేసిన ఐడెక్స్ కాఫీ టేబుల్ బుక్ మునుపటి సంపుటిని విస్తరిస్తూ, ఈ పుసక్తం సాయుధ దళాల క్లిష్టమైన అవసరాలను తీర్చడమే కాకుండా, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనువైన సాంకేతికతను ప్రదర్శిస్తుంది.
పునర్నిర్మిత రక్షణ ఎగుమతి-దిగుమతుల వేదిక
ఈ నూతన వేదిక ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలో అప్లికేషన్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ కంపెనీ వెరిఫికేషన్, సరళమైన రిజిస్ట్రేషన్, ఓజీఈఎల్ ఫైలింగ్, రియల్ టైమ్ ట్రాకింగ్, సురక్షిత చెల్లింపు వ్యవస్థ సమీకరణను అనుమతిస్తుంది. లైసెన్స్ పొందిన డిఫెన్స్ ఇండస్ట్రీస్ కోసం భద్రతా మాన్యువల్ కింద నవీకరించిన ఎస్ఓపీలు,యు సమ్మతి లక్షణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ పోర్టల్.. పారదర్శకత, సామర్థ్యం, నియంత్రణ కట్టుబడిని పెంచుతుంది, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను బలోపేతం చేస్తుంది. దేశాన్ని రక్షణ తయారీ ఎగుమతులకు ప్రపంచస్థాయి కేంద్రంగా స్థాపించేందుకు దోహదపడుతుంది.
శ్రీజన్ డీప్: రక్షణ వ్యవస్థలు, పారిశ్రామికవేత్తల వేదిక
-
భారత రక్షణ పరిశ్రమల నైపుణ్యాలు, సామర్థ్యాలను డిజిటల్ రూపంలో సేకరించడం ప్రదర్శించడం దీని లక్ష్యం
-
పరిశ్రమ సంఘాలకు డిజిటల్ డైరెక్టరీగా పనిచేస్తుంది. తద్వారా వారు భాగస్వాములు, సహకారులను సులభంగా గుర్తించగలుగుతారు.
-
దేశీయ సామర్థ్యాలను సులభంగా గుర్తించడం, వేగంగా నిర్ణయం తీసుకోవడం, కాగితపు పనిని తగ్గిస్తుంది.
-
తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, సరఫరాదారుల సమగ్ర డేటాబేస్గా పనిచేస్తుంది.
-
అత్యవసర పరిస్థితుల్లో వనరుల సమీకరణ, డీపీఎస్యూ అవసరాలకు సామర్థ్యాల సరిపోలిక
-
ప్రదర్శనలో పాల్గొనడం, వ్యాపార అవకాశాలు పెరగడం, విధానాల ప్రచారం, సమాచారం పంపిణీకి అనుమతి
సరాఫరా వ్యవస్థల్లోని లోపాలను తగ్గించడం, వ్యూహాత్మక స్వాతంత్ర్యం, జాతీయ భద్రత బలోపేతం, ఆత్మనిర్భర్ భారత్ కు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యాలు. ప్రతి పరిశ్రమకు అప్డేట్స్, ట్రాకింగ్ కోసం ప్రత్యేక సూచన సంఖ్యను కేటాయించారు.
దేశంలో రక్షణ తయారీని పెంచడానికి రక్షణ ఉత్పత్తి శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవగాహన కల్పించడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని డీడీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, నావికదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఆర్మీ అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి మార్షల్ ఏపీ సింగ్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, కార్యదర్శి డీడీఆర్ అండ్ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్, రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2176532)
आगंतुक पटल : 28