జవాబుదారుతనంతో కూడిన పాలనకూ, సువ్యవస్థిత పాలన సంబంధిత కార్య ప్రణాళికకూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో భాగమైన యువజన వ్యవహారాల విభాగం మార్గదర్శకంగా నిలుస్తోంది. ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ (స్పెషల్ క్యాంపెయిన్ 4.0)లో సాధించిన విజయాల ఆధారంగా, ఈ విభాగం స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కోసం సన్నాహక చర్యలను మొదలుపెట్టింది. ఈ సారి స్వచ్ఛత, రికార్డుల నిర్వహణలతో పాటు ‘ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ - 2022’కు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యత తీసుకొని తొలగించడం సహా దీర్ఘకాల ప్రాతిపదికన అమలు చేసే పద్ధతులపైన దృష్టి సారిస్తోంది.
స్పెషల్ క్యాంపెయిన్ 4.0ను కిందటి ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 31 వరకు నిర్వహించారు. అప్పట్లో యువజన వ్యవహారాల విభాగంతో పాటు ఆ విభాగానికి చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, రాజీవ్ గాంధీ జాతీయ యువజన వికాస సంస్థ కలిసి దీనిలో పాల్గొన్నాయి. పార్లమెంటు సభ్యులు నివేదించిన అంశాలు, పార్లమెంటులో ఇచ్చిన హామీలు, పీజీ అప్పీళ్లలో అసంపూర్తిగా ఉండిపోయిన పనులను చాలా వరకు పూర్తి చేశారు. రికార్డులకు ఒక చక్కని పద్ధతిని పాటించడమే కాక, తుక్కును కూడా వదిలించుకున్నారు. స్వచ్ఛత పరిరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేశారు. దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 700 బీచులు, కోస్తా ప్రాంతాల్లో సీనియర్ అధికారులు, 6.22 లక్షల మంది
మై భారత్ స్వచ్ఛంద సేవకులు వివిధ పారిశుద్ధ్య పనుల్లో పాలుపంచుకున్నారు. ఇలాంటిదే ఒక కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నాయకత్వంలో గుజరాత్లోని పోర్బందర్ బీచ్లో నిర్వహించారు.
‘‘స్వచ్ఛతా హీ సేవా’’ ప్రచార ఉద్యమంలో భాగంగా, ఒక లక్షా ఇరవై తొమ్మిది వేల కన్నా ఎక్కువ కార్యకలాపాలను దేశమంతటా నిర్వహించి, 15.82 లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. పరిశుభ్రత విషయంలో మన నడవడికను మార్చుకోవాలని సూచించే కార్యకలాపాలతో పాటు, ‘మై భారత్’ పోర్టల్లో 15,400 కన్నా ఎక్కువ కార్యక్రమాలతో తోడ్పాటును అందించారు.
ఈ నెల 2 నుంచి ఈ నెలాఖరు వరకు అమలు చేసే ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’లో భాగంగా, ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంటు సభ్యులకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ సంబంధించి అపరిష్కృత వ్యవహారాలను పరిష్కరించడంపై యువజన వ్యవహారాల విభాగంతో పాటు ఆ విభాగానికి చెందిన సంస్థలు దృష్టి పెడతాయి. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ పనిని చేపడతారు. వ్యవస్థీకృత సమీక్ష, రికార్డుల నిర్వహణ, ప్రజా ఫిర్యాదులు, పార్లమెంటులో ఇచ్చిన హామీలు, తుక్కును అమ్మివేయడం, కార్యాలయాల్లోనూ, క్షేత్రీయ యూనిట్లలోనూ స్వచ్ఛత పరిరక్షణ కార్యకలాపాలపై మరింత శ్రద్ధ వహిస్తారు.
స్వచ్ఛ్ భారత్ ఉద్యమ స్ఫూర్తిని పటిష్ఠపరిచే ప్రచార ఉద్యమాలు, స్వచ్ఛతా పరిరక్షణ కార్యక్రమాల పట్ల చైతన్యాన్ని పెంచుతూ, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలు మూలలా ఎన్ఎస్ఎస్తో పాటు మై భారత్ సంస్థల యువ స్వచ్ఛంద సేవకులను సన్నద్ధం చేస్తారు.