యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారా అథ్లెట్లు అడ్డంకులను దాటుతూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు: డబ్ల్యూపీఏసీ-2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
డబ్ల్యూపీఏసీ ప్రారంభమైనట్లు ప్రకటించిన
కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశంలో జరగనున్న అతిపెద్ద పారా క్రీడల కార్యక్రమంలో
రికార్డు స్థాయిలో 74 క్రీడాకారులతో పాల్గొననున్న భారత్
ఖతార్, యూఏఈ, జపాన్ తర్వాత డబ్ల్యూపీఏసీకి ఆతిథ్యం ఇచ్చిన ఆసియా దేశంగా నిలవనున్న భారత్
అక్టోబర్ 5న ముగిసే డబ్ల్యూపీఏసీలో
104 దేశాల నుంచి పాల్గొననున్న 2200 మందికి పైగా క్రీడాకారులు
Posted On:
25 SEP 2025 10:13PM by PIB Hyderabad
భారతదేశంలో క్రీడల విషయంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే ఇండియన్ ఆయిల్ న్యూఢిల్లీ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను నిర్వహించడం వల్ల ప్రపంచానికి ‘క్రీడా సమ్మిళిత’ దేశంగా భారత్ స్థానం బలపడుతుందని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. డబ్ల్యూపీఏసీ 2025 ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది.
ఈ క్రీడల్లో 100 దేశాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన 2,200 మంది క్రీడాకారులను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ప్రధానమంత్రి.. ఒక ప్రత్యేక సందేశాన్ని పంపించారు. “అడ్డంకులను అధిగమించి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న పారా అథ్లెట్లు.. అభివృద్ధి చెందుతున్న క్రీడా కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. క్రీడలను జీవన విధానంగా స్వీకరించేందుకు వీళ్లు ప్రేరణిస్తున్నారు” అని ఆయన వాఖ్యానించారు.
ఖతార్ (2015), యూఏఈ (2019), జపాన్ (2024) తర్వాత ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తోన్న నాలుగో ఆసియా దేశంగా భారత్ ఉంది. దీనిని భారత పారాలింపిక్స్ కమిటీ నిర్వహిస్తోంది.
డబ్ల్యూపీఏసీ-2025కి ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. "మతం, ప్రాంతం, జాతీయత విషయంలో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలను అనుసంధానించే గొప్ప మార్గం క్రీడలు. నేటి ప్రపంచంలో క్రీడలకు ఉన్న ఈ సమగ్ర స్ఫూర్తిని విస్తృతం చేయటం చాలా ముఖ్యం. డబ్ల్యూపీఏసీలో పాల్గొనే వాళ్లు, ప్రేక్షకులపై ఇలాంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను." అని వ్యాఖ్యానించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కంగనా రనౌత్, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి శ్రీ ఆశిష్ సూద్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ అధినేత శ్రీ పాల్ ఫిట్జ్గెరాల్డ్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన మోండో ట్రాక్పై డబ్ల్యూపీఏసీ మొదటి క్రీడను నిర్వహించనున్నారు. పారిస్ పారాలింపిక్స్-2024లో ఉపయోగించిన నీలిరంగులో ఉన్న ఈ ట్రాక్ను జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. గురువారం నాడు స్టేడియంలోని భవన సముదాయంలో వార్మప్ ట్రాక్, 200 మందికి పైగా అథ్లెట్లు ఒకేసారి శిక్షణ పొందేందుకు వీలున్న మల్టీ-స్పెషాలిటీ జిమ్ను కూడా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు.
"ఈ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు భారతదేశం విషయంలో గౌరవం, పురోగతి, ఉద్దేశ్యానికి సంబంధించినవి. 74 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద పారా బృందాన్ని మేం తయారుచేశాం. దేశంలో ఉన్న ధృడమైన పారా-క్రీడా సంస్కృతికి ఇది నిదర్శనం. సుమిత్ అంటిల్, ప్రీతి పాల్, దీప్తి జీవంజీ, ధరంబీర్ నైన్, ప్రవీణ్ కుమార్ వంటి ఛాంపియన్లు స్వదేశంలోనే పోటీ పడతారు” అని డాక్టర్ మాండవీయ వ్యాఖ్యానించారు.
డబ్ల్యూపీఏసీ క్రీడలు సెప్టెంబర్ 27న ప్రారంభమవుతాయి. 108 బంగారు పతకాలు ఇందులో ఉన్నాయి. “నైపుణ్యం, వేగం, బలంతో పునురద్ధరించిన సదుపాయాలలో పోటీపడుతున్న క్రీడాకారులను స్టేడియంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారు. ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి. ప్రపంచ ఛాంపియన్లు పతకాలు అందుకుంటారు. సొంత జాతీయ గీతంతో పోడియంపై ఉండాలనే కలను ప్రతి అథ్లెట్ సాధించలేరు. అనేక విజయాలు ఉంటాయి.. అదే విధంగా అనేక నిరాశలు కూడా ఉంటాయి. అథ్లెట్లకు సంబంధించిన అన్ని రకాల భావోద్వేగాలను అనుభూతి చెందాలని నేను ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను” అని ఫిట్జ్గెరాల్డ్ అన్నారు.
ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు భారీ బహుళ-క్రీడా ఛాంపియన్షిప్లను నిర్వహించే సామర్థ్యాలను పరీక్షించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా డబ్ల్యూపీఏసీని నిర్వహిస్తున్నారు. “మేం 2030 కామన్వెల్త్ క్రీడల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, అవకాశాలను పెంపొందించటంతో పాటు క్రీడల విషయంలో అసంఖ్యాకమైన యువత కలలను సాకారం చేసే ఆశయాలతో 2036లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలని చూస్తున్నాం. ప్రధానమంత్రి చెప్పినట్లుగా ‘క్రీడలు ఛాంపియన్లను మాత్రమే తయారుచేయవు.. ఇది శాంతి, పురోగతి, శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తాయి. ఇదే మా క్రీడా ప్రయాణానికి వెలుగు రేఖ” అని మన్సుఖ్ మాండవీయ అన్నారు.
సామర్థ్య నిర్మాణాన్ని డబ్ల్యూపీఏసీ పెంచే తీరును కూడా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వివరించారు. “మౌలిక సదుపాయాలు, లక్ష్యాలకు అతీతంగా మనస్తత్వంలో మార్పు తీసుకురావటం అనే లోతైన భావన ఉంది. అందుబాటులో ఉన్న వేదికలు, పారా-అథ్లెట్లకు బలమైన మద్దతు వ్యవస్థలతో పాటు క్రీడల్లో సమాన అవకాశాల గురించి మెరుగైన జాతీయ భావనను మేం ఇవ్వనున్నాం. పతకాలు ప్రదానం చేసిన తర్వాత చాలా కాలం పాటు ఉండే వాస్తవ ఫలితాలు ఇవే” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశంలోని అగ్రశ్రేణి అథ్లెట్లలో చాలా మంది పారాలింపిక్ పతక విజేతలుగా, ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. వీళ్లు నెహ్రూ స్టేడియంలో స్వదేశీ పరిస్థితుల్లో క్రీడల్లో పాల్గొంటారు. ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఆరు కాంస్యాలు.. ఇలా మొత్తం 17 పతకాలతో జపాన్లోని కోబ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఆరో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. భవిష్యత్ క్రీడలకు పునాది వేసేలా.. భారతదేశం 2023లో పారిస్లో జరిగిన ఈ క్రీడల్లో దేశానికి ఉన్న మునుపటి రికార్డులను బద్ధలు కొట్టింది. ఇందులో 10 పతకాలు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) గెలుచుకుంది.
పారా క్రీడల్లో పెరుగుతోన్న భారతదేశ ప్రతిష్ఠను ప్రధాని మోదీ ప్రశంసించారు. " ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులతో పాటు ప్రజలకు ప్రేరణనిచ్చేలా ధృడత్వం, సంకల్పం అనే భావనలకు ఉన్న అర్థాన్ని పారా అథ్లెట్ల ప్రదర్శనలు మార్చేశాయి. ఏ సవాలు కూడా అధిగమించలేనిది కాదనే సమష్టి నమ్మకాన్ని వారి విజయాలు చెబుతున్నాయి" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
(Release ID: 2172264)
Visitor Counter : 5