బొగ్గు మంత్రిత్వ శాఖ
జీఎస్టీ సంస్కరణలు...ఆత్మనిర్భరత దిశగా బొగ్గురంగంలో మార్పులు
Posted On:
22 SEP 2025 11:45AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బొగ్గు మంత్రిత్వ శాఖ స్వాగతించింది. ఈ నిర్ణయాలు బొగ్గు రంగానికి సంబంధించిన పన్ను స్వరూపంలో ముఖ్య మార్పులను తీసుకువచ్చాయి. ఈ సంస్కరణలు బొగ్గు రంగం ఆత్మనిర్భరతను సాధించే దిశగా ఒక పరివర్తనాత్మక ముందడుగును సూచించడంతో పాటు, బొగ్గు ఉత్పత్తిదారు సంస్థలకూ, బొగ్గు వినియోగదారు సంస్థలకూ లాభసాటిగా ఉండే ఒక సంతులిత వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
• జీఎస్టీ పరిహార సెస్సు తొలగింపు: బొగ్గుపై ఇంతకు ముందున్న టన్నుకు రూ.400 చొప్పున ఉన్న పరిహార సెస్సును కౌన్సిల్ తీసేసింది.
• బొగ్గుపై జీఎస్టీ రేటు పెంపు: బొగ్గుపై జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.
బొగ్గు ధరల విధానంపైనా, విద్యుత్తు రంగంపైనా కొత్త సంస్కరణలు ప్రసరించే ప్రభావం మొత్తంమీద పన్ను భారాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిస్తోంది. జీ6 మొదలు జీ17 గ్రేడుల బొగ్గుకు ఈ తగ్గింపు ఒక్కో టన్నుకు రూ.13.40 నుంచి రూ.329.61 దాకా ఉంటుంది. విద్యుత్తు రంగానికి వస్తే, సగటు తగ్గింపు ప్రతి టన్నుకు రూ.260 వరకు ఉంటుంది. ఇది విద్యుత్తు ఉత్పాదనకు అయ్యే ఖర్చులో ఒక్కో కేడబ్ల్యూహెచ్కు 17 నుంచి 18 పైసల మేర తగ్గింపునకు సమానంగా లెక్కకు వస్తుంది.
బొగ్గులో అన్ని గ్రేడులకూ పన్ను భారాన్ని క్రమబద్ధీకరించడంతో సమానత్వానికి పెద్దపీటను వేసినట్లయింది. ఇది ఇంతకు ముందు ఒక్కొక్క టన్నుకు రూ.400 ఏకధర (ఫ్లాట్ రేట్) పరిహార సెస్సుకు స్వస్తి పలుకుతుంది. పాత పరిహార సెస్సు తక్కువ నాణ్యత కలిగిన బొగ్గుకూ, తక్కువ ధర కలిగిన బొగ్గుకూ అమలవుతూ, వ్యత్యాస ప్రభావాన్ని ఏర్పరిచింది. ఉదాహరణకు, జీ11 నాన్ కోకింగ్ బొగ్గును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే కోల్ ఇండియా లిమిటెడ్కు 65.85 శాతం పన్ను భారం ఉంటే, జీ2 బొగ్గుకు 35.64 శాతం పన్ను ఉండింది. ఈ సెస్సు ను తొలగించడంతో అన్ని కేటగిరీలకూ ఇక ఏకరీతిన 39.81 శాతం పన్ను అమలవుతుంది.
సెస్సును ఉపసంహరించిన నిర్ణయం, పోటీ పడే స్థాయిని సమానమైందిగా మార్చడమే కాకుండా జీఎస్టీ పరిహార సెస్సును ఒక్కో టన్నుకు రూ.400 చొప్పున ఏక ధర (ఫ్లాట్ రేటు)ను అమలుచేయడమనేది తక్కువ గ్రేడు కలిగిన భారతీయ బొగ్గుతో పోలిస్తే ఉన్నత స్థూల కెలోరిఫిక్ వేల్యూను కలిగి ఉండే దిగుమతి బొగ్గుకు అయ్యే ఖర్చే తక్కువగా ఉన్న ఇదివరకటి స్థితిని కూడా నివారిస్తోంది. దీంతో ఈ నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్కు ఊతాన్నిచ్చి, దిగుమతిని అడ్డుకోగలదని స్పష్టమవుతోంది. ఈ సంస్కరణ భారత స్వయంసమృద్ధిని బలపరుస్తూ, అనవసర బొగ్గు దిగుమతులను అరికట్టగలుగుతుంది.
బొగ్గుపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచి, విలోమ సుంకం తాలూకు వ్యత్యాసాన్ని ఈ సంస్కరణలు దూరం చేశాయి. ఇదివరకు, బొగ్గుపై 5 శాతం జీఎస్టీ ఉండింది. బొగ్గు వాణిజ్య సంస్థలు ఉపయోగించుకొనే ఇన్పుట్ సర్వీసులపై అధిక జీఎస్టీ రేట్లు వర్తించేవి. ఇవి సాధారణంగా 18 శాతంగా ఉండేవి. ఈ అసమానత్వం కారణంగా, బొగ్గు వాణిజ్య సంస్థలు తక్కువ ఉత్పాదనపై జీఎస్టీ చెల్లింపులను జరపవలసి వచ్చినందువల్ల, ఉపయోగించని ట్యాక్స్ క్రెడిట్ రూపంలో పెద్ద మొత్తం ఖాతాల్లో పోగయింది.
రిఫండుకు ఏర్పాటు లేకపోవడంతో ఈ మొత్తం పెరుగుతూ పోయి, విలువైన ధనరాశి వినియోగానికి ఆటంకాన్ని కలిగిస్తూ వచ్చింది. ఇకపై ఉపయోగించుకోని సొమ్మును రాబోయే కాలంలో జీఎస్టీ పన్ను బాధ్యతను తీర్చడానికి ఖర్చు పెట్టొచ్చు. తత్ఫలితంగా నగదు లభ్యతకు పడిన ముడి విడిపోతుంది. బొగ్గు వాణిజ్య సంస్థలకు ఉపయోగించని జీఎస్టీ క్రెడిట్ పెద్ద మొత్తంలో పోగుపడిన కారణంగా వాటిల్లుతున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఇది తోడ్పడి, ఆర్థిక స్థిరత్వం మెరుగవుతుంది.
జీఎస్టీ రేట్లలో 5 శాతం నుంచి 18 శాతం పెంపు చోటుచేసుకున్నప్పటికీ, సంస్కరణల సమగ్ర ప్రభావాన్ని చూస్తే మాత్రం అంతిమ వినియోగదారులకు పన్ను భారం తక్కువగానే ఉంటుంది. దీంతో పాటు, విలోమ పన్ను స్వరూపంలో దిద్దుబాటూ వీలవుతుంది. ఇది నగదు లభ్యతను పెంచి, వక్రతలను దూరం చేయడంతో పాటు బొగ్గు ఉత్పత్తిదారు సంస్థలకు నష్టాలు పెద్ద మొత్తంలో వాటిల్లడాన్ని అడ్డుకొంటుంది కూడా.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు భారతదేశ స్వయంసమృద్ధిని పటిష్ఠపరుస్తూ బొగ్గు రంగంపై సానుకూల ప్రభావాన్ని ప్రసరిస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు బొగ్గు ఉత్పత్తిదారు సంస్థలకు మద్దతిస్తూ, వినియోగదారులకు లాభసాటిగా ఉంటూ, ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణానికి అనుగుణంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో ఈ నిర్ణయాలు సమతౌల్య సంస్కరణలుగా నిలవడం ఖాయం.
***
(Release ID: 2169685)