మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రపంచస్థాయి బ్లూ పోర్టుల నిర్మాణానికి భారత్ అండ్ ఎఫ్ఏఓ ఒప్పందం; సామర్థ్యం పెంపుదలపై మొదటి వెబినార్
"ఏఐ, 5జీ వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఫిషింగ్ పోర్టులను మారుస్తాయి": డాక్టర్ అభిలక్ష్ లిఖి
గుజరాత్, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరిల్లో
రూ.369కి పైగా కోట్లతో స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి
Posted On:
18 SEP 2025 3:18PM by PIB Hyderabad
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎఫ్ఏహెచ్ డీ) పరిధిలోని మత్స్య శాఖ(డీఓఎఫ్) భారత్ లో బ్లూ పోర్ట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ)తో సాంకేతిక సహకార కార్యక్రమం (టీసీపీ) ఒప్పందంపై సంతకం చేసింది. సామర్థాన్ని పెంపొందించుకోవటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పంచుకోవటానికి మూడు వెబినార్లు, వర్క్ షాపుల నిర్వహణలో భాగంగా, ఎఫ్ఏఓ కింద టీసీపీ కార్యక్రమం మొదటి వెబినార్ ఇవాళ నిర్వహించారు. వెబినార్ సందర్భంగా “బ్లూ పోర్టులకు పునాదులు: మత్స్యకార పోర్టుల్లో ఆర్థిక విలువ పెంపు" అనే అంశంపై మత్స్యకార కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారత ఎఫ్ఏఓ ప్రతినిధి శ్రీ తకయుకి హగివారా కూడా పాల్గొన్నారు.

ఫిషింగ్ పోర్టులు కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, ఆర్థిక శ్రేయస్సుకు, పర్యావరణ సుస్థిరతకు, సామాజిక సమైక్యతకు వ్యూహాత్మక పరిష్కారాలని డాక్టర్ అభిలక్ష్ లిఖి స్పష్టం చేశారు. జాతీయ, ఆహార పోషకాహార భద్రతను బలోపేతం చేయటానికి పర్యావరణహితమైన, లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఫిషింగ్ పోర్టుల సామర్థ్యం, సేవల నాణ్యత మెరుగుదలకు ఆధునిక సాంకేతికతలు 5జీ, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డిజిటల్ వేదికలు ఉపయోగపడతాయన్నారు. పోర్టు కార్యకలాపాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, అన్వేషణ, శక్తి పరివర్తన వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చిన ఆయన.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై), మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్) వంటి పథకాలు ఆధునీకరణ, వాటాదారుల సాధికారతకు దోహదపడుతున్నాయని స్పష్టం చేశారు. పీఎంఎంఎస్ వై కింద గుజరాత్, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరిల్లో మొత్తం రూ.369.80 కోట్లతో మూడు స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వనక్ బరా (డయ్యూ), జఖౌ (గుజరాత్) పోర్టుల్లో వ్యూహాత్మక ఆధునీకరణకు మద్దతిస్తున్న ఎఫ్ఏఓ సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు డాక్టర్ అభిలక్ష్ లిఖి తెలిపారు.
బ్లూ పోర్ట్ సిద్ధాంతం, సామర్థ్యం పెంపుదలకు, పర్యావరణ ప్రభావం తగ్గించేందుకు, సామాజిక ఆర్థిక ప్రయోజనాలను సృష్టించటానికి సుస్థిరమైన, సమ్మిళితమైన, వినూత్న పద్ధతులను ప్రోత్సహించటంలో బ్లూ పోర్టుల పాత్ర గురించి ఎఫ్ఏఓ అధికారులు మిస్టర్ జోస్ ఎస్టోర్స్, మిస్ యోలండా మొలారెస్, మిస్ లూసియా లోపెజ్ డి అరగాన్ వెబినార్ లో వివరించారు. పోర్టులను సుస్థిరత వైపు మళ్లించటానికి రోడ్ మ్యాప్, వాటాదారుల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించటం, విజయవంతంగా అమలైన విగో పోర్ట్ (స్పెయిన్) పై కేస్ స్టడీ, భారత్ లో బ్లూ పోర్ట్స్ విధానాన్ని అనుసరించేందుకు ఎదురయ్యే ప్రధాన సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సెషన్ లో చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పంచుకోవటానికి, వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించటానికి ముఖ్యమైన వేదికగా ఈ వెబినార్ ఉపయోగపడింది. ఈ కార్యక్రమంలో జరిగిన చర్చలు భారత్ లో బ్లూపోర్ట్స్ అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తాయని, దీని ద్వారా జీవనోపాధిని బలోపేతం చేయటం, ఎగుమతులను ప్రోత్సహించటం, మత్స్యరంగం పోటీతత్వాన్ని పెంచటం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయ సీనియర్ అధికారులు, విగో పోర్ట్ (స్పెయిన్) ప్రతినిధులు, తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సీనియర్ అధికారులు, మారిటైమ్ బోర్డులు, ప్రధాన పోర్టుల అధికారులు, మత్స్య సహకార సంఘాలు, ఇతర కీలక వాటాదారులు పాల్గొన్నారు.
ఎఫ్ఏఓ సాంకేతిక సహకార కార్యక్రమం (టీసీపీ) గురించి:
మత్స్యశాఖ ఉత్పత్తుల సరఫరా శ్రేణిని ప్రభావితం చేసే పర్యావరణ, సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించటానికి, మత్స్యకార పోర్టుల సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటంలో భారత ప్రభుత్వానికి సహకరించేందుకు, బ్లూ పోర్టులపై దృష్టి సారించటం ఎఫ్ఏఓ సాంకేతిక సహకార కార్యక్రమం(టీపీసీ) ఉద్దేశం. టీపీసీ కింద రెండు పైలట్ ఫిషింగ్ పోర్టులు వనక్ బరా (డయ్యూ), గుజరాత్ లోని జఖౌకు అవసరమైన వ్యూహాత్మక, కార్యకలాపాల సాధనాలను అందించి, పెట్టుబడి ప్రాజెక్టులను గుర్తించి రూపకల్పన చేసుకునే అవకాశం కల్పించటం ద్వారా ప్రధాన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అంతేకాక, మత్స్యకార పోర్టుల సుస్థిరతకు సంబంధించిన సవాళ్లను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకోవటానికి ప్రభుత్వ, ప్రైవేటు వాటాదారులకు అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్లూ పోర్ట్స్ ఫ్రేమ్ వర్క్:
బ్లూ పోర్ట్స్ విధానం కింద సాంకేతిక ఆవిష్కరణలను పర్యావరణ పరిరక్షణతో కలిపి స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిని డీఓఎఫ్ నడిపిస్తుంది. మూడు పైలట్ హార్బర్లు వనక్ బరా (డయ్యూ), కారైకల్ (పుదుచ్చేరి), జఖౌ (గుజరాత్)కు రూ.369.8 కోట్ల పెట్టుబడితో ఆమోదం లభించింది. భారత మత్స్యకారులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సమర్థవంతమైన కార్యకలాపాల కోసం మత్స్యకార పరిశ్రమల మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటమే ఈ ఆధునిక హార్బర్ల లక్ష్యం. పీఎంఎంఎస్ వై మద్దతుతో, ఐఓటీ పరికరాలు, సెన్సార్ వ్యవస్థ, శాటిలైట్ కమ్యూనికేషన్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అనుసంధానించటం ద్వారా హార్బర్ కార్యకలాపాలను సులభతరం చేయటంతో పాటు, తక్షణ నిర్ణయాలు తీసుకోవటానికి ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. వర్షపు నీటిని సేకరించటం, తక్కువ విద్యుత్ వినియోగ లైటింగ్, విద్యుత్ ఆధారిత యంత్రాలు, వ్యర్థాల నిర్వహణ- మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, సముద్ర వ్యర్థాల తొలగింపు వంటివి సుస్థిరత పట్ల నిబద్ధతను తెలియజేసే పర్యావరణహిత చర్యలు ఆర్థిక పనితీరును, సామాజిక సమ్మిళితత్వాన్ని, పర్యావరణ వ్యవస్థల రక్షణను మెరుగుపరుస్తాయి.
***
(Release ID: 2168781)
Visitor Counter : 10