సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి మెమెంటోల ఇ-వేలం 7వ ఎడిషన్ ను ప్రకటించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఇంటర్నెట్ వేదికగా సెప్టెంబర్ 17 – అక్టోబర్ 2, 2025 వరకు
ప్రధానమంత్రికి వచ్చిన సుమారు 1300 బహుమతుల వేలం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
16 SEP 2025 5:37PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాల (ఎన్ జీఎంఏ) నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మెమెంటోల ఇ-వేలం 7వ ఎడిషన్ ప్రారంభాన్ని భారత ప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ ఎన్ జీఎంఏలో ఈ విషయాన్ని వెల్లడించారు.
పలు సందర్భాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్న 1300కు పైగా బహుమతులను 17 సెప్టెంబర్ 2025 నుంచి ఆన్ లైన్ లో వేలానికి ఉంచుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ తెలిపారు. ఇవాళ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మెమెంటోల ఇ-వేలం 7వ ఎడిషన్ సందర్భంగా శ్రీ షెకావత్ మాట్లాడుతూ.. వేలానికి ఉంచుతున్న వస్తువుల్లో పెయింటింగ్స్, కళాఖండాలు, శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, కొన్ని క్రీడా వస్తువులున్నట్లు చెప్పారు.
మొదటిసారిగా 2019లో వేలం నిర్వహించారు. అప్పటినుంచి, ప్రధానమంత్రికి బహుకరించిన వేలాది వస్తువులను వేలం వేయడం ద్వారా సుమారు రూ.50 కోట్లకు నిధులను సేకరించి, వాటిని నమామి గంగే ప్రాజెక్టుకు వినియోగించారు. ఒక గొప్ప లక్ష్యం కోసం తన మెమెంటోలను వినియోగిస్తున్న మొదటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు అధికారిక వెబ్ సైట్ www.pmmementos.gov.in లో ఈ ఏడాదికి సంబంధించిన 1,300కు పైగా వస్తువులు వేలానికి అందుబాటులో ఉంటాయి.
ఈ బహుమతుల సేకరణ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో సాంప్రదాయ కళలు, పెయింటింగ్స్, శిల్పాలు, హస్తకళలు, గిరిజన కళాఖండాలు, గౌరవ మర్యాదలకు సూచికగా సమర్పించిన బహుమతులున్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి:
-
అద్భుతమైన ఎంబ్రాయిడరీ ఉన్న జమ్మూకాశ్మీర్ షష్మినా శాలువా.
-
రామ్ దర్బార్ తంజావూరు పెయింటింగ్.
-
నటరాజ లోహ విగ్రహం.
-
గుజరాత్ రోగన్ కళకు చెందిన ట్రీ పెయింటింగ్.
-
చేనేత నాగ శాలువా.
పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత పారా-అథ్లెట్లు బహుకరించిన క్రీడా జ్ఞాపికలు ఈ ఎడిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి భారత క్రీడల్లోని స్థిరత్వం, నైపుణ్యం, ఓటమినెరుగని స్ఫూర్తినీ సూచిస్తాయి.
ప్రస్తుతం వస్తువులను జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాల (ఎన్ జీఎంఏ)లో ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు వాటిని చూసి, ఆన్ లైన్ వేలంలో పాల్గొనవచ్చు.
గతంలోలాగే ఈ-వేలం ద్వారా వచ్చే ఆదాయం నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. గంగానది వ్యవస్థను పునరుద్ధరించటం, పరిరక్షించటం, కాపాడటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఈ-వేలం పౌరులకు చారిత్రక వస్తువులను సొంతం చేసుకునే అవకాశమివ్వటమే కాక పవిత్ర గంగా నదిని సంరక్షించే గొప్ప కార్యక్రమంలో భాగమయ్యే అదృష్టాన్ని కల్పిస్తుంది. వేలానికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి: www.pmmementos.gov.in
***
(Release ID: 2167769)
Visitor Counter : 2