జల శక్తి మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే స్వచ్ఛతా హి సేవ-2025కి సిద్ధమవుతున్న భారత్
ఒక రోజు, ఒక గంట, ఒకేసారి: 2025 సెప్టెంబర్ 25న జాతీయ స్వచ్ఛంద శ్రమదానం
Posted On:
15 SEP 2025 8:28PM by PIB Hyderabad
"పండగలూ సంతోషాల మధ్య అందరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో, అక్కడ పండగ ఆనందం రెట్టింపవుతుంది!"- గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ - 125వ మన్ కీ బాత్ ఎపిసోడ్, 31 ఆగస్ట్ 2025.
స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ (ఎస్ హెచ్ఎస్) 2025 తొమ్మిదో ఎడిషన్ కు వేదిక సిద్ధమైంది. సెప్టెంబర్ 17న ప్రారంభమై అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ముగిసేలా 15 రోజుల పాటు నిర్వహించబోయే స్వచ్ఛతా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి. తాగునీటి, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్), జలశక్తి మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యూఏ) సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం పౌరులు, సంఘాలు, సంస్థలు కలిసి స్వచ్ఛతను సాధించటానికి స్ఫూర్తిని అందిస్తుంది. చీకటి, మురికిగా ఉన్న, నిర్లక్ష్యానికి గురైన ప్రదేశాలపై దృష్టి సారిస్తుంది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ మాట్లాడుతూ... ఈ స్వచ్ఛతా కార్యక్రమం ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు ఇది నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మల విసర్జన తగ్గిపోయి, మహిళల గౌరవం, భద్రత మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం, బహిరంగ మల విసర్జన కారణంగా వచ్చే వ్యాధుల బారి నుంచి అయిదేళ్ల లోపు చిన్నారులను దాదాపు మూడు లక్షల మందిని కాపాడగలిగినట్లు వెల్లడించారు.
స్వచ్ఛత మిషన్ ప్రారంభమైనప్పుడు కేవలం 37% కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్లను ఉపయోగించేవని, ఇప్పుడు 12 కోట్లకు పైగా కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని శ్రీ పాటిల్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి పుట్టినరోజు సెప్టెంబర్ 17, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సెప్టెంబర్ 25, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి అక్టోబర్ 2 వంటి ముఖ్యమైన రోజుల మధ్య స్వచ్ఛతా హి సేవ 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంత్రి అన్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛతా ఉత్సవ్ కార్యక్రమం దీపావళి వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
సఫాయి కార్మికుల కుటుంబాలకు విద్య, వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం సూరత్, నవ్ సారి నగరాలకు కలిపి సఫాయ్ మిత్ర సురక్షా ఫండ్ కింద రూ.8-10 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషి గురించి శ్రీ పాటిల్ వివరించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ఒక గంటపాటు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
గతేడాదిలాగే ఎస్ హెచ్ఎస్-2025 కింద క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (సీటీయూలు)పై దృష్టి సారించటం గురించి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ వివరించారు. 2024లో 8 లక్షలకు పైగా సీటీయూలను శుభ్రం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సీటీయూలను గుర్తించటం, పరిశుభ్రంగా మార్చటం, సుందరీకరించటం వేగంగా జరుగుతుందని, ఈ కార్యక్రమం కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో శుభ్రతపై దృష్టి సారిస్తుందన్నారు. నగరాలు సీటీయూలను గుర్తిస్తున్నాయని.. మురికి ప్రదేశాలు, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు, చెత్తా చెదారంతో నిండిన ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, నదులు, నిస్సారమైన భూములు, అధిక చెత్తతో నిండిపోయిన ప్రదేశాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాలు నేరుగా కనిపించే పరిశుభ్రతపై ప్రభావం చూపుతాయన్నారు.
ఎస్ హెచ్ఎస్-2025 కార్యక్రమం గురించి తాగునీటి, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ కెకె మీనా వివరించారు. దేశవ్యాప్తంగా జరిగే పండగలతో పాటు పరిశుభ్రత స్ఫూర్తిని పెంపొందించే విధంగా 'స్వచ్ఛోత్సవ్' అనే ఇతివృత్తంతో ముందుకు సాగుతుందన్నారు. పండగల సమయంలో ఉండే శక్తిని వినియోగించి సంస్కృతి, ప్రజల భాగస్వామ్యం, పండగ ఉత్సాహంతో పర్యావరణహిత, వ్యర్థాలు లేని వేడుకలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమం కోసం సన్నాహక సమావేశాల్లో భాగంగా ఎస్ హెచ్ఎస్ పై చర్చించటానికి గౌరవ మంత్రులు, ఎంఓహెచ్ యూఏ, డీడీడబ్ల్యూఎస్ మధ్య సెప్టెంబర్ 3, 2025న సమావేశం జరిగింది. అనంతరం సెప్టెంబర్ 9, 2025న అన్ని రాష్ట్రాలు, యూటీలతో డీడీడబ్ల్యూఎస్, ఎంఓహెచ్ యూఏ కేంద్రమంత్రుల అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 10న కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల కమిటీ సమావేశం జరిగింది. అన్ని స్థాయుల (రాష్ట్రం, జిల్లా, స్థానిక సంస్థలు, మంత్రిత్వ శాఖలు) సమన్వయ కమిటీల తొలి భేటీ సెప్టెంబర్ 12న నిర్వహించారు. డీడీడబ్ల్యూఎస్ కార్యదర్శి అధ్యక్షతన అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల నోడల్ అధికారులు, ఫీల్డ్ యూనిట్లతో మీటింగ్ జరిగింది.
***
(Release ID: 2167395)
Visitor Counter : 9