గనుల మంత్రిత్వ శాఖ
కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఆరో విడత వేలాన్ని ప్రారంభించబోతున్న గనుల మంత్రిత్వ శాఖ ట్రాంచ్–I లో ఏడు అన్వేషణ లైసెన్స్ బ్లాకుల ప్రాధాన్య బిడ్డర్లను కూడా ప్రకటించనున్న ఖనిజ మంత్రిత్వశాఖ
Posted On:
15 SEP 2025 4:44PM by PIB Hyderabad
కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల ఆరో విడత వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మంగళవారం (16 సెప్టెంబర్ 2025) హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభిస్తారు. అన్వేషణకు సంబంధించిన లైసెన్సుల మొదటి విడత వేలం కింద ఏడు లోతైన, క్లిష్టమైన ఖనిజ బ్లాక్లకు సంబంధించి ప్రాధాన్య వేలంపాటదారులను కూడా ఆయన ప్రకటిస్తారు.
గనులు, ఖనిజాల (అభివృద్ధి - నియంత్రణ) చట్టం, 1957 ను సవరించడం ద్వారా ఏడో షెడ్యూల్లో పేర్కొన్న 29 క్లిష్టమైన, లోతైన ఖనిజాల కోసం ప్రభుత్వం వేలం ఆధారిత అన్వేషణ లైసెన్సులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అన్వేషణ లైసెన్స్ (ఈఎల్) విధానం ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా లిథియం, రాగి, వెండి, వజ్రం, బంగారం వంటి ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. లైసెన్సులు పొందినవారు మైనింగ్ అవకాశాలను గుర్తించడానికి పర్యవేక్షణ, సాధ్యాసాధ్యాల పరిశీలన కార్యకలాపాలు నిర్వహించగలరు. 50 సంవత్సరాల పాటు వేలం ప్రీమియం నుంచి ఆదాయంలో వాటాను పొందుతారు. తదుపరి మైనింగ్ లీజు వేలానికి అనువైన బ్లాక్ లను వివరించడంలో ఈఎల్ హోల్డర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ అవకాశాలు పెరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం, 13 అన్వేషణ లైసెన్స్ బ్లాక్ల కోసం మార్చి 13, 2025న టెండర్ (ఎన్ఐటీ) ద్వారా మొదటి విడత కింద అన్వేషణ లైసెన్స్ మంజూరు కోసం ప్రారంభించిన ఏడు లోతైన, క్లిష్టమైన ఖనిజ బ్లాక్ల వేలాన్ని విజయవంతంగా ముగించింది. ఈ బ్లాక్లు ఆరు రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో బంగారం, రాగి, సీసం, జింక్, అరుదైన మూలకాలు, ప్లాటినం గ్రూప్ ఖనిజాలు లోతైన ప్రాంతాల్లో ఉన్నాయి.
దేశంలో క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాల లభ్యతను పెంపొందించడానికి, 2023 గనులు, ఖనిజాల (అభివృద్ధి - నియంత్రణ) సవరణ చట్టం 24 ఖనిజాల మైనింగ్ లీజులను, కాంపోజిట్ లైసెన్సులను క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాలుగా వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. గనుల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అయిదు విడతల వేలాన్ని ముగించింది. పలు రాష్ట్రాల్లోని 55 క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాక్ లను కవర్ చేసింది. ఇప్పటివరకు 34 బ్లాక్ లను విజయవంతంగా వేలం వేశారు. ఈ వేలం ద్వారా ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే లభిస్తుంది.
ఈ వేగాన్ని కొనసాగిస్తూ, గనుల మంత్రిత్వ శాఖ 16 సెప్టెంబర్ 2025న క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాల ఆరో విడత వేలాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో మైనింగ్ లీజు కోసం నాలుగు మినరల్ బ్లాక్లు, వివిధ రాష్ట్రాల్లో కాంపోజిట్ లైసెన్స్ కోసం 19 మినరల్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాక్ లలో ఆర్ఈఈ, టంగ్స్టన్, లిథియం, టిన్, గ్రాఫైట్, వనాడియం, టైటానియం, కోబాల్ట్, జిర్కోనియం, గాలియం, రాక్ ఫాస్ఫేట్, పొటాష్, అరుదైన లోహాలు వంటి విభిన్న ఖనిజాలు ఉన్నాయి.
***
(Release ID: 2166996)
Visitor Counter : 2