కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నల్సార్ విశ్వవిద్యాలయం, భారత కంపెనీ కార్యదర్శుల సంస్థ (ఐసీఎస్ఐ) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో ‘కార్ప్ కాన్- 2025’ జాతీయ సదస్సు
ఈఎస్జీ ఏకీకరణ, ఐబీసీ 3.0లను వివరించిన ఐఐసీఏ డీజీ, సీఈవో శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2025 11:24AM by PIB Hyderabad
2025 సెప్టెంబర్ 12న నల్సార్ విశ్వవిద్యాలయం, భారత కంపెనీ సెక్రటరీల సంస్థ (ఐసీఎస్ఐ) సంయుక్తంగా హైదరాబాదులో ఓ జాతీయ సదస్సును నిర్వహించాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల సంస్థ డైరెక్టర్ జనరల్, సీఈవో శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
సార్క్ లా హాల్లో నిర్వహించిన పర్యావరణం- సమాజం- పరిపాలన (ఈఎస్జీ) ఇతివృత్తంతో కార్ప్ కాన్- 2025 ప్రారంభ సదస్సు, అలాగే ఇన్సాల్వెన్సీ, దివాళా చట్టం (ఐబీసీ)పై సదస్సులకు నల్సార్ ఉప కులపతి ఆచార్య శ్రీ కృష్ణదేవరావు అధ్యక్షత వహించారు.
ఈఎస్జీని కార్పొరేట్ చట్టంలో అనుసంధానించడం, భాగస్వామ్య సిద్ధాంత ఔచిత్యం, ఐబీసీ మధ్యవర్తిత్వ పాత్ర, రాబోయే ఐబీసీ 3.0 సవరణలపై శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ తన ప్రసంగంలో వివరించారు. వాటాదారులందరి మధ్య విశ్వాసాన్ని, సమష్టి బాధ్యతను పెంపొందించడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
ప్రముఖులకు, ప్రతినిధులకు ఆత్మీయ ఆహ్వానం, జ్యోతీ ప్రజ్వలన, ఐసీఎస్ఐ నినాద గీతం ‘సత్యం వధ, ధర్మం చర’ ఆలాపనతతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
స్వావలంబన, పర్యావరణ సుస్థిరత, ఈఎస్జీ సూత్రాల అన్వయ ప్రాధాన్యాన్ని ఉప కులపతి తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. ఎం.సి. మెహతా (1985), టి.ఎన్. గోదావర్మన్ వంటి కీలక కేసులను ప్రస్తావించారు. ఈఎస్జీ, ఐబీఎల్ అధ్యయనాలను ముందుకు తీసుకెళ్లడంలో నల్సార్ - ఐసీఎస్ఐ సహకారం అత్యావశ్యకమన్నారు. ఈ సదస్సు నుంచి ఎంపిక చేసిన పత్రాలను ప్రచురించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ సదస్సులో ప్రముఖ వక్తలు ఆలోచనాత్మక ప్రసంగాలు చేశారు. స్వాయత్తం చేసుకోవడం, విలీనం, దివాలా, పునర్నిర్మాణం వంటి అంశాల్లో తన అనుభవాలను సీఎస్ పి.ఎస్. రావు వివరించారు. కార్పొరేట్ వ్యవహారాల్లో ఈఎస్జీ తీరుతెన్నులు, ఆచరణాత్మక సవాళ్లపై విలువైన సమాచారాన్ని వెల్లడించారు.
రోజువారీ జీవితంలో సుస్థిరత, ఈఎస్జీ పాఠ్యాంశాలు, సమష్టి భాగస్వామ్యం ఆవశ్యకమని శ్రీ ఇందర్జిత్ షా అన్నారు. టాటా, ఇన్ఫోసిస్, మహీంద్రా వంటి కంపెనీలు అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారు. ఈఎస్జీని ఓ ఎంపికగా కాకుండా అత్యావశ్యకంగా చూడాలన్న సీఎస్ రంజిత్ పాండే.. సీఎస్ఆర్తో పోలిస్తే అది భిన్నమైనదన్నారు. సంస్థాగత, చట్టపరమైన సహాయక ఏర్పాట్లపై చర్చించారు.
కార్యక్రమ నిర్వాహకులు, భాగస్వాములు, సహాయకులను ప్రొఫెసర్ పి. శ్రీనివాస సుబ్బారావు అభినందించారు. జ్ఞాపికలను అందజేయడం, ధన్యవాదాలతో సదస్సు ముగిసింది.
(రిలీజ్ ఐడి: 2166905)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23