నౌకారవాణా మంత్రిత్వ శాఖ
డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి సందర్భంగా ‘‘బిస్తీర్ణ పరోరే’’ పేరుతో బ్రహ్మపుత్రా నదిలో సంగీత భరిత నౌకా విహార యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్
తరగని దేశభక్తి భావన, బలమైన భారత్ స్వప్నం… భూపేన్ దా గళం: శ్రీ సర్బానంద సోనోవాల్
సాదియా నుంచి ధుబ్రీ వరకు సాగనున్న ‘‘బిస్తీర్ణ పరోరే’’...
బోగీబీల్, తేజ్పుర్, గువాహాటీ, జోగీఘోపా ఘట్టాలను దాటుతూ ఎలుగెత్తే బ్రహ్మపుత్ర కవి కీర్తిగానం
Posted On:
08 SEP 2025 9:59PM by PIB Hyderabad
భారత్ రత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతిని స్మరించుకొంటూ ‘‘బిస్తీర్ణ పరోరే: సాదియా నుంచి ధుబ్రీ వరకు సంగీతభరిత నౌకా విహార యాత్ర’’ పేరిట ఒక అద్వితీయ సాంస్కృతిక కదంబానికి కేంద్ర ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలోని భారత అంతర్దేశీయ జలమార్గ ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) శ్రీకారం చుట్టింది. ఈ యాత్రను తిన్సుకియాలోని గుయిజన్ ఘాట్లో సోమవారం (సెప్టెంబరు 8న) ఆరంభించారు. ఎంతో హుషారును నింపనున్న ఈ ఉత్సవ స్థాయి కార్యక్రమాన్ని బ్రహ్మపుత్ర ముద్దుబిడ్డ, కవి డాక్టర్ హజారికా మన దేశ ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు నివాళిగా ప్రారంభించారు.
ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభ కార్యక్రమానికి తన సందేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా అందించారు:
‘‘భారత్ రత్న డాక్టర్ భూపేన్ హజారికా భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరు. హృదయాన్ని తట్టి లేపే ఆయన గొంతు, అజరామరమైన సంగీతంతో... అస్సాం, ఈశాన్య భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ రంగస్థలం మీద ఆవిష్కరించారు. ఏకత్వం, మానవత, సోదరభావం.. ఈ సందేశాలు తొణికిసలాడే డాక్టర్ హజారికా పాటలు జాతి గుండెలో శాశ్వతంగా నిలిచిపోయేవే. భూపేన్ దా గొంతులో దేశభక్తి భావనతో పాటు సాధికార భారత్ అవతరించాలన్న స్వాప్నికత తొంగిచూస్తోంది. బ్రహ్మపుత్ర తీరవాసుల సుఖదుఖ్ఖాలను తన గళంతో మేళవించిన సాంస్కృతిక దిగ్గజానికి... ఆయన శతజయంతి పండుగ వేళ మనం... మన హృదయాంతరాళాల్లో నుంచి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆయన సంగీతంలో ఎక్కువ భాగం ఈ నది అందించిన స్ఫూర్తే. ఈ నదే ప్రస్తుత విహార యాత్ర రూపంలో, ఆయన కృతులను మనకు మరోసారి స్ఫురణకు తెస్తోంది.. ఇది ఆయన సార్వజనిక వారసత్వ ఉత్సవమే కాకుండా, ఆయన గొప్పతనాన్ని ఈ తరం వారికి పరిచయం చేయడం కూడా.’’
ఈ కార్యక్రమంతో పాటు డాక్టర్ భూపేన్ హజారికా స్మృతులను నెమరువేసుకొంటూ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఒక నదీ విహారయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఒక సాంస్కృతిక కళా బృందం, సంగీత కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి.
గుయిజన్ ఘాట్లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్రలేఖ దువారా సునయి స్వాగతోపన్యాసాన్నిచ్చారు. కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ సందర్భంగా దృశ్య మాధ్యమం ద్వారా సందేశాన్నిచ్చారు. పద్మ దులాల్ మాన్కీ, ధర్మేంద్ర బరువాలతో పాటు కాజల్ దేవ్ సహా ప్రముఖ కళాకారుల స్వరలహరి వీనులవిందుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఛబువా శాసనసభ్యుడు శ్రీ పొనకన్ బరువా, అస్సాం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి చైర్మన్ శ్రీ పులాక్ గొహైన్, అస్సాం ఒలింపిక్ సంఘం శ్రీ లఖ్యా కొన్వర్, మొరాన్ స్వయం ప్రతిపత్తి మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు శ్రీ అరుణ్ జ్యోతి మొరాన్, తిన్సుకియా మునిసిపాలిటీ బోర్డు చైర్మన్ శ్రీ పులక్ చేతియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాయంత్ర వేళకు ఈ విహార యాత్రా కార్యక్రమం డిబ్రూగఢ్ లోని బీగీబీల్ ఘాట్ వద్దకు చేరుకొంది. అక్కడ కూడా డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశ్నోత్తరాలు, చిత్రలేఖనం పోటీలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రకు చెందిన సమర్ హజారికా, సయ్యద్ సాదుల్లా, లోహిత్ గొగోయి, హృషికేశ్ గోస్వామితో పాటు రాగిణి కవఠేకర్ వంటి ప్రముఖ సంగీతకారులు, విశిష్ట వ్యక్తులు దృశ్య మాధ్యమం ద్వారా డాక్టర్ హజారికాకు శ్రద్ధాంజలి సమర్పించారు.
మోరన్, మొటోక్, టీ ట్రైబ్, సోనోవాల్ కఛారీ, హాజోంగ్లతో పాటు చూటియా సహా విభిన్న సముదాయాలకు చెందిన కళాకారుల బృందాలు డాక్టర్ భూపేన్ హజారికాకు నివాళులు అర్పిస్తూ, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చాయి. డాక్టర్ హజారికా అజరామర గేయాలను ప్రముఖ గాయని నీలాక్షి నియోగ్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఖువాంగ్ శాసనసభ్యుడు శ్రీ చక్రధర్ గొగోయి, భారత అంతర్దేశీయ జలమార్గ ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) డైరెక్టర్ (ఇంచార్జి) శ్రీ ప్రవీణ్ బోరా, డిబ్రూగఢ్ పురపాలక సంస్థ (డీఎంసీ) డిప్యూటీ మేయర్ శ్రీ ఉజ్వల్ ఫుకన్, అస్సాం పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏటీడీసీ) చైర్మన్ శ్రీ రితుపర్ణ బరువా, అస్సాం పెట్రోకెమికల్స్ సంస్థ చైర్మన్ శ్రీ బేకల్ డేకాలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ భూపేన్ హజారికా సేవలను కీర్తిస్తూ కేంద్ర ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలోని భారత అంతర్దేశీయ జలమార్గ ప్రాధికార సంస్థ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం అస్సాంలో అనేక ప్రాంతాలను చుట్టిరానుంది.
బ్రహ్మపుత్రతోపాటు ఆ నదికి చెందిన ఉపనదుల వెంబడి నివసిస్తున్న ప్రజల జీవనాన్నీ, జీవన సంఘర్షణలను డాక్టర్ హజారికా తన సుమధుర గీతాలాపనతో మేళవించారు. అస్సాంలో వైవిధ్య భరిత, సామాజిక, సాంస్కృతిక యవనికపై మనుషులంతా ఒక్కటేననీ, అందరికీ న్యాయం జరగాలన్న సార్వజనిక సందేశాన్ని ఆయన అందించారు.
బ్రహ్మపుత్ర నది లాగానే డాక్టర్ హజారికా అసాధారణ వారసత్వం కూడా సువిశాలంగా విస్తరించి, అస్సాం సాంస్కృతిక పరంపరతో పాటు భారతదేశ సాంస్కృతిక సంప్రదాయం ప్రపంచ రంగస్థలంపై ఆవిష్కరించింది. ఈశాన్య ప్రాంత సాంస్కృతిక సూత్రధారిగానే కాక మార్గదర్శిగా కూడా ప్రకాశిస్తున్న డాక్టర్ హజారికా శత జయంతిని ఈ అసాధారణ నదీ విహారయాత్ర సందర్భంగా స్మరించుకొంటూ, సంగీతం.. ఉత్సవాల సమ్మేళన మాధ్యమం ద్వారా వివిధ సముదాయాల వారిని ఏకతాటి మీదకు తీసుకువస్తున్నారు.
కార్యక్రమాల వివరాలు:
• బోగీబీల్, డిబ్రూగఢ్లో సెప్టెంబరు 8న
• సిల్ఘాట్, తేజ్పుర్లో సెప్టెంబరు 11న
• పాండు, గువాహాటీలో సెప్టెంబరు 15న
• ఐడబ్ల్యూఏఐ జెట్టీ, జోగీఘోపాలో నిర్వహించే కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు.
***
(Release ID: 2164918)
Visitor Counter : 5