నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తమిళనాడులోని వీవోసీ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్
స్వాతంత్య్ర సమరయోధుడు వీవో చిదంబరనార్ 154వ జయంతి సందర్భంగా
తమిళనాడులోని ట్యుటికోరిన్లో నివాళులర్పించిన కేంద్ర మంత్రి
“నౌకానిర్మాణంలో 2030 నాటికి టాప్ 10..
2047 నాటికి టాప్ 5 ప్రపంచ దేశాల్లో ఒకటిగా భారత్:” శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
05 SEP 2025 9:36PM by PIB Hyderabad
భారత మొట్టమొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ను కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు వీవో చిదంబరనార్ (వీవోసీ) ఓడరేవులో ప్రారంభించారు. ఇది భారత పరిశుద్ధ ఇంధన పరివర్తనలో ఒక కీలక ముందడుగు.
రూ. 3.87 కోట్ల వ్యయంతో నిర్మించిన 10 సాధారణ క్యూబిక్ మీటర్ పైలట్ కేంద్రం.. పోర్ట్ కాలనీలో వీధి దీపాలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల కోసం గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే మొదటి పోర్టుగా వీవోసీ పోర్టు అవతరించింది.
రూ. 35.34 కోట్ల వ్యయంతో 750 m³ సామర్థ్యం గల పైలట్ గ్రీన్ మిథనాల్ బంకరింగ్, రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీ సోనోవాల్ పునాది వేశారు. కాండ్లా-ట్యుటికోరిన్ మధ్య ప్రతిపాదిత కోస్టల్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్తో అనుసంధానించే ఈ కార్యక్రమం దక్షిణ భారతంలో కీలకమైన గ్రీన్ బంకరింగ్ హబ్గా వీవోసీ పోర్టును నిలుపుతుందని భావిస్తున్నారు.
"2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యం.. వేగం, స్థాయి, స్థిరత్వం, స్వయం-సమృద్ధిని మిళితం చేస్తుంది. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తాయి.. భారత ఆర్థిక ఆకాంక్షల సాధనలో తమిళనాడు కీలక పాత్రను ప్రతిబింబిస్తాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో.. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 10 నౌకా నిర్మాణ దేశాల్లో ఒకటిగా, 2047 నాటికి టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలిచే లక్ష్యాన్ని సాధించే దిశగా మనం కొత్త అడుగులు వేస్తూనే ఉన్నాం" అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన అదనపు ప్రాజెక్టుల్లో 400 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి. ఇది నౌకాశ్రయ రూఫ్టాప్ సోలార్ సామర్థ్యాన్ని 1.04 మెగా వాట్లకు పెంచింది. దేశంలోని నౌకాశ్రయాల్లో ఇదే అత్యధికం. కోల్ జెట్టీ-I ను పోర్ట్ స్టాక్ యార్డ్కు అనుసంధానించే రూ. 24.5 కోట్ల లింక్ కన్వేయర్ ప్రాజెక్టుతో దీని సామర్థ్యం 0.72 ఎంఎంటీపీఏకి పెరిగింది.
6 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం, రూ. 90 కోట్ల మల్టీ-కార్గో బెర్త్, 3.37 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి, తమిళనాడు మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం నిర్మాణాలకు కూడా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.
తమిళనాడులోని మూడు ప్రధాన ఓడరేవులైన చెన్నై, కామరాజర్, వీవోసీ ఓడరేవులు సాగరమాల కింద పరివర్తనాత్మక వృద్ధిని సాధించాయన్నారు. గత 11 సంవత్సరాల్లో రూ. 93,715 కోట్ల విలువైన 98 ప్రాజెక్టులు చేపట్టామనీ.. వాటిలో 50 ఇప్పటికే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. "ఇది ఒక ప్రత్యేకమైన వృద్ధి. ఆధునికీకరణ, సామర్థ్యం మెరుగుదల కోసం ఈ మూడు ఓడరేవుల్లోనే రూ. 16,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం" అని శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధులు వీ.వో. చిదంబరనార్ 154వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆయనకు నివాళులర్పించారు. చిదంబరనార్కు పుష్పాంజలి ఘటించిన అనంతరం శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ.. "నౌకౌయానం ద్వారా స్వదేశీ స్ఫూర్తిని రగిలించిన వీవోసీ వారసత్వం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మన నౌకాయానం, నౌకాశ్రయాల రంగాన్ని హరిత ఇంధనం, ఆవిష్కరణలు, స్వయం-సమృద్ధితో బలోపేతం చేస్తూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాం" అని వ్యాఖ్యానించారు.
హృదయపూర్వక మద్దతును అందించిన తమిళనాడు, తూత్తుకుడి ప్రజలకు శ్రీ సోనోవాల్ కృతజ్ఞతలు తెలిపారు. “మేం ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ప్రజల విశ్వాసం, సహకారంతోనే సకాలంలో పూర్తి చేయగలుగుతున్నాం. భారత వృద్ధికి వేగం, స్థాయి, నిబద్ధతలను మిళితం చేస్తూ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది” అని శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వీవోసీ పోర్ట్-ఐపీఆర్సీఎల్ మధ్య ఔటర్ హార్బర్ ప్రాజెక్టుకు రైలు కనెక్టివిటీ కోసం.. పోర్ట్ వద్ద గ్రీన్ మొబిలిటీ కార్యక్రమాల అమలు కోసం ఎన్టీపీసీతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఎమ్వోపీఎస్డబ్ల్యూ కార్యదర్శి శ్రీ టీకే రామచంద్రన్, మంత్రిత్వ శాఖకు చెందిన, తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2164425)
Visitor Counter : 2