సహకార మంత్రిత్వ శాఖ
సహకార బ్యాంకులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) అనుసంధానం
Posted On:
20 AUG 2025 2:50PM by PIB Hyderabad
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రాజెక్టులో భాగంగా, ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న పీఏసీఎస్లన్నింటినీ ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) ఆధారంగా పనిచేసే ఒక ఉమ్మడి జాతీయ సాఫ్ట్వేర్ ప్లాట్ఫాంలోకి తీసుకొస్తున్నారు. ఇది వాటిని రాష్ట్ర సహకార బ్యాంకు (ఎస్టీసీబీ)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల మాధ్యమం ద్వారా ‘నాబార్డు’తో కలుపుతుంది. ఈ ఉమ్మడి ఈఆర్పీ సాఫ్ట్వేర్ను దేశవ్యాప్తంగా అన్ని పీఏసీఎస్లకు అందజేశారు. దీంతో పీఏసీఎస్ల కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంతటిని రుణ డేటాతో పాటు రుణేతర డేటాను కూడా.. సేకరించేందుకు వీలుంటుంది. ఈఆర్పీ ఆధారిత ఉమ్మడి జాతీయ సాఫ్ట్వేర్.. ఒక ఉమ్మడి అకౌంటింగ్ వ్యవస్థ (కామన్ అకౌంటింగ్ సిస్టమ్.. సీఏఎస్) పీఏసీఎస్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది పాలనను, పారదర్శకత్వాన్ని పటిష్ఠపరుస్తుంది. ఫలితంగా రుణాల మంజూరు వేగవంతం అవుతుంది. లావాదేవీలకయ్యే ఖర్చులూ తగ్గుతాయి.. చెల్లింపుల్లో అసమానతలు కనీస స్థాయికి పరిమితం అవుతాయి. డీసీసీబీలతో పాటు ఎస్టీసీబీలతో అకౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది.
సహకార బ్యాంకింగ్ వ్యవస్థల మధ్య డేటా భద్రత, సైబర్ భద్రత, వివిధ బ్యాంకుల నడుమ చక్కని నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడానికి పట్టణ సహకార బ్యాంకు (యూసీబీ)ల కోసమంటూ ‘నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ (ఎన్యూసీఎఫ్డీసీ) పేరుతో ఒక సంఘటిత సంస్థ (అంబ్రెల్లా ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి బలాలను సద్వినియోగపరుచుకుంటూ, సహకారాన్ని పెంచుకుంటూ, నవకల్పనలను ప్రోత్సహిస్తూ సహకార బ్యాంకు సేవలు ఒక్కొక్కటిగా డిజిటలీకరణ స్థితికి చేరుకొనేటట్లు చూడాలన్నది దీని ఉద్దేశం. డిజిటల్ యుగంలోని సంక్లిష్టతలను సభ్య బ్యాంకులు ప్రభావవంతంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి వాటికి మార్గదర్శనం చేయడం కూడా ఈ సంస్థ మరో ధ్యేయం.
దీనికి అదనంగా, గ్రామీణ సహకార బ్యాంకు (ఆర్సీబీ)లకు సాంకేతిక సేవలను సమకూర్చడానికి, వాటిని పటిష్ఠపరచడానికి ‘సహకార్ సారథి’ని ఏర్పాటు చేయడానికి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (‘నాబార్డ్’)కు ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
నాబార్డ్ తన వంతుగా, 2020 నుంచి ‘సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఎగ్జామినేషన్ అండ్ ఇవాల్యుయేషన్ (సీఎస్ఐటీఈ) యూనిట్’ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఆర్సీబీల పరిధిలో సైబర్ భద్రత పటిష్ఠంగా ఉండేలా పర్యవేక్షించడం, దీనికి సంబంధించిన నియమాలను తూచా తప్పక పాటించేటట్లు చూడడంతో పాటు సైబర్ భద్రత విషయంలో ఆర్సీబీలు తీసుకుంటున్న చర్యలకు తోడు మరిన్ని మెరుగైన చర్యలను సూచించడం ఈ విభాగం పని. ఇదే మాదిరిగా, 2020 ఫిబ్రవరి 6న గ్రామీణ సహకార బ్యాంకుల కోసం ఒక విస్తృత సైబర్ భద్రతా ఫ్రేంవర్కును కూడా ప్రవేశపెట్టారు. సైబర్ భద్రత అంశంపై ఒక వల్నరబిలిటీ ఇండెక్స్ (వీఐసీఎస్)ను ఆవిష్కరించారు. దీనిని నిర్దేశించిన నియంత్రణ చర్యలు అమలవుతున్న తీరును బ్యాంకులు స్వయంగా తామే మదింపు చేసుకోవడానికి, ‘సైబర్ భద్రత స్థితిని నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండడానికి ఉపయోగించుకొంటున్నాయి. మరో వైపు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా’ (సీఈఆర్టీ-ఐఎన్) ప్లాట్ఫాం ద్వారా సైబర్ భద్రత పరమైన తనిఖీలను, ఆడిట్లను నిర్వహించడం, సలహాలు-సూచనల పత్రాలను (అడ్వైజరీస్) జారీ చేయడంతో పాటు వివిధ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా అక్టోబరు నెలలో ‘సైబర్ భద్రతా అవగాహన మాసాన్ని’ సీఎస్ఐటీఈ నిర్వహిస్తోంది. ఈ నెల రోజుల్లో దృశ్య మాధ్యమం ద్వారా వర్క్షాపులను నిర్వహించడం, శిక్షణ ప్రధాన సామగ్రితో పాటు డిజిటల్ సమాచారం తదితర సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు.
సహకార బ్యాంకుల రంగంలో సైబర్ భద్రత విషయంలో ఆందోళనలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామీణ సహకార బ్యాంకు (ఆర్సీబీ)లతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)లను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఒక సమగ్ర సైబర్ బీమా విధానాన్ని తీసుకువచ్చారు. బ్యాంకులు ఒకదానితో మరొకటి పరస్పరం ముడిపడిపోయిన ఈ కాలంలో తరచుగా సైబర్ ముప్పుల బారిన పడుతున్న ఆర్సీబీల డిజిటల్ వ్యవస్థలను, కీలక ఆర్థిక సమాచారాన్ని సంరక్షించడానికి తీసుకున్న ఒక ముందస్తు చర్యే ఈ సైబర్ బీమా విధానం. నాబార్డ్ మొట్టమొదటి సారి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 193 ఆర్సీబీలు, ఆర్ఆర్బీలకు సైబర్ ఇన్సూరెన్స్ రూపంలో రక్షణను అందించింది. ఇంతవరకు, మొత్తం 231 ఆర్సీబీలకు, 21 ఆర్ఆర్బీలతో పాటు 2 యూసీబీలకు కూడా సైబర్ బీమా కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ రక్షణను కల్పించింది.
ఈ సమాచారాన్ని సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రాజ్య సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు.
***
(Release ID: 2158732)