మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవంలో విశిష్ట అతిథులకు సత్కారం మహిళలు, బాలల సాధికారత కల్పనకు కృషి చేసినందుకు ఈ గౌరవం
Posted On:
13 AUG 2025 10:34PM by PIB Hyderabad
ఈ నెల 15న మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలు నిర్వహించే సంబరాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎర్ర కోట నుంచి నాయకత్వం వహించనున్నారు. చరిత్రాత్మక కట్టడం బురుజుల మీది నుంచి జాతీయ జెండాను ప్రధానమంత్రి ఎగరేయడంతో పాటు, ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి 171 మంది విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. మహిళలకు, బాలలకు సాధికారతను కల్పించే దిశగా అంకితభావంతో సేవ చేయడంతో పాటు అత్యవసర సేవలను సమాజంలో చిట్టచివరి అంచెలోని వారికీ అందేటట్లు చూసినందుకు కట్టబెట్టిన గుర్తింపే ఈ విశిష్ట అతిథుల సత్కారం. గౌరవాహ్వానాన్ని అందుకున్న వారిలో అంగన్వాడీ కార్యకర్తలు, సీసీఐస్ కు చెందిన పర్యవేక్షకులు, బాల బాలికలు, పీఎం కేర్స్ కు చెందిన బాలలు, ఓఎస్సీలలో విధులు నిర్వహించే సీడీపీఓ, డీసీపీఓ సిబ్బందితో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మహిళలు, బాలల విభాగానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు.
ఈ విశిష్ట అతిథులు దేశవ్యాప్తంగా మహిళలకు, బాలలకు అవకాశాలను విస్తరించడంతో పాటు వారి జీవనాన్ని మెరుగుపరచడానికి క్షేత్ర స్థాయిలో అలుపెరుగక కృషి చేస్తున్నారు. పంద్రాగస్టుకు ఎర్ర కోటలో నిర్వహించే చారిత్రక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఈ అతిథులందరూ పాల్గొననున్నారు.
విశిష్ట అతిథులు ఈ నెల 13-16 మధ్య న్యూఢిల్లీలో ఉంటారు. వీరు రేపు ప్రతిష్ఠాత్మక పార్లమెంటు భవనం, ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ, కర్తవ్య పథ్ వంటి ప్రదేశాలతో పాటు ఇతర ముఖ్య కట్టడాలను సందర్శిస్తారు.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి ఇలా అన్నారు..: ‘‘మహిళలకు సాధికారతను కల్పించడం, బాలలను తీర్చిదిద్దడంతోనే నిజమైన దేశ నిర్మాణం మొదలవుతుందని మన గౌరవ ప్రధానమంత్రి తరచూ గుర్తు చేస్తుంటారు. ఈ నమ్మకానికి ప్రతీక.. ఈ విశిష్ట అతిథులు. క్షేత్ర స్థాయిలో తమ నిస్వార్థ కృషితో ఎన్నో కుటుంబాలకు ఆత్మగౌరవాన్నీ, అవకాశాల్నీ వీరు అందిస్తున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు వీరిని గౌరవించుకోవడమంటే అది ఒక దృఢతర, మరింత సమ్మిళిత భారత్ను సాకారం చేయడం కోసం వీరు కనబరుస్తున్న అంకితభావాన్ని పండుగ చేసుకోవడమే అవుతుంది.’’
మార్పునకు సారథులుగా ఉన్న వీరిని సన్మానిస్తున్నందుకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఎంతో సంతోషిస్తోంది. వీరి అచంచల నిబద్ధత, అంకిత భావం బలోపేతమైన, మరింత ఎక్కువ సమ్మిళిత భారత్ను ఆవిష్కరించడానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
***
(Release ID: 2156295)