జాతీయ మానవ హక్కుల కమిషన్
జూలై 28, 29లలో హైదరాబాద్లో ‘ప్రత్యేక బహిరంగ విచారణ’ చేపట్టనున్న జాతీయ మానవ హక్కుల కమిషన్
తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారులు సమక్షంలో వేగంగా న్యాయాన్ని అందించేందుకు విచారణ
మానవ హక్కులపై అవగాహన కోసం రాష్ట్రంలోని సీనియర్ అధికారులతో సమావేశం కానున్న కమిషన్
మానవ హక్కులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల కార్యక్రర్తలు, ప్రతినిధులతో కూడా భేటీ కానున్న కమిషన్
అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించనున్న ఎన్హెచ్ఆర్సీ
Posted On:
26 JUL 2025 10:54AM by PIB Hyderabad
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) 2025 జూలై 28, 29 తేదీల్లో తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్లో రెండు రోజులు పాటు ప్రత్యేక బహిరంగ విచారణ (ఓపెన్ హియరింగ్ అండ్ క్యాంప్ సెట్టింగ్) చేపట్టనుంది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ శ్రీ వి. రామసుబ్రమణియన్.. సభ్యులు జస్టిస్ (డాక్టర్) విద్యుత్ రంజన్ సారంగి, శ్రీమతి విజయ భారతి సయాని ఉదయం 10 గంటల నుంచి జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రంలో (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు. ఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యదర్శి శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్(దర్యాప్తు) శ్రీ ఆర్ పి మీనా, రిజిస్ట్రార్ (లా), శ్రీ జోగిందర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు దీనికి హాజరుకానున్నారు.
విచారణ సందర్భంగా చేపట్టనున్న కేసుల్లో పోలీసుల అధికార దుర్వినియోగం, ప్రభుత్వం ఇచ్చే వివిధ సామాజిక సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలను తిరస్కరించడం, జైళ్లలో అక్రమాలు.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మానవ హక్కులను పరిరక్షించడంలో నిర్లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హక్కులు.. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అక్రమ రవాణా వంటివి ఉన్నాయి.
జూలై 29న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఎన్హెచ్ఆర్సీ సమావేశం కానుంది. మానవ హక్కులకు సంబంధించిన వివిధ సమస్యలు, మానవ హక్కుల ఉల్లంఘన బాధితులకు త్వరితంగా న్యాయం అందించానికి ఉన్న ప్రాముఖ్యతపై వారికి అవగాహన కల్పించనుంది. సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమం ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన వివిధ సలహలపై రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు తీసుకున్న క్రీయాశీల చర్యలను కూడా కమిషన్ సమీక్షించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షక (హెచ్ఆర్డీ) ప్రతినిధులతో భేటీ కానుంది.
ఈ ప్రత్యేక బహిరంగ విచారణ కార్యక్రమం ఫలితాలు, ఎన్హెచ్ఆర్సీ తీసుకున్న చర్యలను విస్తృత స్థాయిలో తెలియజేసేందుకు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన బాధితులకు అక్కడికక్కడే త్వరిత న్యాయం అందించేందుకు 2007 నుంచి ఎన్హెచ్ఆర్సీ వివిధ రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రత్యేక బహిరంగ విచారణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత వారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, గుజరాత్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, మణిపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, అండమాన్-నికోబార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలలో ఈ కార్యక్రమాలను నిర్వహించింది.
***
(Release ID: 2148807)